Thursday, October 30, 2014

జయలలిత అమ్మ, దేవత ఎలా అయ్యారు?

తమిళనాడు, పురాచరిత్రకోణంనుంచి నాలో ప్రత్యేకమైన కుతూహలం రేకెత్తిస్తూ ఉంటుంది. ఆ రాష్ట్రం పురాచరిత్రకు స్పష్టమైన వర్తమాన ప్రతిబింబంలా అనిపిస్తుంది. అవినీతి ఆరోపణలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత రెండోసారి జైలుకు వెళ్ళి పదిహేనురోజులు ఉండిరావడమే చూడండి... ఆమె జైలుకు వెళ్లినప్పుడు అభిమానులు, అనుయాయుల నిరసనతో రాష్ట్రం అట్టుడికింది. ఆ నిరసనలో కోపమే కాక, దుఃఖం కూడా ఉంది. భవిష్యత్తు గురించి భయం కూడా ఉండచ్చు. తమ నాయకుడు/నాయకురాలు ఇలాంటి విషమపరిస్థితిలో చిక్కుకున్నప్పుడు అభిమానులు ఆత్మహత్యకు సైతం పాల్పడడం తమిళనాడులోనే ఎక్కువగా చూస్తుంటాం. ఈసారి కూడా ఆత్మహత్యలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఎవరూ ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని జయలలిత విజ్ఞప్తి కూడా చేశారు. సరే, రాజకీయనాయకులు చేసే అలాంటి విజ్ఞప్తిలో, తనకు ఇంత అభిమానుల బలం ఉంది సుమా అని ఇతరులకు చేసే ఒక హెచ్చరికా ఇమిడి ఉంటుంది, అది వేరే విషయం.

Wednesday, October 29, 2014

నల్లధనం రప్పించడం దేవుడెరుగు...కనీసం నల్లధనంపై నికరమైన సమాచారానికైనా ప్రజలు నోచుకోలేదా?

మనం సమాచారయుగంలో ఉన్నామంటారు...ప్రపంచంలోని ఏమూల సమాచారమైనా ఇప్పుడు కేవలం ఒక్క క్లిక్ దూరంలో ఉందంటారు. 24 X 7 న్యూస్ చానెళ్ల సంగతి సరేసరి. కానీ నిజంగానే మనకు అందవలసినంత సమాచారం అందుతోందా???

లేదనడానికి అనేక ఉదాహరణలు కనిపిస్తూ ఉంటాయి. నల్లధనం గురించిన విషయాలే తాజా ఉదాహరణ.

1. విదేశాలనుంచి అందిన ఖాతాదారుల పేర్లు బయటపెట్టడానికి ఆ దేశాలతో చేసుకున్న ఒప్పందాలు అడ్డు వస్తాయని కేంద్రం సుప్రీం కోర్టుకు చెప్పింది.

2. దాంతో సుప్రీం కోర్టు కోప్పడింది. సరే నని ప్రభుత్వం మూడుపేర్లు బయటపెట్టింది.

3. మూడు పేర్లేమిటి, మొత్తం పేర్లన్నీ మాకు ఇవ్వండని అంటూ సుప్రీం కోర్టు మళ్ళీ అంది. సరేనని కేంద్రం ఈసారి 627 పేర్లతో ఒక జాబితా సీల్డు కవర్ లో పెట్టి సుప్రీం కోర్టుకు ఇచ్చింది. సుప్రీం కోర్టు ఆ జాబితాను సిట్ కు ఇచ్చి నెల రోజుల్లో దానిపై ఏం చేశారో నివేదిక ఇమ్మని అడిగింది. ఈసారి పేర్లు వెల్లడించమని కోర్టు అనలేదు.

4. విచిత్రంగా ఇంకో మాట వినిపించింది. సిట్ కు ప్రభుత్వం ఆ జాబితాను జూన్ లోనే ఇచ్చిందట. అంటే ఏం జరిగిందన్నమాట? సిట్ దగ్గర ఇప్పటికే ఉన్న జాబితానే సుప్రీం కోర్టు మళ్ళీ సిట్ కి ఇచ్చిందన్న మాట.

5. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో పనిచేస్తున్న సిట్ కు జూన్ లోనే జాబితా ఇచ్చామన్న సంగతి కోర్టుకు ప్రభుత్వం ముందే చెప్పినట్టు లేదు. సిట్ కూడా చెప్పినట్టు లేదు. ఎందుకు చెప్పలేదో తెలియదు. మరచిపోయిందా?

6. ఆపైన ఇంకో ప్రశ్న. జూన్ లోనే జాబితా తీసుకున్న సిట్ దాని మీద ఇన్ని మాసాల్లో ఏం చేసింది? తెలియదు.

7. ప్రభుత్వం ఇచ్చిన జాబితాలో పేర్లు ఒప్పందంలో భాగంగా విదేశాలనుంచి అందినవి కావు. ఒక HSBC బ్యాంక్ ఉద్యోగినుంచి ఫ్రాన్స్ అడ్డదారిలో సంపాదించి మనదేశానికి ఇచ్చిన పేర్లు. అంటే వాటికి ఒప్పందాలు వర్తించవు. అయినా ప్రభుత్వం ఒప్పందాలు అడ్డువస్తాయని ఎందుకు అంది? తెలియదు.

8. తాజాగా మరో వార్త. ఆ జాబితాలోని 150 పేర్లవారి కేసులు ఇప్పటికే ప్రభుత్వం సెటిల్ చేసేసిందనీ, వారిమీద ఇప్పుడు కొత్తగా తీసుకునే చర్యలు ఏవీ లేవని ఆదాయం పన్ను శాఖ అధికారులు అన్నారట. మరో 120 మంది తమకు విదేశంలో ఖాతా లేదని చెప్పారట. అలాంటప్పుడు ఖాతా ఉందని నిరూపించడం కష్టమట. ఎందుకంటే, ఆ జాబితా అడ్డదారిలో అందింది కనుక బ్యాంక్ సహకరించదట.

9. అన్నింటికన్నా పెద్ద షాక్ కు మనం సిద్ధంగా ఉండాలి. ఆదాయం పన్ను శాఖ అధికారుల ప్రకారం, నల్లధనం మహా ఉంటే 3వేల కోట్లను మించదట. దాన్ని దేశానికి రప్పించడం కూడా కష్టమట. మనం ఏళ్ల తరబడిగా వింటున్నది, లక్షల కోట్లలో ఉంటుందని! ఈ మాత్రం సమాచారం ఆదాయం పన్ను శాఖవారు ఇన్నేళ్లలోనూ ఎప్పుడూ ఇవ్వకుండా ఎందుకు ఊరుకున్నారో తెలియదు. ఇప్పుడు ఈ భోగట్టా వారినుంచి తీసుకున్న మీడియా వారు ఇంతకాలం ఎందుకు ఆ పని చేయలేదో తెలియదు.

దీనంతటిని బట్టి ఏమనిపిస్తోంది? నల్లధనం బయటపడడం సంగతి దేవుడెరుగు...నల్లధనం గురించిన పూర్తి సమాచారమైనా ఎప్పటికైనా బయటపడుతుందా అనిపించడం లేదా???





Monday, October 27, 2014

నల్ల కుబేరుల దగ్గర రాజకీయ పార్టీలే విరాళాలు మెక్కినప్పుడు నల్లధనంపై యుద్ధం చేసేది ఎవరు?

నల్లధనం తిమింగలాలనో, మొసళ్ళనో బయట పెడుతుందనుకుంటే ప్రభుత్వం మూడు చిరు చేపల్ని బయటపెట్టింది. అయితే నాకిది అంత ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే కిందటి ప్రభుత్వం కూడా ఇలాంటి చిరుచేపల్నే బయటపెట్టింది. కనుక అద్భుతాలను ఊహించలేదు. అదీగాక, ప్రభుత్వం బయటపెట్టబోయే పేర్లలో పెద్ద పేర్లు ఏవీ ఉండకపోవచ్చని మీడియా ముందే ఉప్పు అందించింది.

ఈ పేర్ల వెల్లడి కన్నా నన్ను ఆశ్చర్యపరిచింది, షాక్ ఇచ్చింది ఏమిటంటే; వీళ్లలో ఇద్దరు కాంగ్రెస్, బీజేపీలు రెండింటికీ విరాళాలు ఇచ్చిందన్న సంగతి. ఇందులో ఒక కంపెనీ బిజెపీకి 9 సార్లు మొత్తం కోటి రూపాయలకు పైగా విరాళం ఇస్తే, కాంగ్రెస్ కు 3 పర్యాయాలుగా 60 లక్షలకు పైగా విరాళం ఇచ్చిందట.

ఆ లెక్కన ఇప్పుడు ప్రభుత్వం వద్ద ఉందని అంటున్న 800 మంది జాబితాలోని నల్లధనస్వాములలో ఎంతమంది, ఎంత మొత్తాల్లో ఈ పార్టీలకు విరాళాలు ఇచ్చి ఉంటారు?! వీళ్లలో ఎంతమందిని చట్టాన్ని అప్పగించి, ఎంతమందిని దొడ్డి దోవన వదిలేసే ప్రయత్నం చేస్తారు? వాళ్ళు ఇచ్చిన మొత్తాలను బట్టి, రేపు ఇవ్వగలిగిన స్తోమతను బట్టి చట్టానికి అప్పగించడం, లేదా వదిలేయడం ఉంటాయేమో!

నల్లధనంపై ప్రభుత్వాల యుద్ధం ఎంత గొప్పగా ఉంటుందో తెలిసిపోవడం లేదా?

నల్లధనం, రాజకీయం ఇలా పాలు, నీళ్లలా కలసి పోయినప్పుడు, రెండింటినీ విడదీసి ప్రజలకు చూపించి, శిక్షించడానికి సరికొత్త రాజకీయహంసను ఏ మానససరోవరం నుంచి తీసుకొస్తారు?

నల్లధనం కొండచిలువల పేర్ల వెల్లడి ఇంకా ఎలాంటి చిత్రవిచిత్రాలను సృష్టిస్తుందో చూస్తూ ఉందాం. 

Sunday, October 26, 2014

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడు?

ఇంతకీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకోవాలి?!

దీని మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

1953, అక్టోబర్ 1న మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్రరాష్ట్రం అవతరించింది. అప్పటికి తెలంగాణ ఆంధ్రరాష్ట్రంలో భాగం కాదు.

1956లో తెలంగాణ కూడా కలసిన తర్వాత నవంబర్ 1న ఏటా అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాం.

ఇప్పుడు తెలంగాణ వేరుపడింది. కనుక ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడన్న ప్రశ్న తలెత్తింది.

తెలంగాణాను కూడా కలుపుకుని ఆంధ్రప్రదేశ్ అవతరించిన నవంబర్  1కి, తెలంగాణ వేరుపడడంతో రెలెవెన్స్ పోయింది. కనుక ఆ రోజున అవతరణ దినోత్సవం జరుపుకోవడంలో సాంకేతికంగానూ, ఔచిత్యపరంగానూ కూడా అర్థంలేదు.

ఇక మిగిలింది ఆంధ్రరాష్ట్ర అవతరణ తేదీ అయిన అక్టోబర్ 1. ఆరోజున జరుపుకోవడం కన్నా మరో మార్గం కనిపించడంలేదు.

ఆ లెక్కన ఆంధ్రప్రదేశ్ అనే పేరు అప్పటికి లేదుకనుక అదెలా కుదురుతుందనే ప్రశ్న రావచ్చు.

మొత్తం మీద ఇది చిక్కు ప్రశ్నే.




Friday, October 24, 2014

జార్జి ఫెర్నాండెజ్...అబ్దుల్ కలాం...వాజ్ పేయి...ఎలా ఉన్నారు?

మాజీ రక్షణమంత్రి, ప్రముఖ సోషలిస్టు నాయకుడు, బరోడా డైనమైట్ కేసు నిందితుడు జార్జి ఫెర్నాండెజ్ ఎలా ఉన్నారు? ఆయన గురించి ఈ మధ్య ఎలాంటి వార్తా లేదు. బెంగళూరులో ఎవరినీ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్టు మాత్రం చాలా కాలం క్రితం ఒక వార్తా విన్నాం. అంతే. మళ్ళీ ఆయన గురించి ఎలాంటి సమాచారం లేదు.

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి కూడా ఈ మధ్య వార్తలు లేవు. ఆయన ఎలా ఉన్నారో? ఏం చేస్తున్నారో? ఆ మధ్య వరకు ఆయన విద్యార్థులతో అప్పుడప్పుడు ఇంటెరాక్ట్ అవుతూ వార్తలలో ఉండేవారు. ఇప్పుడు ఆయన గురించి ఏ సమాచారమూ లేదు.

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి గురించి  గట్టిగా ఏదైనా వార్త వచ్చిఅయిదేళ్లు అయిందేమో! ఈ మధ్య మోడి ప్రధాని అయిన తర్వాత వాజ్ పేయి ఇంటికి వెళ్ళి ఆయనను సందర్శించినట్టు వార్త వచ్చింది. అదొక్కటే ఆయనతో ముడిపడిన  చిట్టచివరి వార్త.

బొత్తిగా వార్తలలోలేని ఈ ముగ్గురు ప్రముఖులే ప్రస్తుతానికి నాకు గుర్తొస్తున్నారు. ఇంకా చాలామందే ఉండచ్చు. ఇలాంటి వార్తలలోలేని ప్రముఖులు/ లేదా ఒకమాదిరి ప్రముఖులు  పదిమందితో ఒక జాబితా తయారు చేయచ్చా?

మీరూ ప్రయత్నించండి. 

Thursday, October 23, 2014

మోడి ప్రభుత్వం ధరలు ఎలా తగ్గించగలిగింది?

నాకు గుర్తు ఉన్నంతవరకు 2010 నుంచీ ద్రవ్యోల్బణం ఎక్కువవడం ప్రారంభించింది. ఇన్నేళ్లలోనూ అది తగ్గిన దాఖలా లేదు. అప్పుడప్పుడు ఏ కొంచెమో తగ్గినట్టు అనిపించినా అది లెక్కలోది కాదు. ధరలు తగ్గాయి అనుకునేటంతగా ఎప్పుడూ తగ్గలేదు.

యూపీఏ ప్రభుత్వం అందుకు రకరకాల కారణాలు చెబుతూ వచ్చింది. ఆహారపదార్థాల ద్రవ్యోల్బణానికే వస్తే, ఆర్థిక స్తోమత పెరుగుతుండడం వల్ల ఇప్పుడు అన్ని తరగతుల వారూ పప్పులు, కూరగాయలు ఎక్కువగా వాడుతున్నారనీ, ఆవిధంగా ఆహారపదార్థాల వినియోగం పెరిగిందనీ, అందుకు తగ్గట్టు వాటి ఉత్పత్తి పెరగలేదనీ ఒక కారణం. ధరలు తగ్గించడం ఎక్కువగా రాష్ట్రప్రభుత్వాల పరిధిలోకి వస్తుందనీ, అవి తీసుకోవలసిన చర్యలు తీసుకోవడం లేదనీ ఇంకొక కారణం.

కానీ ఇప్పుడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాగానే కొన్ని మాసాలలోనే ద్రవ్యోల్బణానికి కళ్ళెం వేయగలిగినట్టు చెబుతున్నారు. ఇదెలా జరిగిందో నిజంగా ఆశ్చర్యం. అయితే, యూపీఏ ప్రభుత్వం అన్నేళ్లలోనూ ఆ పని ఎందుకు చేయలేకపోయిందో, మోడీ ప్రభుత్వం ఎలా చేయగలిగిందో, అందుకు ఏం చేసిందో ఎవరైనా విశ్లేషించినట్టు నా దృష్టికి రాలేదు. అలాగే యూపీఏ లో సంబంధిత శాఖకు మంత్రిగా ఉన్న శరద్ పవార్ ఎక్కడ విఫలమయ్యారో కూడా ఎవరూ రాసినట్టు లేదు.

ఇంత అవసరమైన విషయం మీద పెద్దగా చర్చ కనిపించకపోవడం ఆశ్చర్యంగానే అనిపిస్తోంది. ఒకవేళ ఎవరైనా విశ్లేషించి ఉంటే సంబంధిత లింక్ ఇవ్వగలరని కోరుతున్నాను. 

Wednesday, October 22, 2014

పురాతన దేవాలయాలు కొండల మీదా, గుట్టల మీదా ఎందుకు ఉంటాయి?

ప్రసిద్ధ దేవాలయాలు అనేకం కొండలు, గుట్టలు, అడవుల్లో ఉండడానికి కూడా అనేక కారణాలను చెప్పుకోవచ్చు. వ్యవసాయ విస్తరణలో భాగంగా ఆటవిక, గిరిజన తెగలు ఉన్న కొత్త కొత్త ప్రదేశాలకు జనావాసాలను విస్తరించేవారు. వ్యవసాయ విస్తరణ, జనావాసాల విస్తరణ అంటే రాజ్యవిస్తరణే. శ్రీశైలంలోని ఆలయమే కాక, తమిళనాడు మొదలైన రాష్ట్రాల్లో కూడా పురాతన దేవాలయాలు అనేకం ఎత్తైన, పటిష్టమైన ప్రాకారాలతో, ద్వారాలతో, బురుజులతో అక్షరాలా కోటలను తలపిస్తూ ఉంటాయి. ఆవిధంగా పుణ్యక్షేత్రం రాజులకు రెండవ రాజధానిగా ఉండేదనుకోవచ్చు. దేవుడికి చేసే ఉపచారాలు కూడా రాజోపచారాలే.

(పూర్తివ్యాసం http://magazine.saarangabooks.com/2014/10/22/%E0%B0%88%E0%B0%9C%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%88%E0%B0%B6%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%82%E0%B0%9C/ లో చదవండి) 

Tuesday, October 21, 2014

ఇందిరా గాంధీ, మోడీల పోలిక గురించి మరోసారి...

ప్రతివారికీ రూపాయిలలో తూచడానికి ఏమాత్రం విలువ లేని చిన్న చిన్న సంతోషాలు ఉంటూఉంటాయి. సాధారణంగా ఆ సంతోషం విలువ వాళ్ళకే తెలుస్తుంది. ఎవరికైనా అది చెబితే, 'ఓస్, అంతేనా? అదో గొప్ప విషయమా' అనేయచ్చు. ఎవరూ గుర్తించని పరిస్థితిలో వాళ్ళే దానిని వెల్లడించుకుని వాళ్ళ భుజం వాళ్ళే తట్టుకోవలసి వస్తుంది.

ఇప్పుడు నేను చేయబోతున్నది అదే!

నాకు కూడా చిన్న చిన్న సంతోషాలు ఉన్నాయి. అవి మరేం కాదు, ఆయా అంశాలలో నా అంచనాలు గురికి చాలా దగ్గరగా వెళ్లినప్పుడు కలిగే సంతోషాలు. అటువంటివి ఇదే బ్లాగులో కొన్ని ఇంతకుముందు పాఠకులతో పంచుకున్నాను. అది కూడా ఏడాది పైనే అయినట్టుంది. వాటిలో ఒకటి, నరేంద్ర మోడీ వ్యవహారశైలి ఇందిరాగాంధీ వ్యవహారశైలికి చాలా దగ్గరగా ఉంటుందన్నది. తెలంగాణవాదులు చాలా అదృష్టవంతులనీ, కేంద్రంలో యూపీఏ కాకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండి ఉంటే, తెలంగాణ ఇప్పట్లో వచ్చేది కాదనీ కూడా అన్నాను. ఎందుకు వచ్చేది కాదో కూడా చెప్పాను. అందుకు కారణం నరేంద్ర మోడీ స్వభావంలోనే ఉందని చెప్పాను. సరిగ్గా ఇందిరా గాంధీది కూడా అదే స్వభావం అన్నాను.

ఇందిరా గాంధీ, నరేంద్ర మోడీల స్వభావం ఎలాంటిదంటే, తమ ఎజెండాలను ఇతరులతో అమలు చేయించడమే తప్ప ఇంకొకరి ఎజెండాలను వారు స్వీకరించే ప్రశ్నే లేదు. తెలంగాణకానీ, ఇంకొకటి కానీ వాళ్ళ ఎజెండాలో ఉంటేనే ఉంటుంది, లేకపోతే ఉండదు. అంతే. అవతలి వాళ్ళది ఎంత బలవత్తరమైన ఎజెండా అయినా సరే.

ఇంకొకటి ఏమిటంటే, ఈ స్వభావం వాళ్ళకి తాము చేయదలచుకున్నదానిపై ఒక కచ్చితమైన ప్రణాళిక ఉంటుంది. దానిని ముందుకు తీసుకెళ్లే తెగువ ఉంటుంది. అది మంచిదే కావచ్చు, కాకపోవచ్చు. ఆ ప్రణాళికకు కలసివచ్చే మేరకే వారు ఇతరుల ఎజెండాకు సందు ఇస్తారు. కలసి రాకపోతే ఇవ్వరు.

అలాగే, వీరు తమ ఎజెండాలో ఉంటే తప్ప స్టేటస్ కొ ను చెరపడానికి ఇష్టపడరు. అవతలి వాళ్ళ ఎజెండా సంక్షోభస్థాయికి వెళ్ళి తమ మీద ఒత్తిడిని పెంచిన కొద్దీ, ఆ ప్రమాణంలోనే వీరు దానిని ఎదుర్కొని తమ విధానాన్నే నెగ్గించుకోడానికి చూస్తారు.

ఇతరులు తమ వైఫల్యాలనో, లోపాలనో ఎత్తి చూపుతూ విమర్శలను తీవ్రం చేసిన కొద్దీ ఒక మాదిరి వాళ్లైతే జంకి కనీసం చూపులకైనా దిద్దుబాటుకు పూనుకున్నట్టు కనిపిస్తారు. కానీ ఈ స్వభావం ఉన్న వాళ్ళు అలా కాదు. విమర్శల తీవ్రత పెరుగుతున్న కొద్దీ తమలో ఎత్తి చూపే లోపాలను, వైఫల్యాలను సరిదిద్దుకోకూడదన్న పట్టుదల వీళ్లలో పెరుగుతూ ఉంటుంది. ఇందిరా గాంధీ స్వభావంలోని ఆ లక్షణమే ఆమెను ఎమెర్జెన్సీ వైపు అడుగు వేయించింది. జయప్రకాశ్ నారాయణ్ వంటి వారిని కూడా జైల్లోకి తోయించింది.

మోడీ విషయానికి వస్తే, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మంత్రివర్గంలోఅవినీతి ఆరోపణలున్న ఇద్దరిని తప్పించలేదని తీవ్ర విమర్శలు వస్తున్నాసరే,  ఆయన వారిని తప్పించలేదు. విమర్శలు రావడమే అందుకు కారణం. ఒకవేళ విమర్శలు రాకపోతే తప్పించేవారేమో. అమిత్ షా పై అంతకంటే ఎక్కువ విమర్శలు వచ్చినప్పటికీ ఆయనను బిజెపి అధ్యక్షుని చేయడం కూడా అలాంటిదే. కళ్లేలు తమ చేతుల్లో ఉన్నప్పుడు గుర్రం ఎలా పరిగెడితే ఏం లే అన్న ధీమా వీళ్లలో ఉంటుంది.

ప్రశంసనీయమైన పనులు  చేయడంలోనూ ఈ స్వభావం ఉన్నవాళ్ళు అంతే తెగువను, పట్టుదలను ప్రదర్శిస్తారు. ఇందిరా గాంధీ బంగ్లాదేశ్ అవతరణలో నిర్వహించిన పాత్ర అలాంటిదే. నరేంద్ర మోడీ మీద కూడా చాలామందికి అలాంటి ఆశలే ఉన్నాయి. నికరంగా ఆయన ఏం చేస్తారో ముందు ముందు చూడవలసిందే.

ఇంతకీ ఇప్పుడు ఇదంతా ఎందుకు ఏకరవు పెడుతున్నానంటే, నేను నరేంద్ర మోడీని ఇందిరాగాంధీతో పోల్చే నాటికి తెలుగు మీడియాలో కానీ, జాతీయ మీడియాలో కానీ ఎవరూ ఆ పోలిక తేగా నేను చూడలేదు. మోడీ ప్రధాని అయ్యాక రెండు నెలలకు కాబోలు జాతీయ మీడియాలో ఆ పోలిక ఒకే ఒకసారి ప్రస్తావనకు వచ్చింది. తాజాగా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల సందర్భంలో ఒక టీవీ చానెల్ చర్చ సందర్భంలో ఇందిరాగాంధి మార్గంలో మోడి వెడుతున్నారా? అనే ప్రశ్నను ముందుకు తెచ్చింది.

శివసేన విషయంలో gambling కు మోడీ సాహసించడంలో కూడా పైన చెప్పిన స్వభావమే ఉంది. శివసేనతో ఆయనకు ప్రధాని కావడానికి ముందునుంచీ వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. ప్రస్తుత పరిణామాలలో వాటి పాత్ర ఉండే తీరుతుంది. ఇక్కడ కూడా శివసేనే తన దారికి రావాలి తప్ప తను దాని దారికి వెళ్ళే ప్రశ్న లేదు. ఎంత రిస్కు కైనా సిద్ధపడే తెగింపు స్వభావం అది.

ఇక్కడ తెలంగాణ లానే అక్కడ విదర్భ ఉంది. విదర్భను ప్రత్యేకరాష్ట్రం చేయడానికి తాము సుముఖమే నన్న భావనను ఆ ప్రాంత ప్రజల్లో బిజెపి కలిగించింది. కానీ మోడి దగ్గర అలాంటివేమీ కుదరవు. .చిన్న రాష్ట్రాల నినాదాన్ని బిజెపి ఇక వదలుకోవచ్చు. నా అంచనాలో మోడీ ఇక ఏ రాష్ట్రాన్ని విభజించడానికి ఒప్పుకోరు, ఉత్తర ప్రదేశ్ లాంటి మరీ పెద్ద రాష్ట్రమైతే తప్ప. అసలు అలాంటి నినాదమే తల ఎత్తకుండా చూసే వ్యవహారశైలి ఆయనది.


Sunday, October 19, 2014

ఎన్సీపీ ముక్త్ మహారాష్ట్ర నినాదం ఎందుకు ఇవ్వలేదో?!

ఎగ్జిట్ పోల్స్ వచ్చాక , అందులోనూ అవి ఫలితాలను చాలావరకూ accurateగా  అంచనా వేయడం మొదలెట్టాక ఎన్నికల అసలు ఫలితాల మీద ఆసక్తి తగ్గిపొతోంది. ఎలక్ట్రానిక్ మీడియా దీనిని ఎందుకు గమనించడం లేదో తెలియదు. అసలు ఫలితాల రోజున రోజంతా టివి చానెళ్ళ ముందు జనాన్ని కదలకుండా కూర్చోబెట్టాలన్న  దాని లక్ష్యానికి ఇది   పనికొచ్చేది కాదు. అయినా ఎగ్జిట్ ఫలితాల పేరుతొ ఒకసారి , అసలు ఫలితాల పేరుతో  రోజంతా మరోసారి అవి ఎందుకు హడావుడి చేస్తున్నాయో అర్థం కాదు .

మహారాష్ట్ర, హర్యానా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఎగ్జిట్ ఫలితాలు ముందే చెప్పేశాయి. అన్ని సర్వేలు ఇంచుమించు ఒకే ఫలితాన్ని ఇచ్చాయి కనుక అసలు ఫలితాల సరళి కూదా అలాగే ఉండబోతున్నట్టు  మొదట్లోనే తెలిసిపోయింది కనుక బిజెపీ రెండు రాష్ట్రాలలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవడం పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. 

నాకైతే నిజంగా ఆశ్చర్యాన్ని మించి అసహ్యాన్ని కలిగించినది ఎన్సీపీ బిజెపీకి ఏకపక్షంగా బేషరతుగా బయటినుంచి మద్దతు ప్రకటించడం! ఆ పార్టీ నేత ప్రఫుల్ పటేల్ అభివృద్ధిని, మహారాష్ట్ర ప్రయోజనాలను కోరి సింగల్ లార్జెస్ట్ పార్టీగా గెలుపొందిన బీజెపీకి బయటి నుంచి మద్దతు ప్రకటిస్తున్నామని-ఒక పక్క ఫలితాలు వెలువడుతుండగానే హడావిడిగా ప్రకటించారు. ఆ హడావిడి ఆ పార్టీ నిజంగానే రాష్ట్ర ప్రయోజనాల కోసమే అలా ప్రకటించిందన్న అభిప్రాయాన్ని కలిగించలేదు సరి కదా,  స్వప్రయోజనాల కోసమన్న అభిప్రాయాన్ని కలిగించింది. ఎందుకంటే అజిత్ పవార్ లాంటివారు చాలా తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బిజెపి ప్రభుత్వం వాటిని తిరగదోడుతుందన్న భయమే ఆ ప్రకటన వెనుక కనిపించింది. అలాంటి భయమే లేకపోతే ఆ ప్రకటన అంత అత్యవసరంగా చేయవలసిన అవసరం లేదు. అందులో రాజకీయమైన విజ్ఞత అసలే లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే అయితే, అటునుంచి అభ్యర్థన వచ్చే వరకూ ఆగవచ్చు. అంతలో కొంప లేమీ మునిగిపొవు. అభ్యర్థన రాకపోతే తన మానాన తను ప్రతిపక్ష పాత్ర నిర్వహించవచ్చు. 

ఆ తర్వాత  ఎండి టివి లో మాట్లాడుతూ ప్రఫుల్ పటేల్ సమర్థించుకున్న తీరు కూదా అంతే పేలవంగానూ, చీదరింపుగానూ అనిపించింది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు తెరచాటున ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు వదంతులు వినిపించాయి కనుక, ఆ అనైతిక ప్రయత్నాల వదంతులకు తెరదించడానికి, జనంలో అయోమయం ఏర్పడకుండా నివారించడానికే ముందస్తు మద్దతును ప్రకటించామని ఆయన ఇచ్చుకున్న ఒక సమర్థన. నేటి రాజకీయ ప్రమాణాలలో ఎన్సీపీ లాంటి పార్టీలో అలాంటి రాజకీయాలకు అతీతమైన సద్భావన హఠాత్తుగా మేలుకుందంటే రాజకీయాలు బొత్తిగా తెలియని అమాయకులు కూదా నమ్మరు. నమ్మరని తెలిసినా అలా సమర్థించుకున్నారంటే, తమ అవినీతిపై బిజెపి ప్రభుత్వం చర్య తీసుకుంటుందన్న భయం తప్ప ఇంకో కారణం కనిపించదు. 

బిజెపి సింగల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది కనుక, ఏదో ఒక పార్టీ మద్దతు ఇవ్వనిదే ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుందనీ, అందుకే తాము ముందుకు వచ్చామని ఆయన చెప్పుకున్నారు. ఇది కూదా అతి తెలివి వాదనె. బిజెపికి సహజ మిత్రమైన శివసేన ఎలాగూ ఉండనే ఉంది. ఒకవేళ శివసేన కాదంటే అప్పుడే తాము మద్దతు ప్రకటించవచ్చు. ఇంతలోనే ఎందుకు తొందర? ఎందుకంటే, అందుకే!

బిజెపి కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదాన్ని ఇచ్చింది కానీ, ఎన్సిపీ ముక్త మహారాష్ట్ర అని ఎందుకు నినాదం ఇవ్వలేదో!

Thursday, October 16, 2014

'సెజ్' లూ, రైతుల భూముల్ని లాక్కోవడం రోమ్ గణతంత్రం లోనూ ఉండేవి!

విశేషమేమిటంటే, రోమన్ గణతంత్రం ఎంత దూరం విస్తరించినా సరే, విస్తరించిన మేరా అది ఒక పెద్ద నగరం మాత్రమే. క్రీ. శ, 212 నాటికి రోమన్ గణతంత్రంలోని సుదూర ప్రాంతంలో ఉన్న ప్రతి స్వంతంత్ర పౌరుడితో సహా అందరికీ రోమ్ నగరంలో పౌరసత్వం ఉంది. అంటే వాళ్ళు అవసరమైనప్పుడు రోమ్ నగరానికి వెళ్ళి అక్కడి టౌన్ హాల్ లో జరిగే వోటింగ్ లో పాల్గొనవచ్చు. అయితే, ఒక షరతు... వాళ్ళు అక్కడికి వెళ్లగలిగి ఉండాలి!

రోమ్ గణతంత్రంలో సంభవించిన రైతుల సంక్షోభం నేడు మన దేశంలో చూస్తున్న రైతుల సంక్షోభంలానే ఉండేది.  రోమ్ లో అప్పటి ఎస్టేట్లు, రైతులు భూముల్ని కోల్పోవడం  నేటి సెజ్ లనూ, భూసేకరణ రూపంలో నేటి భారతీయ రైతులు కోల్పోతున్న భూముల్ని గుర్తుచేయచ్చు. అలాగే వ్యవసాయంలో పోటీని ఎదుర్కోలేక చితికిపోతున్న నేటి రైతులూ, వాళ్ళ రుణ మాఫీ డిమాండ్లూ, ఆమేరకు ప్రభుత్వాల హామీలూ వగైరాలు కూడా అప్పుడు రోమ్ లో ఉండేవి. 

Wednesday, October 8, 2014

ఒంటరి దీవి భారత్!

క్రీస్తుపూర్వ దశకు చెందిన బహురూప ఆస్తికతలో ఇప్పటికీ అధికారికంగా కొనసాగుతున్న దేశం ఒక్క మనదేశం తప్ప ఈ క్షణాన నాకు ఇంకొకటి స్ఫురించడం లేదు. క్రీస్తుపూర్వ కాలంలో బహురూప ఆస్తికతనుంచి తనను కాపాడుకోడానికి ఏకరూప ఆస్తికత ఎంతో పెనుగులాడవలసివచ్చింది. అజ్ఞాతజీవితం కూడా గడపవలసివచ్చింది. అలాంటిది, చరిత్ర తిరగబడి, ఏకరూప ఆస్తికత దాడిని కాచుకుంటూ నేడు బహురూప ఆస్తికత బిక్కు బిక్కు మంటూ గడుపుతోంది.

నేటి సువిశాల ఏకరూప ఆస్తిక సాగరంలో బహురూప ఆస్తికతను కాపాడుకుంటున్న ఒంటరి దీవి మనదేశం!

                                                          
(పూర్తివ్యాసం http://magazine.saarangabooks.com/2014/10/08/%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%85%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B9%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5/  లో చదవండి)

Friday, October 3, 2014

విద్యావంతులలో కూడా పారిశుద్య స్పృహ కలిగించడం అంత తేలిక కాదు!

ప్రధాని నరేంద్ర మోడీ అంతటి వ్యక్తి స్వచ్చభారత్ పేరుతో దేశాన్ని పరిశుభ్రం చేసే పనిని చేపట్టినందుకు కోట్లాది మందికి సంతోషంగా ఉంది. అలాంటి కోరిక నాతో సహా చాలామందికి ఉంది. కానీ ప్రధానమంత్రి  చేపట్టినందువల్ల దానికి విశేష ప్రచారం లభించి కొన్నేళ్ళకైనా నిజమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఆయనే అన్నట్టు జనంలో (సాధారణ జనంలో కాదు సరికదా, విద్యావంతులలో కూడా) ఆ మేరకు చైతన్యం తేవడం అంత తేలిక కాదు.

ఈ సందర్భంలో నా అనుభవాలు ఒకటి రెండు పంచుకోవాలనిపిస్తోంది.

మాది పశ్చిమగోదావరి జిల్లా. కొవ్వూరు నుంచి గోదావరిగట్టు మార్గంలోనూ, వేరే రోడ్డు మార్గంలోనూ పోలవరానికి వెళ్ళే దారిలో మా ఊరు ప్రక్కిలంక వస్తుంది. గోదావరి గట్టు దారిలో ఎప్పుడు వెళ్ళినా నాకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఆడా, మగా చాలామంది గోదావరి గట్టును బహిరంగ పాయిఖానాగా వాడుకుంటూ ఉంటారు. వ్యక్తిగత మరుగుదొడ్ల స్పృహ నేటి 21 వ శతాబ్దిలో కూడా ఈ జనంలో ఏర్పడలేదు. మళ్ళీ గోదావరి జిల్లాలు వెనకబడినవి ఏమీ కావు. ఇంతకాలం పాలించిన ప్రభుత్వాలు కనీసం వ్యక్తిగత మరుగుదొడ్ల అవసరంపై కూడా దృష్టి పెట్టలేకపోయాయి.

దీని మీద మనం ఏమైనా చేయాలనిపించేది. ఇలా ఉండగా మేము చాలాకాలం కొవ్వూరులో కూడా ఉన్నాం కనుక చిరకాలంగా తెలిసిన కొవ్వూరు మిత్రుడు ఒకరు మన కొవ్వూరు వాళ్ళం అంతా కలసి ఒక సంఘంగా ఏర్పడదామని ప్రతిపాదన తెచ్చాడు. చాలామంది హైదరాబాద్ లో ఉన్నారు కనుక మొదట హైదరాబాద్ లో ఒక గుళ్ళో సమావేశమూ, భోజనాలూ ఏర్పాటు చేశాడు. గుళ్ళో సమావేశం అనేసరికే నేను సగం నీరుగారి పోయాను. ప్రత్యేకించి ఒక సామాజికవర్గం వారు ఇలాంటి సమావేశాలను గుళ్ళల్లో జరుపుతూ ఉంటారు. అందులోని ఔచిత్యం నాకు అర్థం కాదు. గుళ్ళు అన్ని సామాజికవర్గాలకూ చెందినవి. ప్రత్యేకించి ఒక సామాజికవర్గం తన సమావేశాలకు ఆలయాలను ఉపయోగించుకోవడంలో అవి "మాకు చెందినవి" అన్న ఒక తప్పుడు సందేశాన్ని ఇతరులకు ఇచ్చినట్టు అవుతుంది. ఆలయాలలో ఆలయాలకు చెందిన సమావేశాలు, ఆధ్యాత్మిక సమావేశాలు తప్ప ఇతర సమావేశాలు జరగకూడదన్న నిబంధన ఇప్పటికైనా చేయడం అవసరం.

గుడిలో సమావేశం అన్నందుకు సగం నీరుగారిపోయినా, మొత్తానికి మరికొందరిని కూడా వెంటబెట్టుకుని నేను సమావేశానికి వెళ్ళాను. అందులో నేను మాట్లాడుతూ పారిశుధ్యం గురించీ, వ్యక్తిగత మరుగుదొడ్ల గురించి, గోదావరి గట్టును పరిశుభ్రంగా ఉంచడం గురించి మనం ఏమైనా చేయాలని ప్రతిపాదించాను. అంతా విన్నారు కానీ నా ప్రతిపాదనకు మద్దతు లభించలేదు. ఆ తర్వాత ఆ సమావేశం చేసిన తీర్మానం నన్ను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. సామూహిక సత్యనారాయణ వ్రతాలూ, లక్షపత్రి పూజలూ చేయాలన్నదే ఆ తీర్మానం. మొత్తం మీద పారిశుధ్యం అవసరంగా ఎవరికీ అనిపించలేదు.

మరో అనుభవం. ఆమధ్య భక్తి చానెల్ వాళ్ళు భక్తి గురించి ఒక చర్చా కార్యక్రమానికి నన్ను పిలిచారు. అందులో నాతోపాటు ఒక స్వామీజీ, ఒక పండితుడు, ఒక రచయిత పాల్గొన్నారు. వాళ్ళందరూ భక్తి ఎంత అవసరమో చెప్పారు. నేను బాహ్యశుద్ధి, పర్యావరణ రక్షణ ఎంత అవసరమో చెప్పాను. పరిసరాలను, పర్యావరణను కాపాడడం కూడా భగవంతుని పూజించడం లాంటిదే నన్నాను. అది విన్నవాళ్లు మీరొక్కరే భిన్నంగా మాట్లాడారన్నారు. చానెల్ వాళ్ళు కూడా అదే అన్నారు. మన భక్తిలో బాహ్యశుద్ధి భాగం కాకపోవడం,  టీవీ చానెళ్లలో ప్రవచనాలు చేసే స్వామీజీలు, పండితులూ కూడా బాహ్యశుద్ధిని నొక్కి చెప్పకపోవడం మీరు గమనించవచ్చు.

చెప్పొచ్చేదేమిటంటే, పరిసరాల పరిశుభ్రత ఎంత అవసరమో విద్యావంతులచేత గుర్తింపజేయడం కూడా అంత తేలిక కాదు.

నేను పారిశుధ్యం అవసరం గురించి ఈ బ్లాగులో రాసిన వాటి వివరాలను ఇస్తున్నాను. ఆసక్తికలవారు చదువుతారని ఆశిస్తున్నాను.

1. గోదావరి జిల్లాలను కడగడానికి ఎన్ని టీ.ఎం.సీల ఫినాయిల్ కావాలి?- నవంబర్, 29, 2012

2. తెలుగు భాషనే కాదు, తెలుగు ఊళ్ళనూ రక్షించుకోవాలి- డిసెంబర్, 1, 2012

3. ఎందుకొచ్చిన హైదరా'బాధ' ఇది?- డిసెంబర్, 11, 2012

4. తెలుగు సభలలో 'తెలుగు బహిర్భూమి' గురించి చర్చిస్తారా?- డిసెంబర్, 17, 2012

5. బాహ్యశుద్ధి లేని భక్తి తన్మయంలో తెలుగువారు- (నేను ఇండియా టుడే లో రాసింది. డిసెంబర్, 25, 2012

6. మన నదుల పేర్లు ఎంత అందమైనవి!- జూన్, 30, 2013

Thursday, October 2, 2014

రాముడిలానే సముద్రం మీద కోపగించిన ఓ పర్షియన్ చక్రవర్తి

రాముడు వానరసైన్యంతో రావణుని మీదికి యుద్ధానికి బయలుదేరాడు. సముద్రం దాటి లంకకు వెళ్ళాలంటే వారధి కట్టాలి. అందుకు సహకరించమని సముద్రుని ప్రార్థించాడు రాముడు. కానీ సముద్రుడు ఎంతకీ ప్రసన్నుడు కాలేదు. రాముడికి కోపం వచ్చి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోయాడు. దాంతో సముద్రుడు భయపడి వారధి కట్టడానికి దారి ఇచ్చాడు.

ఇలాగే గ్రీకులపైకి యుద్ధానికి బయలుదేరి సముద్రాన్ని దాటబోయిన ఒక పర్షియన్ చక్రవర్తికి  సముద్రుడు సహకరించకలేదు. దాంతో అతనికి కోపం వచ్చి సముద్రాన్ని శిక్షించాడు.

(పూర్తివ్యాసం http://magazine.saarangabooks.com/2014/10/02/%E0%B0%AA%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BF%E0%B0%AF%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B1%81%E0%B0%A1%E0%B1%81-%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B1%81-%E0%B0%B9/ లో చదవండి)


Wednesday, October 1, 2014

గాంధీజీ తర్వాత చీపురు పట్టిన మోడీ

గాంధీ జయంతి సందర్భంగా స్వయంగా చీపురు పట్టి స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు, అభినందనలు.

నాకు గుర్తు ఉన్నంతవరకు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వడమే కాక, స్వయంగా చీపురు పట్టినవారు, కలరా వ్యాపించినప్పుడు పాయిఖానాలు కూడా శుభ్రం చేసిన నాయకుడు గాంధీజీ ఒక్కరే. ఇన్నేళ్లకు గాంధీజీ చేసిన పనిని మోడీజీ తలకెత్తుకున్నందుకు పార్టీలకు, సిద్ధాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అభినందించాలి.

ఈ సందర్భంలో కిందటి ఏడాది జనవరి 30 న గాంధీ వర్ధంతి సందర్భంగా రాసిన ఒక  బ్లాగును  ఇక్కడ మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను.

కాంగ్రెస్ సభల్లో చీపురు పట్టిన గాంధీ

గాంధీ కన్నా సుభాస్ చంద్ర బోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ గొప్ప నాయకులని కొన్ని రోజుల క్రితం ఎం.ఐ.ఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆ ముగ్గురూ గొప్ప నాయకులని అనడం వరకు బాగానే ఉంది. కానీ మధ్యలో గాంధీని తీసుకొచ్చి ఆయన గొప్ప నాయకుడు కాడని అనడం ఎందుకో తెలియదు. సందర్భం, అవసరం లేకపోయినా గాంధీని రెక్క పుచ్చుకుని మరీ మధ్యలోకి  లాగి ఆయన మీద ఓ రాయి వేయడం చాలామందికి  పరిపాటిగా మారింది. పాపం ఆయన పువ్వులూ, రాళ్లూ రెంటినీ స్వీకరించక తప్పడం లేదు.

ఎవరు గొప్ప నాయకులో నిర్ణయించడానికి ఎవరి కొలమానాలు వాళ్లకుంటాయి. ఆ జోలికి పోకుండా చెప్పుకోవాలంటే గాంధీ ఎవరితోనూ పోల్చలేని నాయకుడు. ఆధునిక భారతదేశంలో ఆ చివరినుంచి ఈ చివరివరకు యావన్మందీ నాయకుడిగా గుర్తించిన ప్రథమ నాయకుడు ఆయనే. ఒక మహాసేనానిగా ఎంతో చాకచక్యంగా యుద్ధ వ్యూహాలను రచించి అమలు చేసిన ప్రథమ నాయకుడు కూడా ఆయనే. ఆచి తూచి సహచరులను ఎంపిక చేసుకోవడంలో, వారిని నేర్పుగా వాడుకోవడంలో, వారితో రాజకీయ సంబంధాలే కాక వ్యక్తిగత ఆత్మీయ సంబంధాలను పెంచుకోవడంలో, సహచరుల మధ్య పరస్పర మైత్రిని ప్రోత్సహించడంలో గాంధీ తనకు తనే సాటి అనిపించుకోగల నాయకుడు. గాంధీ గురించి అన్నీ పార్స్వాలనూ తెలుసుకుని ఆయన నాయకత్వ దక్షతను, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన బుద్ధినీ, హృదయాన్నీ కూడా అంచనా వేయాలంటే ఆయనపై వచ్చిన పుస్తకాలు చదవాలి.

గాంధీ మనవడు రాజ్ మోహన్ గాంధీ రచించిన 'మోహన్ దాస్' అలాంటి పుస్తకాలలో ఒకటి. నాయకుడు అనేవాడు ఎలా ఉంటాడో, ఎలా ఉండాలో తెలుసుకోడానికి అదొక పాఠ్య గ్రంథం. నేటి నాయకులందరూ తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం.

ఆ పుస్తకం ఆధారంగా గాంధీ గురించి కొన్ని ముచ్చట్లు...

గాంధీ 1901లో కలకత్తాలో జరిగిన ఏ.ఐ.సీ.సీ సమావేశాలలో పాల్గొన్నాడు. వెళ్ళేటప్పుడు నాటి కాంగ్రెస్ ముఖ్య నాయకులు ప్రయాణిస్తున్న రైలులోనే తనూ ఎక్కాడు. మధ్యలో, ముందుగానే నిర్ణయించుకున్న స్టేషన్ లో దిగి అగ్రనేతల బోగీలోకి వెళ్ళి వాళ్ళను పరిచయం చేసుకున్నాడు. తర్వాత తన బోగీలోకి వెళ్లిపోయాడు.

కలకత్తా సదస్సులో ఆయన రెండు పాత్రలు నిర్వహించాడు. గోఖలే సాయంతో దక్షిణాఫ్రికా పోరాటంపై తీర్మానం ప్రతిపాదించి అయిదు నిమిషాలు దానిపై మాట్లాడడం మొదటిది. ఒక చీపురు తీసుకుని సమావేశస్థలిని తుడిచి శుభ్రం చేయడం రెండవది. ఆయన ఆ పని చేస్తుంటే అంతా కళ్ళప్పగించి చూశారు తప్ప అందులో పాలుపంచుకోడానికి  ఎవరూ ముందుకు రాలేదు. ఆ తర్వాత, కాంగ్రెస్ కార్యదర్శులలో ఒకడైన జానకీనాథ్ ఘోశాల్ గుట్టలా పోగుబడిన ఉత్తరాలకు సమాధానం రాయడంలో సతమతమవుతుంటే గాంధీ వెళ్ళి ఆయనకు సహకరించాడు. ఇన్ని చేస్తూనే చాలామంది నాయకులను కలసి మాట్లాడాడు. కాంగ్రెస్ పనితీరు గురించి మొత్తం సమాచారం రాబట్టాడు.

                                                                      *