Sunday, June 21, 2015

రాముడు నిజమా, కల్పనా...?

రాముడు నిజమా, కల్పనా; చారిత్రక పురుషుడా, పురాణపురుషుడా; నరుడా, దేవుడా…అని అడిగితే ఏదో ఒకటి తేల్చి చెప్పడం కష్టం. ఎందుకంటే, రాముడి వీటిలో అన్నీనూ. దశరథుడనే రాజుకు రాముడనే కొడుకు పుట్టడం, తండ్రి ఆదేశం మీద ఆయన అరణ్యవాసం చేయడం, రావణుడనే వాడు ఆయన భార్యను ఎత్తుకుపోవడం, ఆయన రావణుని చంపి భార్యను తిరిగి తెచ్చుకోవడం నిజం కావడం అసాధ్యమూ కాదు, అందులో ఆశ్చర్యమూ లేదు. దాంతోపాటు నిజం కావడానికి అవకాశం లేని అద్భుతాలు, అతిశయోక్తులు ఆయన కథలో అనేకం ఉన్నాయి. 

('నరు'ని అవతారణా ప్రపంచీకరణలో భాగమే' అనే శీర్షికతో  పూర్తివ్యాసం http://magazine.saarangabooks.com/2015/06/20/%E0%B0%A8%E0%B0%B0%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%85%E0%B0%B5%E0%B0%A4%E0%B0%B0%E0%B0%A3%E0%B0%BE-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A%E0%B1%80%E0%B0%95%E0%B0%B0/ లో చదవండి)

Saturday, June 20, 2015

మౌని మోహన్ లానే నరేంద్ర 'మౌని'!

2009లో యూపీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడానికి కొంచెం ముందే 2జీ ఆరోపణలు బయటికి వచ్చాయి. మన్మోహన్ సింగ్ మాట్లాడలేదు. ఆ తర్వాత ఏడాదిలోనే కామన్వెల్త్ క్రీడల కుంభకోణం ఆరోపణలు వచ్చి చూస్తూండగానే ఉధృతమై ప్రభుత్వానికి చెమటలు పట్టించడం ప్రారంభించాయి. అందులో ప్రతిపక్షం కన్నా మీడియాయే ప్రధానపాత్ర పోషించింది. అలా యూపీఏ రెండో విడత తొలి ఏడాదిలోనే ప్రభుత్వంలో చావుకళ కనిపించింది.  అప్పుడు కూడా మన్మోహన్ సింగ్ మాట్లాడలేదు. ఆ తర్వాత 2జీ ఆరోపణలు పుంజుకుని 'కామన్వెల్త్' తోపాటు కలసి మండడం ప్రారంభించాయి. అప్పుడు కూడా చాలా రోజుల తర్వాత కానీ మన్మోహన్ సింగ్ మాట్లాడలేదు. అవి కూడా రాజా ఏ తప్పూ చేయలేదన్న సమర్ధింపు మాటలు. ఆ తర్వాత ఆదర్శ్ గృహకుంభకోణం, 2జీపై కాగ్ నివేదిక వరసగా వచ్చాయి. అక్కడినుంచి రాజీనామాలు మొదలయ్యాయి. 2010 అంతా యూపీఏ చరిత్రలో కుంభకోణాల సంవత్సరం. సరే, 2012లో బొగ్గు కుంభకోణం...మొత్తానికి కామన్వెల్త్ తో మొదలుపెట్టి మిగిలిన ఆ నాలుగేళ్ల కాలమూ యూపీఏ గుక్క తిప్పుకోలేకపోయింది. చివరగా అనివార్యమైన అధికారచ్యుతి...

ఇదంతా ఎందుకంటే, ఎన్డీయే ప్రభుత్వం వచ్చి ఏడాది గడవగానే ఇద్దరు ముఖ్య నేతలపై అనౌచిత్యం, ఆశ్రితపక్షపాతం, అవినీతి సంబంధమైన ఆరోపణలు వచ్చాయి. అయినా మన్మోహన్ సింగ్ లానే నరేంద్ర మోడీ మాట్లాడడం లేదు...

ముందుగా సుష్మా స్వరాజ్ విషయం చూద్దాం. ఆమె పార్టీలో సీనియర్ నాయకురాలే కాక, మంత్రిగా అనుభవం ఉన్నవారు. ప్రధాని పదవికి అభ్యర్ధుల జాబితాలో ఆమె పేరు కూడా గతంలో వినిపించింది. మంత్రిగా పాటించవలసిన విధివిధానాలు ఆమెకు తెలియకపోయే అవకాశం లేదు. కానీ ఆర్ధిక నేరాల నిందితుడైన లలిత్ మోడీ విషయంలో వ్యవహరించిన తీరులో ఆమె సుదీర్ఘ రాజకీయ అనుభవం కానీ, మంత్రిత్వ అనుభవం కానీ ఏమైనా వ్యక్తమవుతున్నాయా?

లలిత్ మోడీ నుంచి మానవతాదృష్టితో పరిశీలించవలసిన అభ్యర్ధన వచ్చిందే అనుకుందాం. మంత్రికి వచ్చిన ఏ అభ్యర్ధన అయినా కింది ఉద్యోగులు, అధికారుల స్థాయిలో పరిశీలన జరిగి, వారి సిఫార్సులతో మంత్రి దగ్గరకు వస్తుంది. అప్పుడు మంత్రి తన ఆమోదముద్రో, అనామోద ముద్రో వేస్తారు. ఏ నిర్ణయమైనా రేపు సమాధానం చెప్పుకోడానికి వీలుగానూ,  పారదర్శకంగానూ  జరుగుతుంది. జరగాలి. అందులోనూ లలిత్ మోడీ వంటి నిందితుల విషయంలో మరింత పారదర్శకంగా జరగాలి. పైగా మంత్రికి లలిత్ మోడీతో వ్యక్తిగత పరిచయం ఉన్నప్పుడు; ఆమె భర్త, ఆమె కుమార్తె లలిత్ మోడీకి న్యాయవాదులు అయినప్పుడు పద్ధతిగానూ, పారదర్శకంగానూ జరగడం మరింత అవసరం. సీనియర్ రాజకీయ నేతే కాక, విదేశాంగమంత్రి వంటి కీలకపదవిలో ఉన్న సుష్మాస్వరాజ్ ఇలాంటి పద్ధతులను, ఔచిత్యాలను పాటించకపోవడం ఆశ్చర్యమే. ప్రధాన ప్రశ్నల్లా పద్ధతులు, ఔచిత్యాలను పాటించకపోవడం గురించే. అధికారంలో ఉన్నవారు సక్రమంగా వ్యవహరించడమే కాదు, వ్యవహరిస్తున్నట్టు కనిపించడమూ అవసరమే. అది ప్రాథమిక పాఠం. అటువంటిది, ఆ విషయం గురించి మాట్లాడకుండా ఆమె జాతీయతావాదిఅనీ, దేశభక్తురాలనీ, ఆమె ఏ తప్పూ చేయలేదనీ పార్టీయే కాక స్వయంగా ఆర్ ఎస్ ఎస్ రంగంలోకి దిగి వెనకేసుకు రావడం ఆ సంస్థ గురించి ఎలాంటి అభిప్రాయం కలిగిస్తుంది? ఆ సంస్థ ఏ విలువలకోసం నిలబడిందనుకుంటాం?

ఇక రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేపై వచ్చిన ఆరోపణలు మరింత తీవ్రం. అందులో ఆర్ధిక కోణం కూడా ఉంది.

యూపీఏ ప్రభుత్వం పై వచ్చిన అవినీతి ఆరోపణలకు, సుష్మా స్వరాజ్ పై వచ్చిన ఆరోపణలకు స్వభావంలో తేడా ఉంది. యూపీఏ పై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవే, సందేహం లేదు. అయితే అవి ఆర్థిక అవినీతికి, విధానశుద్ధికి సంబంధించినవి. సుష్మాపై వచ్చినవి మౌలిక పాలనా స్వభావానికీ, ఔచిత్యానికీ సంబంధించినవి. ఆర్థిక అవినీతికన్నా పాలనా ధర్మానికీ, ఔచిత్యానికీ జరిగే హాని ఎక్కువ తీవ్రమైనది, ఎక్కువ ప్రమాదకరమైనది. దానికి సుదూరప్రభావం ఉంటుంది. అది ఒక ఒరవడి అయి రాబోయే తరాలను చెడగొడుతుంది. ఇంకో తేడా కూడా ఉంది. యూపీఏ డిఫెన్స్ ను అనుసరిస్తే ఎన్డీయే అఫెన్స్ ను అనుసరిస్తోంది.  ఇది కూడా పైన చెప్పిన సుదూరప్రభావం చూపే ప్రమాదకరధోరణే.


Thursday, June 11, 2015

మన వ్యాసుడు, గ్రీకుల హోమర్...కొన్ని పోలికలు

తూర్పు, పడమరల మధ్య ఆశ్చర్యకరమైన అనేక పోలికల గురించి చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు చెప్పబోయేది కూడా అలాంటిదే…
భాగవతం ప్రకారం; అపారమైన రక్తపాతం, విధ్వంసం నిండిన మహాభారతాన్ని చెప్పిన తర్వాత వ్యాసుడు తీవ్ర మానసిక అశాంతికి లోనయ్యాడు. అప్పుడు నారదుడు ఆయన దగ్గరకు వచ్చి విష్ణుభక్తి ప్రధానమైన భాగవతాన్ని చెప్పమనీ, అప్పుడు నీ మనసుకు శాంతి కలుగుతుందనీ చెప్పాడు. వ్యాసుడు అలాగే చేసి శాంతి పొందాడు.
గ్రీకుల హోమర్ కూడా మొదట యుద్ధ ప్రధానమైన ‘ఇలియడ్’ ఇతిహాసాన్ని చెప్పాడు. ఆ తర్వాత తత్వ ప్రధానమైన ‘ఒడిస్సే’ చెప్పాడు.

('రాముడు, ఒడిసస్... ఇద్దరూ సౌరవీరులే' అనే శీర్షికతో పూర్తి వ్యాసం  http://magazine.saarangabooks.com/2015/06/11/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B1%81%E0%B0%A1%E0%B1%81-%E0%B0%93%E0%B0%A1%E0%B0%BF%E0%B0%B8%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%87%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%B0%E0%B1%82-%E0%B0%B8%E0%B1%8C%E0%B0%B0/ లో చదవండి)

Monday, June 8, 2015

తెలుగు రాజకీయాలు కంపరం పుట్టిస్తున్నాయి

ఆంధ్ర, తెలంగాణ రాజకీయనాయకత్వాల మధ్య కలహాలను చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది?

నాకైతే చాలా కంపరం కలుగుతోంది. మొత్తం తెలుగు ప్రజల బాగోగుల గురించి భయం కలుగుతోంది. అసలు నష్టం విభజన వల్ల కాక ఈ రెండు రాష్ట్రాల రాజకీయనాయకత్వాల కలహాల వల్లనే ననిపిస్తోంది. కలహాలు ఉండచ్చు. ఉండడం సహజమే. కానీ అవి ఉండవలసిన స్థాయిలో ఉండాలి. వాటికి ప్రజాప్రయోజనం ప్రాతిపదిక కావాలి. అవి క్రమంగా సమన్వయానికి రాజీకీ దారి తీసేలా ఉండాలి.  కానీ ఇప్పుడు చూస్తున్న కలహాలు అలా లేవు. అవి మరీ నేలబారుగా అసహ్యంగా ఉన్నాయి. పూర్తిగా రాజకీయ కశ్మలంతో నిండి ఉన్నాయి. ఇవి అంతమయ్యేలా లేవు. సమన్వయానికి, ప్రజాహితమే లక్ష్యంగా రాజీకి అవకాశం ఉన్నట్టే కనిపించడం లేదు.

విభజనకు బాధపడని వారు కూడా ఇప్పుడు బాధపడుతున్నారు. నిన్నటి పెద్ద రాష్ట్రం రెండుగా చీలి పరిమాణంలో చిన్న ముక్కలు అయినట్టే, రాజకీయాలలో కూడా మరుగుజ్జు అయిందా అనిపిస్తోంది. ఈ పతనం ఇక్కడితో ఆగదనిపిస్తోంది. మిగతా రాష్ట్రాల దృష్టిలో తెలుగువాళ్లు అందరూ సామూహికంగా చులకన అవుతున్నారు. ఈ అధోగతిని ఆపె శక్తులు ఏవైపునా కనిపించకపోవడం మరుగుజ్జు తనానికి మరో దాఖలా!

Thursday, June 4, 2015

మన దేవాలయాల నమూనా సిరియా నుంచి వచ్చింది!

మెసొపొటేమియాలో దక్షిణంగా ఒబెయిద్(Obeid), ఉరుక్(Uruk), ఎరిడు(Eridu) అనే చోట్లా; మెసొపొటేమియాలోనే నేటి బాగ్దాద్ కు ఉత్తరంగా ఉన్న ఖఫజా(Khafajah), దక్షిణంగా ఉన్న ఉకైర్(Uqair) అనే చోట్లా; మెసొపొటేమియాకు దూరంగా తూర్పు సిరియాలో టెల్ బ్రాక్(Tel Brak) అనే చోటా జరిపిన తవ్వకాలలో మొత్తం ఆరు దేవాలయ సముదాయాలు బయటపడ్డాయి. ఇవి ఉజ్జాయింపుగా క్రీ. పూ. 4000-3500 ఏళ్ల నాటివని నిర్ణయించారు. సిరియాలో పుట్టిన మూలరూపమే ఇతర ప్రాంతాలకు విస్తరించినట్టు టెల్ బ్రాక్ ఆలయసముదాయం సూచిస్తోంది.

('నీలగిరి తోదాలు...చరిత్ర విడిచిన ఖాళీలు' అనే శీర్షికతో పూర్తివ్యాసం  http://magazine.saarangabooks.com/2015/06/04/%E0%B0%A8%E0%B1%80%E0%B0%B2%E0%B0%97%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%A4%E0%B1%8B%E0%B0%A1%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%B5%E0%B0%BF/ లో చదవండి)