Wednesday, September 24, 2014

తొలి విమాన నిర్మాణం పురాతన క్రీటు ద్వీపంలో జరిగిందా?

క్రీటు వాసులు ఎంతో అందమైన కళాత్మకమైన జీవితం గడిపేవారనడానికి వారి దుస్తుల తీరేకాక, తవ్వకాలలో బయటపడిన మృణ్మయపాత్రలు, శిల్పాలు, చిత్రాలు, నగలు, దంతపు వస్తువులే సాక్ష్యం. వారికి లిపి కూడా ఉండేది. గృహ బానిసలు, పారిశ్రామిక బానిసలు ఉండేవారు. ఇంకా ఆశ్చర్యమేమిటంటే, డేడలస్ అనే ఒక క్రీటు వాసి విమానం లాంటి ఒక ఎగిరే వాహనాన్ని తయారు చేశాడనీ, అది సముద్రంలో కూలిపోయిందనే వివరం, అనంతర కాలంలో క్రీటును ఆక్రమించుకున్న గ్రీకుల పురాగాథలలోకి ఎక్కింది. మన రామాయణంలో చెప్పిన పుష్పక విమానానికి మూలం ఇదేనేమో తెలియదు. క్రీటులకు ఉల్కాపాతం ద్వారా లభించిన ఇనుము మాత్రమే తెలుసు. గాడిదలే తప్ప గుర్రం తెలియదు.

Monday, September 22, 2014

మోడీ అమెరికా పర్యటనను మీడియా అతి చేయాలా?

ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ సందర్శించారు. అయినా మీడియా ఆ పర్యటనకు ముందు అంత హడావిడి చేయలేదు. పోనీ నేపాల్ చిన్నదేశం అనుకుందాం.

మోడీ జపాన్ సందర్శించారు. ఆ సందర్శనకు ముందు మీడియా అంత హడావుడి చేయలేదు.

ప్రస్తుతం ఆ అవకాశం లేదుకానీ, మోడి పాకిస్తాన్ సందర్శనకే వెడతారనుకుందాం. దానికి ముందు మీడియా అంత హడావుడి చేయదు.

మోడీ అమెరికా సందర్శనకు ముందే ఎందుకు అంత హడావుడి చేస్తోంది?

ఈ అమెరికా సెంట్రిక్ గ్లోరిఫికేషన్ ఎందుకు? అవసరమా? జనానికి ఉందో లేదో కానీ మీడియాకు ఈ అమెరికా పిచ్చి ఇంత ఉండాలా? ఇది ఒకవిధమైన దాస్యం కాదా?

మోడీ అమెరికా సందర్శనను మీడియా అతి చేయడంలో నాకైతే ఎలాంటి ఔచిత్యం కనిపించడం లేదు. మరి మీకు?

Sunday, September 21, 2014

ఇది విన్నారా? వీవీఐపీ లకు ప్రత్యేకంగా శ్మశానమట!!!

నిన్న పొద్దుటే ఈ వార్తను ఒక టీవీ చానెల్ లో చూసి నా కళ్ళను, చెవులను నేనే నమ్మలేకపోయాను...

ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆలోచనలు వస్తాయా అనుకున్నాను. ఇంత దిక్కు మాలిన, దరిద్రపు ఆలోచనలు అసలు ఈ రోజుల్లోనే వస్తాయేమో. అందులోనూ మాటి మాటికీ ఆమ్ ఆద్మీ గురించి మాట్లాడుతూ వచ్చిన యూపీఏ ప్రభుత్వం చేసిన ఆలోచన ఇది. 

బాధ కలిగిందని చెప్పను. చాలా కోపం వచ్చింది.  కంపరం కలిగింది. అసహ్యం వేసింది. 

ఢిల్లీలో వీవీఐపీలకోసం ప్రత్యేకంగా ఒక శ్మశానం నిర్మిస్తున్నారట. దీనిని యూపీఏ తలపెట్టిందట. 80 శాతం పని పూర్తయిందట. ఎన్డీయే ప్రభుత్వం బుద్ధిగా మిగతా పనిని పూర్తి చేస్తుందట.

 చావును equalizer గా చెబుతారు. అందులో పేద, ధనిక; రాజు, బంటు లాంటి తేడాలు ఉండవని ప్రతి దేశంలోనూ, ప్రతి సంస్కృతీ బోధిస్తుందని అనుకుంటాను. 'చివరిగా మనిషికి కావలసింది ఆరడుగుల నేల, అంతే కదా!' అనడమూ వింటుంటాం. 'పోయినప్పుడు ఏం పట్టుకు పోతారు?' అనే నానుడి కూడా వింటుంటాం. అలెగ్జాండర్ చనిపోయినప్పుడు రెండు అరచేతులూ తెరచుకుని ఉన్నాయట. పోయేటప్పుడు ఏమీ పట్టు కెళ్లడం లేదని సూచించడమని దానికి అర్థం చెబుతారు. చావుతో అన్ని రకాల హెచ్చుతగ్గుల తేడాలు అంతమైపోతాయని ప్రతి సంస్కృతీ నూరిపోసిన భావన.

అలాంటిది, వీవీఐపీలకు ప్రత్యేక శ్మశానం అనేది ఊహించడానికే సాధ్యం కాని విషయం. అసలీ విషయం వార్తలలోకి మొదటే ఎందుకు రాలేదో ఆశ్చర్యం. 24 గంటల వార్తా చానెళ్ల దృష్టికి కూడా ఈ వార్త ఎందుకు రాలేదో తెలియదు. రాజకీయపార్టీలు ఏంచేస్తున్నాయో తెలియదు. ఎన్డీయే ప్రభుత్వం దీనిని ఎందుకు నిశ్శబ్దంగా పూర్తి చేయాలనుకున్నదో తెలియదు. ఇప్పుడు దీనినే ఆదర్శంగా తీసుకుని దేశమంతా రెండు గ్లాసుల వ్యవస్థలా రెండు శ్మశానాల వ్యవస్థ ఏర్పడే పరిస్థితిని ఒకసారి ఊహించుకుని చూడండి. కంపరం పుట్టుకు రాకుండా ఉంటుందా?

సల్మాన్ ఖుర్షీద్ అనే కాంగ్రెస్ కేరక్టర్ ఈ వీవీఐపీ శ్మశానాన్ని సమర్థిస్తూ,  దేశం కోసం కష్టపడిన నాయకులు, సెలెబ్రటీలకు ఇంతకన్నా గొప్ప నివాళి లేదన్నట్టు మాట్లాడారు. ఛీ...ఛీ...అనడం తప్ప ఏం చేయగలం? 

Thursday, September 18, 2014

జమ్మి చెట్టుకు, ఆయుధాలకు సంబంధం ఏమిటి?

ఒకానొక చారిత్రక ఘటన అనంతరకాలంలో మంత్రరూపంలోకి, అభినయరూపంలోకి మారి తంతులో ఎలా భాగమవుతుందో చెప్పడానికి కోశాంబీ ఇంకో ఉదాహరణ ఇస్తారు. అది, సీమోల్లంఘన’.  పూర్వం ఆశ్వయుజమాసంలో, అంటే శరత్కాలంలో రాజులు యుద్ధానికి బయలుదేరేవారు. ఆ రోజుల్లోనే విజయదశమి పండుగ వస్తుంది. ఆ పండుగ పేరులోనే యుద్ధ సూచన ఉంది. ఈ సందర్భంలో ఆయుధాలను పూజిస్తారు. యుద్ధానికి వెళ్ళేముందు రాజులు ఒక తంతు రూపంలో సీమోల్లంఘన జరుపుతారు. అంటే తమ రాజ్యం సరిహద్దులను దాటతారు. అది యుద్ధానికి వెడుతున్నట్టు అభినయపూర్వకంగా సంకేతించడం. మహారాష్ట్ర మొదలైన చోట్ల ఇప్పటికీ దసరా సందర్భంలో సీమోల్లంఘనను అభినయిస్తారు. శమీపత్రాలను(జమ్మి ఆకులను) ఒకరికొకరు ఇచ్చుకోవడమూ ఉంది. పూర్వం శూలం, గద, విల్లు మొదలైన ఆయుధాలను జమ్మి కొయ్యతోనే తయారు చేసేవారు. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లబోయేముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీదే దాచుకున్నారు...

Thursday, September 11, 2014

అక్కడ అంతా కవిత్వంలో మాట్లాడుకుంటారు

వారి దృష్టిలో కవిత్వానికి పుస్తకంతో పనిలేదు. వాళ్ళలో చాలామంది ఇటీవలి వరకు నిరక్షరాస్యులు. కవిత్వం వాళ్ళ పెదవుల మీద ఉంటుంది. ప్రతి ఒక్కరూ కవిత్వాన్ని ప్రేమిస్తారు. వారి దైనందిన సంభాషణలో కూడా కవిత్వం ఉరకలెత్తుతూ ఉంటుంది. ఏదైనా ఒక ముఖ్యమైన ఘటన జరిగినప్పుడు దానిపై అప్పటికప్పుడు పాట కట్టి తమ అనుభూతిని ప్రకటించుకుంటారు. ఇటీవలివరకు అనేక ఐరిష్ గ్రామాలలో శిక్షణ పొందిన సాంప్రదాయిక గాయకుడు ఒక్కరైనా ఉండేవారు. ఆశువుగా కవిత్వం చెప్పే నేర్పు వారికి ఉంటుంది. ఆ క్షణంలో పొందిన ఉత్తేజాన్ని బట్టి అతను చెప్పే కవిత్వం, నేటి ఆధునిక ఇంగ్లీష్  కవిత్వం కన్నా కూడా ఎక్కువ వివరణాత్మకంగా ఉంటుంది.

నాకు బాగా తెలిసిన ఒక గ్రామంలో ఒక ప్రసిద్ధ కవి ఉండేవాడు. ఆయన చనిపోయి నలభై ఏళ్లయింది. ఆయన కవితలన్నీ చాలావరకూ ఆశువుగానూ, సందర్భానుసారంగానూ చెప్పినవే. ఆయన గురించి ఆయన కుటుంబ సభ్యులు ఒక విషయం చెప్పారు. ఆయన చనిపోయిన రోజు రాత్రి కూడా మంచం మీద పడుకుని మోచేతి మీద తల పెట్టుకుని ప్రవాహంలా కవిత్వం చెబుతూనే ఉన్నారట.

Wednesday, September 3, 2014

కొత్త జంటకు అరుంధతిని ఎందుకు చూపిస్తారు?

సప్తర్షి మండలంలో వశిష్టుని పక్కనే ఉన్న అరుంధతీ నక్షత్రాన్ని కొత్త దంపతులకు చూపిస్తారని మనకు తెలుసు. ఈ ఆచారం ఎప్పటినుంచి వస్తున్నదో తెలియదు. అరుంధతీ వశిష్టులు తమ తమ గణాలలో జంట మనువు కట్టి, జీవితాంతం ఆ మనువుకు కట్టుబడి ఉన్న తొలి జంట అన్న సంగతిని అది సూచిస్తూ ఉండచ్చు. ఆవిధంగా వారు ఆదర్శ దంపతులయ్యారు.


అయితే, ఆ మనువు సాధ్యం కావడానికి పూర్వరంగంలో పెద్ద కసరత్తు జరిగింది. ఎందుకంటే, వారిద్దరి గణాలూ అప్పటికి ఇంకా గణవివాహదశలో ఉన్నాయి. జంట మనువులతో వాటికి పరిచయం లేదు. అయినాసరే, ఒకరి మీద ఒకరు మనసు పడిన అరుంధతీ, వశిష్టులు జంట మనువు ఆడాలనుకున్నారు. అందుకు రెండు గణాలవారూ అనుమతించాలి. మామూలుగా అయితే అనుమతి అంత తేలిక కాదు. కానీ అప్పటికే కొన్ని తెలిసిన వ్రాతాల(మనువుకు యోగ్యమైన కొన్ని గణాలు కలసి వ్రాతంగా ఏర్పడతాయి)వారు జంట మనువుల్లోకి అడుగుపెట్టారు.  పులస్త్య, పులహవ్రాతాలు వాటిలో ఉన్నాయి. కనుక అరుంధతీ, వశిష్టుల గణాలవారు కాస్త మెత్తబడ్డారు. అయితే,  గణధర్మాన్ని భంగపరచి ఆ మనువును సాధ్యం చేయడం ఎలా?