Friday, November 22, 2013

"నా యజమానురాలికి భర్తవు కనుక నాకూ భర్తవే"

దేవయానికి ఇప్పుడు ఇద్దరు కొడుకులు. వారి పేర్లు, యదువు, తుర్వసుడు. అశోకవనం దగ్గరలో శర్మిష్ట రోజులు మాత్రం శోకపూరితంగానూ భారంగానూ నడుస్తున్నాయి. దాస్యభారం కన్నా ఎక్కువగా యవ్వనభారం ఆమెను కుంగదీస్తోంది. అనుభవించేవాడు లేక ఇంత గొప్ప యవ్వనమూ కొమ్మ మీదే వాడిపోయే పూవు కావలసిందేనా అనుకుని దిగులు పడుతోంది.

 సరిగ్గా అప్పుడే అశోకవనాన్ని సందర్శించే కుతూహలంతో యయాతి ఆవైపు వచ్చాడు. ఒంటరిగా ఉన్న శర్మిష్టను చూశాడు. శర్మిష్ట తత్తరపడింది. వినయంతో తలవంచి మొక్కింది. రాజు తనపట్ల ప్రసన్నంగా ఉన్నట్టు గమనించి తనే చొరవతీసుకుంది. నా యజమానురాలైన దేవయానికి నువ్వు భర్తవు కనుక నాకు కూడా భర్తవే. ఇదే ధర్మమార్గం. భార్య, దాసి, కొడుకు అనేవి విడదీయలేని ధర్మాలు. నువ్వు దేవయానిని చేపట్టినప్పుడే ఆమె ధనమైన నేను నీ ధనం అయిపోయాను. కనుక కరుణించి నాకు ఋతుకాలోచితం ప్రసాదించు అంది. 

పడక ఒక్కటి తప్ప మిగతా విషయాలలో నిన్ను బాగా చూసుకోమని శుక్రుడు ఆదేశించాడు. నేనప్పుడు ఒప్పుకున్నాను. ఇప్పుడు మాట ఎలా తప్పను?’ అని యయాతి అన్నాడు. 

ప్రాణాపాయం సంభవించినప్పుడు, సమస్త ధనాలనూ అపహరించే సమయంలోనూ, వధ కాబోతున్న బ్రాహ్మణుని రక్షించడానికీ, స్త్రీ సంబంధాలలోనూ, వివాహ సందర్భంలోనూ అబద్ధమాడినా అసత్యదోషం అంటదని మునులు చెప్పారు. నువ్వు వివాహసమయంలో శుక్రునికి మాట ఇచ్చావు కనుక దానిని తప్పిన దోషం నీకు రాదు అని శర్మిష్ట అంది.

యయాతి అంగీకరించాడు. శర్మిష్ట కొంతకాలానికి గర్భవతి అయింది.


1 comment:

  1. ఇక్కడ భర్త అంటే ఒక స్త్రీకే పరిమితుడైన మొగుడు కాదు. తన పోషణలో ఉన్న దాసీలపై కూడా లైంగిక హక్కు ఉన్న యజమాని, నాథుడు, మాస్టర్...అనటం సరైనది కాదు.

    ధర్మాన్ని సరిగ్గా పాటించని కొందరు యజమానులు దాసీలను వాడుకునే అవకాశం ఉందేమో కానీ యజమానులకు దాసీల పట్ల భర్తగా వ్యవహరించే హక్కు లేదన్నది నిజం.

    మన వివాహమంత్రాలు ఒక స్త్రీకి ఒకే పురుషుడు ఒక పురుషునికి ఒకే స్త్రీ అన్నది.....ఉత్తమమైన వివాహ ధర్మము.... అని గట్టిగా చెబుతున్నప్పుడు యజమానులకు దాసీలపై అన్ని హక్కులూ ఉంటాయని భావించటం సరైనది కాదు.

    అలా ఎవరైనా భావిస్తున్నారంటే పెద్దలు తెలియజేసిన వివాహమంత్రాలను పాటించనట్లే.
    ...............................
    శ్వేతకేతుని కాలంలో మూఢాచారాలు కొంతకాలం ఉండి ఉంటాయి. అది అధర్మమని గ్రహించిన ప్రజలు క్రమంగా ఆ ఆనవాయితీలను విడిచిపెట్టి ఉంటారు.

    వివాహిత స్త్రీలను పరపురుషులకు అప్పగిస్తే ఆ స్త్రీ యొక్క భర్త గతి ఏమిటి ? భార్యకు కలిగే సంతానం తనకు సంభవించిన సంతానమో ? లేక పరపురుషుని వల్ల కలిగిన సంతానమో ? భర్తకు ఎలా తెలుస్తుంది? పూర్వీకులు ఇవన్నీ తెలియని అమాయకులు కాదు కదా !

    భర్త వల్ల సంతానం కలగని పరిస్థితిలో మాత్రమే ( భర్త అనుమతితో ) పరపురుషుని వల్ల సంతానాన్ని పొందే హక్కు స్త్రీకి ఉండేది అనుకోవచ్చు.
    .............................................

    గ్రంధాలలో ఉన్న కొన్ని విషయాలను ప్రక్షిప్తాలుగా అనుకోవచ్చనిపిస్తుంది.

    చాలామంది ఏమంటారంటే మహా భారతం నాటికి ఇంకా మాతృస్వామ్యం మిగిలే ఉంది అంటారు. అయితే, మహాభారతం కాలం కన్నా ముందే రామాయణం కాలం నాటికే పురుషస్వామ్యం బలంగా ఉంది కదా !

    ReplyDelete