Tuesday, October 22, 2013

మంత్రులు ఎక్ ష్ట్రా పాత్రలు వేయడం బాగుంటుందా?!

ఎప్పుడైనా బాగుంటుందేమో కానీ ఎప్పుడూ బాగుండదని నాకు అనిపిస్తుంది.

బాగుండకపోగా రోత పుడుతుంది, ఈ మంత్రులు మరీ ఇంత insensitive ఏమిటి, వీళ్ళ వల్ల జనానికి ఏం మేలు జరుగుతుందనిపిస్తుంది.

కేంద్ర వ్యవసాయమంత్రి శరద్ పవార్ నే తీసుకోండి. ఇటు రాజకీయాలను, అటు క్రికెట్ రాజకీయాలను ఆయన చాలాకాలంగా సవ్యసాచిలా నిర్వహిస్తున్నారు. రాజకీయనాయకులకు క్రికెట్ వ్యవహారాలమీద ఇంత ఆసక్తి ఎందుకన్నది ఓ జవాబు లేని ప్రశ్న. కాసులు కురిపించే ఆట కావడం ఆ ఆసక్తికి కారణమో, లేక ఆట మీద ఇష్టం కారణమో తెలియదు. ఆట మీద ఇష్టముంటే ఎప్పుడైనా ముఖ్యమైన మ్యాచ్ లకు వెళ్ళి చూసి ఆనందించ వచ్చు. క్రికెట్ బోర్డు నాయకత్వం దేనికి? రాజకీయనాయకులు చేయడానికి అంతకన్నా ముఖ్యమైన పనులు ఎన్ని లేవు?

శరద్ పవార్ నే అనుకోనక్కరలేదు. క్రికెట్ కిరీటాలపై మోజు పడే వారు  చాలా పార్టీలలో ఉన్నారు. కాంగ్రెస్ కు చెందిన రాజీవ్ శుక్లా,  బీజేపీకి చెందిన అరుణ్ జైట్లీ, అనురాగ్ ఠాకూర్,  నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన ఫారూఖ్ అబ్దుల్లా తదితరులు...

ఒక పక్క ఉల్లి పాయల ధర కిలో వందరూపాయలు దాటిపోయిందని వార్తలు హోరెత్తుతున్నాయి. ఆ వార్తల మధ్యలోనే మన వ్యవసాయమంత్రి గారికి సంబంధించిన ఓ క్రికెట్ వార్త! ముంబైలో ఒక ఆటమైదానానికి సచిన్ టెండూల్కర్ పేరు పెట్టడానికి ఆయన నాయకత్వంలోని ముంబై క్రికెట్ బోర్డ్ నిర్ణయించిందట. ఉల్లి ధరల ఘాటుతో ఒళ్ళు మండి పోతున్న జనానికి వ్యవసాయమంత్రి క్రీడా వార్తలు చూసినప్పుడు ఎలా ఉంటుంది? సచిన్ పేరు పెట్టడం గురించిన ఆ వార్తను మరొకరి చేత ప్రకటింపజేయచ్చు కదా! జనం ఏమనుకుంటారన్న వెరపుకు నాయకులు పూర్తిగా నీళ్ళు వదిలేశారు.

నాలుగేళ్లుగా ఆహారపదార్థాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆహార-వ్యవసాయమంత్రిగా ఉన్న శరద్ పవార్ గారు తన మీద విమర్శల వడగళ్ళు పడుతున్నాసరే క్రికెట్ ను వదలకుండా వార్తల కెక్కుతూనే ఉన్నారు. చివరికి విమర్శలకు విసిగిపోయి వ్యవసాయశాఖను మాత్రమే తను ఉంచుకుని ఆహార శాఖను వదిలేశారు కానీ, క్రికెట్ ను మాత్రం వదిలిపెట్టలేదు.

ఆయనకోసం ప్రత్యేకంగా క్రికెట్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తే ఆయన ఎంత సంతోషిస్తారో! ప్రధానికి ఆ ఆలోచన ఎందుకు రాలేదో! 

No comments:

Post a Comment