Wednesday, July 8, 2015

కుంభకోణాలు-'అధికారప్రతినిధు'ల మురికి స్నానాలు!

2జీ...కామన్వెల్త్ క్రీడలు...ఆదర్శ్ గృహాలు...బొగ్గు...
ఇవి యూపీఏ కుంభకోణాల రికార్డ్.

లలిత్ గేట్-సుష్మాస్వరాజ్ ఎపిసోడ్...లలిత్ గేట్-వసుంధరా రాజె ఎపిసోడ్...వ్యాపమ్,,,
ఇవి ఎన్డీయే కుంభకోణాల రికార్డ్.

పాలకులు మారినా కుంభకోణాల చరిత్ర భలే పునరావృతం అవుతోంది.

మీడియా ముందుకు వచ్చి తమ పార్టీ/ప్రభుత్వాలపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చడంలో పార్టీ/ప్రభుత్వ అధికార ప్రతినిధులు పడుతున్న అవస్థ కూడా అంతే పసందుగా పునరావృతమవుతోంది.

కుంభకోణాలను, ఆరోపణ ప్రత్యారోపణలను కాసేపు పక్కన పెడితే; స్పష్టంగా తప్పులుగా కనిపిస్తున్నవాటిని కూడా ఒప్పులుగా చిత్రించడానికి, తిమ్మిని బమ్మి చేయడానికి అధికారప్రతినిధులు పడే అవస్థ ఎప్పుడూ జాలి గొలుపుతూనే ఉంటుంది, అయ్యో అనిపింపజేస్తూనే ఉంటుంది. అంతఃకరణను చంపుకుని పార్టీ/ప్రభుత్వ అధికారప్రతినిధిగా వ్యవహరించడానికి ఎవరైనా ఎందుకు ముందుకొస్తారో అనిపిస్తుంది. అది స్వచ్చందంగా విధించుకునే శిక్ష. 'ఆత్మ' హత్యలు ఇలా కూడా జరుగుతూ ఉంటాయి. పార్టీ/ప్రభుత్వ అధికారప్రతినిధి కావడమంటే ;అంతరాత్మ'హత్యకు పాల్పడడమే. అందులోనూ  రకరకాల కుంభకోణాల ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు అధికార ప్రతినిధులు మీడియా ముందుకు రావాలంటే సిగ్గెగ్గులను, ఉచితానుచితాలను, రీజనింగును-అన్నింటినీ వదులుకుని రావలసిందే. అది బహిరంగంగా జరుపుకునే హరాకిరి.

ఆరోపణలకు మూలమైనవారు రాజభోగాలను అనుభవిస్తూ తెరవెనుక బాగానే ఉంటారు. అధికారప్రతినిధులు మాత్రం అభిమానం, సిగ్గు, అంతఃకరణ చంపుకుని జనం ముందుకు వచ్చి తెరవెనుక శక్తులు సృష్టించిన మురికి కాలువలో  మునకలు వేస్తూ ఇంత రోతను, హాస్యాన్ని పండిస్తూ ఉంటారు. పైగా ఇవి ఒక రోజో ఒక నెలో కాదు; అయిదేళ్లపాటు చేయవలసిన మురికిస్నానాలు!

వ్యక్తిత్వాన్ని చంపుకుని ఇంత కంఠశోష ఎందుకంటే పోలిటికల్ కెరీర్ కోసం. అదృష్టం కలిసొస్తే ఏ శాసనమండలి సభ్యత్వమో, రాజ్యసభ సభ్యత్వమో దొరుకుతుంది. అందుకోసం ఇంత భారీ మూల్యం చెల్లించుకోవాలన్నమాట.


No comments:

Post a Comment