Saturday, July 1, 2017

'జన్యులిపి'లో ఆర్యుల వలస చరిత్ర

                      (ఆంధ్రజ్యోతిలో 28-6-2017న వచ్చిన నా వ్యాసం పూర్తి పాఠం)
ఆర్యులనబడేవారు భారతదేశానికి బయటినుంచి నిజంగా వచ్చారా, అప్పటికే ఇక్కడ ఉన్న సింధునాగరికతను ధ్వంసం, చేశారా, ఆర్య-ద్రవిడవిభజన నిజమేనా అన్న చర్చ ఈనాటిది కాదు. ఇది గత శతాబ్దకాలంలో వైజ్ఞానికవివాదాన్ని మించి భావోద్వేగ వివాదంగా మారి రాజకీయాలు, సంస్కృతి, సాహిత్యం, చరిత్ర సహా వివిధరంగాలకు చెందిన ఆలోచనాసరళులను ప్రభావితం చేస్తున్న సంగతి మనకు తెలుసు. సింధులిపిని ఛేదించి ఉంటే ఈ విషయంలో ఏ కొంచెమైనా స్పష్టత వచ్చేదేమో కానీ, ఆ ప్రయత్నం ఇంతవరకు సందేహాతీతమైన ఫలితాలను ఇవ్వలేదు. అలాంటిది, ఆధునిక శాస్త్రవిజ్ఞానం ఛేదించిన  జన్యులిపి ఈ వివాదాన్నిఒక కొలిక్కి తెస్తున్నట్టు, ది హిందూ (17 జూన్, 2017)ఒక పూర్తి పేజీ కేటాయిస్తూ ప్రచురించిన టోనీ జోసెఫ్ వ్యాసం వెల్లడిస్తోంది. మూడు నెలల క్రితం బిఎంసి ఎవల్యూషనరీ బయాలజీ అనే పత్రిక ప్రచురించిన పత్రంతోపాటు వివిధ ఇతర పత్రాలలోని వివరాలను, ఆ పత్రాలను రచించిన కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయాలను పొందుపరుస్తూ హౌ జెనెటిక్స్ ఈజ్ సెట్లింగ్ ద ఆర్యన్ మైగ్రేషన్ డిబేట్ అన్న శీర్షికతో వెలువరించిన ఈ వ్యాసం భారతదేశంలోకి ఆర్యుల వలస నిజంగా జరిగిందనేకాక, ఆ వలసకు సంబంధించి చరిత్రకారులు అందించిన తేదీలను కూడా దాదాపు ధ్రువీకరిస్తోంది. శిలాక్షరం కన్నా కూడా స్థిరాక్షరంగా చెప్పదగిన జన్యులిపి ఆధారంగా జరిగిన ఈ అధ్యయనాన్ని ప్రామాణికంగా తీసుకుంటే ఇది ఈ శతాబ్దిలోనే సుదూరప్రభావం చూపగలిగిన మహావిష్కారం అవుతుంది. ప్రత్యేకించి పురాచరిత్ర, పురామానవపరిణామచరిత్రలపై ఆసక్తి, అధ్యయనం ఉన్నవారికి ఇవి ఒక పెద్ద కుదుపునిచ్చే విప్లవాత్మక ఆవిష్కారమూ అవుతుంది.
ఆర్యులకు ఉత్తరధ్రువప్రాంతం తెలుసునంటూ ఋగ్వేదంనుంచి సాక్ష్యాలు అందించిన నాటి లోకమాన్య బాలగంగాధర తిలక్ నుంచి; మధ్యఆసియా లోని కాస్పియన్ సీ పరిసరప్రాంతాలను కాశ్యపి అనేవారని, కాశ్యపి అంటే భూమి అనీ, ఒకనాడు అనేక జాతులకు భాషలకు ఆవాసమైన ఆ కాశ్యపి మీదుగానే ఆర్యులు భారతదేశంలోకి వచ్చారనీ రాసిన ఇటీవలి రాంభట్ల కృష్ణమూర్తి వరకూ ఎందరో పండితులను ఈ సందర్భంలో స్మరించుకోవాలి. ఆర్యులు బండ్ల మీద అగ్నిహోత్రాలు పెట్టుకుని కైబర్, బొలాన్ కనుమల మీదుగా భారత్ లోకి అడుగుపెట్టారని శ్రీపాద అమృత డాంగే రాశారు. సంస్కృతసాహిత్యాన్నీ, దేశీయ మతసంస్కృతులను, పురావస్తు ఆధారాలతో సహా చరిత్రను మధిస్తూ ఆర్యుల రాకను ధ్రువీకరించడమే కాక; క్రీ.పూ. 3000లలో సింధునగరాలు అవతరించాయనీ, ఆర్యుల తొలి ఆక్రమణ క్రీ. పూ. 1750లో, మలి ఆక్రమణ క్రీ. పూ. 1100లో జరిగిందనీ, ఋగ్వేదకాలం క్రీ. పూ. 1500 అనీ, మహాభారతం జరిగిఉంటే క్రీ.పూ. 1000 నాటిదనీ డి. డి. కోశాంబీ అంచనావేశారు. ఇండో-యూరోపియన్ భాషలపై ప్రభావశీలమైన పరిశోధనలు జరిపి, నేటి టర్కీని ఏలిన హిట్టైట్ల లిపిని ఛేదించి అది సంస్కృతంలానే ఇండో-యూరోపియన్ కుటుంబానికి చెందిన క్షత్రభాష అని నిర్ధారించి, తెలుగు, తమిళాలను ద్రావిడభాషలని కాక, సుమేరో-అసీరియన్ భాషలనాలని అంటూ ఈ భాషలకు గల పశ్చిమాసియా చుట్టరికాన్ని చెకొస్లవేకియాకు చెందిన ప్రముఖభాషావేత్త, పురాచరిత్రనిపుణుడు ఫ్రెడరిక్ హ్రోజ్నీ వెల్లడించారు. పశ్చిమాసియాతో దక్షిణభారతజనానికి గల సంబంధాలను ప్రముఖచరిత్రకారుడు నీలకంఠశాస్త్రి చర్చించారు. ఇంకా జోసెఫ్ కాంబెల్, గార్డన్ చైల్డ్,  రొమీలా థాపర్, ఆర్. ఎస్. శర్మ, ఇర్ఫాన్ హబీబ్, బి. ఎస్. ఎల్. హనుమంతరావు వంటి ఎందరో ఆర్యుల రాక గురించిన ఆధారాల వెలుగులో చరిత్రను, పురాణ ఇతిహాసాలను గాలించి కొత్త ఆధారాలను జోడిస్తూ ఈ వాదాన్ని పరిపుష్టం చేశారు. జన్యులిపి ఆధారిత తాజా ఆవిష్కారం వీరి నిర్ధారణలను దాదాపు పూర్తిగా సమర్ధిస్తోంది.
టోనీ జోసెఫ్ వ్యాసం జెనెటిక్స్ ఆధారంగా జరిగిన అయిదు అధ్యయనాల వివరాలను క్లుప్తంగా అందిస్తోంది. తేదీల వారీగా చెప్పుకుంటే, 2009లో హార్వర్డ్ మెడికల్ స్కూల్ కు చెందిన జెనెటిక్స్ ప్రొఫెసర్ డేవిడ్ రీచ్ నాయకత్వంలో రూపొందిన అధ్యయనపత్రం, ఉత్తర భారత పూర్వీకులు(ఏన్ సెస్ట్రల్ నార్త్ ఇండియన్స్-ANI-ఎ ఎన్ ఐ) , దక్షిణ భారతపూర్వీకులు(ఏన్ సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్-ASI-ఎ ఎస్ ఐ) అనే సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చింది. జన్యుపరంగా ఉత్తరభారతపూర్వీకులు మధ్యఆసియా, యూరప్ వాసులకు సన్నిహితంగా ఉన్నారనీ, దక్షిణభారతపూర్వీకులు మాత్రం భిన్నంగా ఉన్నారనీ ఈ అధ్యయనం అన్నప్పటికీ, ఈ రెండు గ్రూపుల కలయిక ఇండో-యూరోపియన్ భాషీయులు ఇక్కడికి రావడానికి కొన్ని వేల సంవత్సరాలకు ముందే సంభవించినట్టు చెప్పింది. భారత్ లోని ఇప్పటి అత్యధికజనాభా ఈ ఎ ఎన్ ఐ, ఎ ఎస్ ఐ ల మిశ్రమానికి చెందినవారని అంటూనే, సాంప్రదాయిక అగ్రవర్ణంలో, ఇండో-యూరోపియన్ భాషీయులలో ఎన్ ఎన్ ఐ జన్యువు హెచ్చు స్థాయిలో కనిపిస్తోందని వెల్లడించింది. ఎ ఎన్ ఐ బహుళవలసల ఫలితం కూడా కావచ్చుననీ, అందులో ఇండో-యూరోపియన్ భాషీయుల వలస ఒకటి కావచ్చుననీ అభిప్రాయపడింది తప్ప వారి వలసను ఈ అధ్యయనం తోసిపుచ్చలేదు. అలాంటిది, ఈ అధ్యయనం ఆర్య-ద్రవిడ విభజనను అబద్ధంగా నిర్ధారించినట్టు చెబుతూ మీడియా ఎలా వక్రీకరించిందో, అందులో లేని తేదీలను ఎలా ఇచ్చిందో టోనీ జోసెఫ్ తన వ్యాసంలో ఎత్తిచూపారు. ఆర్య-ద్రవిడ విభజనను వ్యతిరేకించేవారు ఈ వక్రీకరణను అందిపుచ్చుకుని తమ వాదానికి ఈ అధ్యయనాన్ని ప్రమాణంగా చూపించడమూ జరుగుతోంది.
రెండోది, 2013లో హార్వర్డ్ మెడికల్ స్కూల్ కు చెందిన ప్రియా మూర్జాని నాయకత్వంలో రూపొందిన అధ్యయనపత్రం. ఈ పత్రరచనలో డేవిడ్ రీచ్, హైదరాబాద్ లోని సీసీఎంబి మాజీ డైరక్టర్ లాల్జీ సింగ్ కూడా భాగస్వాములు. ఇది భారత్ లోకి ఇండో-యూరోపియన్ భాషీయుల వలస మీద కాక, భారత్ లో విస్తృతంగా జరిగిన జనాభాసాంకర్యంపై ప్రధానంగా దృష్టిపెట్టింది. ఈ జనాభాసాంకర్యం క్రీ.పూ 1900-4200ల మధ్య జరిగిందనీ, అప్పుడే భారత్ లో సింధుకు చెందిన పట్టణనాగరికత క్షీణించడం, గంగాపరీవాహకప్రాంతమధ్యంలోనూ, దిగువనా జనసాంద్రత పెరగడం, అంత్యక్రియల పద్ధతులు మారడం, ఇండో-యూరోపియన్ భాషలు, వైదికమతం అడుగుపెట్టడం వంటి పెనుమార్పులు సంభవించాయని ఈ అధ్యయనం చెప్పింది. అనూహ్యవేగంతో జరిగిన ఈ జనాభాసాంకర్యాన్ని ఋగ్వేదం నమోదు చేసిందని డేవిడ్ రీచ్ అంటుండగా, ఆ తర్వాత ఈ సాంకర్యంపై తీవ్రవ్యతిరేకత ఏర్పడి సజాతివివాహాలకు దారితీయించిందని ఈ అధ్యయనం చెబుతూ ప్రాచీనభారతీయవాఙ్మయం ఈ పరిణామాన్ని కూడా ప్రతిబింబించిన సంగతిని ప్రస్తావించింది. భగవద్గీత వెంటనే గుర్తుకొస్తున్న ఒక ఉదాహరణ. మొదట యుద్ధానికి విముఖత చూపిన అర్జునుడు, యుద్ధంవల్ల పెద్దఎత్తున జాతిసాంకర్యం ఏర్పడుతుందన్న భయాన్ని వ్యక్తం చేస్తాడు. మహాభారతంలోని ప్రధానాంశాలలో ఈ జనాభాసాంకర్యం కూడా ఒకటి కావడం ఈ సందర్భంలో చెప్పుకోవలసిన మరో ఆసక్తికర విషయం.
మూడవది, మూడేళ్ళ క్రితం కాలిఫోర్నియాలోని స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో జెనెటిక్స్ విభాగానికి చెందిన పీటర్ అండర్ హిల్ నాయకత్వంలో 32 మంది శాస్త్రవేత్తలు ఆర్1ఎ (R1a) అనే హెప్లోగ్రూపు వ్యాప్తిపై (హెప్లోగ్రూపులు ఏక ఆనువంశికతను గుర్తిస్తాయి) చేసిన విస్తృత అధ్యయనం. దీని ప్రకారం, ఈ ఆర్1ఎ గ్రూపు రెండు ఉప-హేప్లో గ్రూపులుగా చీలిపోయింది. ఒకటి ప్రధానంగా యూరప్ కు పరిమితమైతే ఇంకొకటి మధ్య, దక్షిణాసియాలకు పరిమితమైంది. యూరప్ లోని 96 శాతం ఆర్1ఎ నమూనాలు జడ్ 282 అనే ఉప-హేప్లో గ్రూపుకు చెందినవైతే, మధ్య, దక్షిణాసియాలలోని 98.4 శాతం ఆర్1ఎ నమూనాలు జడ్ 93 అనే ఉప-హేప్లో గ్రూపుకు చెందినవని తేలింది. ఈ రెండు గ్రూపులు దాదాపు 5,800 ఏళ్ల క్రితం విడిపోయాయి. భారత్ లో ప్రబలంగా ఉన్న జడ్ 93 ఆ తర్వాత మరిన్ని శాఖలుగా చీలిపోయింది. ఆ చీలిపోవడమూ, ఆ చీలికల విస్తరణా అసాధారణవేగంతో జరిగాయి. అలా చీలిన మూడు ప్రధాన గ్రూపులే ఇప్పుడు భారత్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, హిమాలయప్రాంతాలలో ఉన్నాయి.
నాలుగవది, స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన డేవిడ్ పోజ్నిక్ నాయకత్వంలో రూపొంది 2016 ఏప్రిల్ లో ప్రచురితమైన అధ్యయనపత్రం. పురుషపారంపరికతకు చెందిన వై-డి ఎన్ ఎ(Y-DNA) విస్తరణను ఇది పరిశీలించింది. ఈ పత్రరచనలో పైన పేర్కొన్న డా. అండర్ హిల్ సహా 42మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. జడ్ 93నుంచి చీలిన గ్రూపుల విస్తరణ ఇంచుమించు 4,000-4,500 సంవత్సరాల క్రితం భారీ ఎత్తున జరిగినట్టు ఈ అధ్యయనం తేల్చింది. సింధునాగరికత అంతరిస్తున్న కాలమూ దాదాపు అదే.
అయిదవది, బ్రిటన్ లోని హడ్డర్స్ ఫీల్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొ. మార్టిన్ పి. రిచర్డ్స్ నేతృత్వంలో 16మంది శాస్త్రవేత్తలు మూడు మాసాల క్రితం వెలువరించిన అధ్యయనపత్రం. టోనీ జోసెఫ్ ప్రకారం, ఇది ఇంతవరకు జరిగిన పరిశోధనలను ఒకచోట చేర్చి, పొందికైన వలసచరిత్రను నిర్మించడానికి ప్రయత్నించింది. గత 12,500 సంవత్సరాలకాలంలో భారతీయ జన్యుసంపుటిలోకి బయటనుంచి కొత్త జన్యువులు ఏవీ ప్రవేశించలేదని, ఇంతవరకు అందుబాటులో ఉన్న మాతృపారంపరిక (mtDNA-తల్లి నుంచి కూతురికి సంక్రమించేది) డి ఎన్ ఏ డేటా సూచిస్తుండగా,  కొత్తగానూ విరివిగానూ అందుబాటులోకి వచ్చిన పురుషపారంపరికతను సూచించే వై క్రోమోజోమ్ కు చెందిన డి ఎన్ ఏ డేటా ఆ పరిశీలనను ఎలా తలకిందులు చేస్తోందో ఈ పత్రం వెల్లడించింది. క్రీ. పూ. 2000 ప్రాంతంలో, అంటే ఇప్పటికి 4వేల పై చిలుకు ఏళ్ల క్రితం భారతీయపురుషపారంపరికతలోకి బయటనుంచి కొత్త జన్యువు ప్రవేశించిందని, తల్లి పారంపరికజన్యువులో ఈ సమాచారం లోపించడానికి కారణం, ఈ కొత్త పురుష పారంపరికజన్యువుకు కారణమైన వలసదారులు తమ స్త్రీలను వెంటబెట్టుకుని రాకపోవడమేనని చెప్పింది.  భారత్ లో 17.5 శాతం పురుషపారంపరికత- ఒకే ఆనువంశికతను సూచించే ఆర్1ఎ కి చెందినదని వై-డి ఎన్ ఎ డేటా వెల్లడించింది. ఈ ఆర్1ఎ గ్రూపు ఈరోజున మధ్య ఆసియా, యూరప్, దక్షిణాసియాలలో వ్యాపించి ఉంది. నల్లసముద్ర ఉత్తరతీరంనుంచి కాస్పియన్ సముద్రపు తూర్పు వరకు వ్యాపించిన పాంటిక్-కాస్పియన్ గడ్డిమైదానా(స్టెప్పీలు)లనుంచి వ్యాపించడం ప్రారంభించిన ఈ ఆర్1ఎ గ్రూపు, మార్గమధ్యంలో వివిధ ఉపశాఖలుగా చీలిపోతూ అటు పశ్చిమంగా యూరప్ లోకి ఇటు తూర్పున దక్షిణాసియాలోకి విస్తరించినట్టు అధ్యయనం తేల్చింది.
పాంటిక్-కాస్పియన్ గడ్డిమైదానాలనుంచి వలసలు వ్యాపించడం ప్రారంభించాయనడం- పురావస్తు, భాషా, వాఙ్మయ  ఆధారాలతో ఎప్పుడో ఆ నిర్ధారణ చేసిన ఎందరో చరిత్రకారుల నిశితపరిశోధనకు, వస్తుగతదృష్టికి తిరుగులేని నిరూపణలలో ఒకటి. ఉదాహరణకు, క్రీ. పూ. 2000 ప్రారంభంలో, చివరిలో రెండు విడతలుగా ఆర్యులు మధ్య ఆసియానుంచి వలసలు ప్రారంభించారనీ; ఈ రెండు వలసలూ ఇటు భారత్ ను, అటు బహుశా యూరప్ నూ కూడా ప్రభావితం చేశాయని డి. డి. కోశాంబీ (ద కల్చర్ అండ్ సివిలిజేషన్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా ఇన్ హిస్టారికల్ ఔట్ లైన్) అంటారు. అలాగే, పశుపాలక సంచారులైన ఆర్యులలో కొందరు రష్యన్ గడ్డిమైదానాలపై ఆధిపత్యం సాధించగా, కొందరు కాస్పియన్ సముద్రాన్ని చూడుతూ ఆసియా మైనర్(నేటి టర్కీ)లోకి ప్రవేశించారని, మరో బృందం డాన్యూబ్ నదీలోయలోనూ, ఎగువ యూరప్ లోనూ పరశు(గొడ్డలి)హస్తులుగా ప్రత్యక్షమయ్యారనీ మరోచోట(ఏన్ ఇంట్రడక్షన్ టు ద స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ) రాశారు. ఇంతకీ భారత్ లోకి ఆర్యుల వలస లేదా ఆక్రమణ గురించి పైన చెప్పిన జన్యుసమాచారం ఈ దేశంలో సంభవించిన మొత్తం వలసల గురించిన చిన్న, పాక్షికచిత్రాన్ని మాత్రమే చూపుతోందనీ,  ఇంతకంటే విస్తారంగా జరిగిన వాటితో సహా మరికొన్ని వలసలు ఉన్నాయనీ టోనీ జోసెఫ్ గుర్తుచేశారు. అవి, 1. 55,000-65,000 ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి జరిగినవి. 2. క్రీ. పూ. 10,000 తర్వాత పశ్చిమాసియానుంచి అలలు అలలుగా సాగిన వ్యవసాయసంబంధ వలసలు. 3. తూర్పుఆసియా నుంచి ముండా వంటి ఆఫ్రో-ఏషియన్ భాషీయుల వలసలు. 4. తూర్పుఆసియానుంచే టిబెటన్-బర్మన్ భాషీయుల వలసలు. దాదాపు ఈ వలసలన్నిటిపైనా పురాచరిత్ర, పురామానవపరిణామచరిత్రకారులు చేసిన విలువైన నిర్ధారణలు పుష్కలంగా ఉన్నాయి. జన్యుఆధారాలు వాటినీ ధ్రువీకరించినా ఆశ్చర్యంలేదు.  
ఆర్యుల వలస సిద్ధాంతాన్ని గతంలో వ్యతికేరించిన, లేదా సందేహించిన డా. అండర్ హిల్, డేవిడ్ రీచ్ వంటి జన్యుశాస్త్రవేత్తలు ఇప్పుడు మరింత విరివిగా లభించిన సాక్ష్యాలను పురస్కరించుకుని తమ అభిప్రాయాన్ని సవరించుకున్నట్టు టోనీ జోసెఫ్ వ్యాసం వెల్లడిస్తోంది. అదలా ఉంచితే, ఆర్య-ద్రవిడ విభజనను తీవ్రంగా వ్యతిరేకించే భావజాలానికి చెందినవారు అధికారంలో ఉండి, భాష, చరిత్ర, సంస్కృతి, సాహిత్యం వగైరా అనేక రంగాలను తమ విభజన వ్యతిరేక భావజాలానికి అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్న ఘట్టంలో ఆర్యుల వలస గురించిన ఇలాంటి జన్యుఆధారాలు వెలుగు చూస్తుండడం గమనించవలసిన యాదృచ్చికత. వీటి పర్యవసానాలు, ప్రభావాలు అన్ని రంగాలలోనూ బహుముఖంగా ఉండగల అవకాశముంది.
అయితే, ఆర్యులనేవారు ఎక్కడినుంచో రాలేదనీ, భారతీయపూర్వులు 15వేల సంవత్సరాలక్రితమే మధ్య, పశ్చిమాసియా, యూరప్ లకు విస్తరించి అక్కడి జనాభాలో కలసిపోయారనే వాదమూ ఉంది. ఆవిధంగా జనాభాసాంకర్యం జరిగిందనడంలో ఉభయవాదాల మధ్య ఏకీభావం ఉన్నప్పుడు, వలసలు-జనాభాసాంకర్యం అన్న  కోణం ప్రస్ఫుటంగా ముందుకొస్తుంది. పురాకాలంలో ప్రపంచమంతటా వలసలు సర్వసామాన్యాలు. ఆహారాన్వేషణలో మనిషి భూభ్రమణం చేసిన సంగతిని ప్రస్తావిస్తూ దాని పర్యవసానాలను రాంభట్ల తన జనకథలో రాశారు. ఆత్మోత్కర్షను అలవిమాలిన స్థాయికి పెంచుకుని తామూ, తమ దేశమూ, తమ భాషా, సంస్కృతులూ స్వయంభువులని, ఎలాంటి బాహ్యసంపర్కాలూ లేకుండా స్వతంత్రంగా అభివృద్ధి చెందినవనీ, మనం ఒకరికి ఇచ్చిందే తప్ప తీసుకున్నది ఏమీలేదనీ అనుకునే అవకాశం ఎలా చూసినా లేదు. పురామానవుడి అనుభవవైశాల్యాన్ని కొలవడానికి నేటి మన కొలమానాలు పనికిరావు. నేటిలా ప్రయాణసాధనాలు లేని రోజుల్లో కూడా పురామానవుడు మనం చూడనంత ప్రపంచాన్ని చూశాడని, నేడు మనకు లేనంత భావవైశాల్యాన్ని పెంచుకున్నాడనీ ప్రముఖచరిత్రకారుడు హెచ్. జి. వెల్స్ అంటాడు. వలసలు, జనాభాసాంకర్యం నిజమని తేలినా అది ఈ దేశవైవిధ్యవంతమైన అస్తిత్వానికి మరో నిక్కమైన నిరూపణే అవుతుంది. ఆహారస్వేచ్ఛ, భావప్రకటనస్వేచ్ఛతో సహా అన్ని హక్కులనూ గుర్తించి గౌరవించే  ప్రజాస్వామికవ్యవహరణకు మరింత స్ఫూర్తిదాయకమూ, దోహదమూ అవుతుంది.
                                                                                                            
                                             

Tuesday, June 13, 2017

నిత్యకవితావసంతుడు సినారె

వయసుతో సంభవించే కొన్ని సహజమరణాలు కూడా ఒక్కోసారి కుదుపునిస్తాయి. సి. నారాయణరెడ్డిగారి మరణం నాకు అలాంటి కుదుపునే ఇచ్చింది. ఎందుకని ఆలోచిస్తే రెండు కారణాలు కనిపించాయి. ఒక కవికి తగిన నిండైన, పరిశుభ్రమైన ఆహార్యంతో ఎప్పుడూ తాజాగా కనిపించే ఆయనను ఇటీవలివరకూ సభలు సమావేశాలలో నిరంతరం చూస్తూ ఉండడం, ఆయన నిరంతరాయంగా కవిత్వం రాస్తూనే ఉండడం! ఇవి ఆయనను నిత్యయవ్వనుడిగా సుప్తచేతనలో ముద్రవేసినట్టున్నాయి. అందుకే ఆయన మరణవార్త ఆకస్మికంగా తోచి ఒక కుదుపు కుదిపింది.
నేను చదువుకునే రోజుల్లో ఆయన పట్ల ఒకవిధమైన అడ్మిరేషన్ ఉండేది. అప్పట్లో ఆయన హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో ఉండేవారు. గంగ యమున సరస్వతి అనే నామఫలకం ఉన్న ఆయన నివాసం మీదుగా వెళ్ళేటప్పుడు ఇదే కదా నారాయణరెడ్డిగారి ఇల్లు అనుకుని కుతూహలంగా లోపలికి తొంగి చూసేవాణ్ణి.
ఆయనతో నాకు గొప్ప పరిచయం ఏమీలేదు. కాకపోతే ఆయనతో ముడిపడిన కొన్ని జ్ఞాపకాలు మాత్రం ఉన్నాయి. వాటిని రికార్డ్ చేయడానికి ఇదొక సందర్భం.
పాటిబండ్ల మాధవశర్మగారి షష్టిపూర్తి సందర్భంలో చిక్కడపల్లిలోని ఆయన మేడ మీద విశ్వనాథ సత్యనారాయణగారు రామాయణ కల్పవృక్ష గానం చేశారు. అది రెండు మూడు రోజులు జరిగినట్టు జ్ఞాపకం. జంటనగరాలలోని సాహితీదిగ్గజాలు అందరూ ఆ కార్యక్రమానికి విచ్చేశారు. అప్పుడప్పుడే ఏకవీర సినిమా విడుదలైంది. దానికి సినారె సంభాషణలు రాశారు. విశ్వనాథవారు ఏకవీర సినిమా గురించి ప్రస్తావించి, "నా నవలను సినిమాగా తీస్తున్నా దానికి సంభాషణలు రాయడానికి నేను పనికిరానట. వాడెవడితోనో రాయించారు" అంటూ తమ సహజశైలిలో ఆక్రోశం ప్రకటించారు. సరిగ్గా ఆయన ఎదురుగా ముందువరసలో కూర్చున్న సినారె చిరునవ్వు చిందిస్తూ ఉండిపోయారు.
నారాయణరెడ్డిగారికి మంచి లౌక్యుడు అని పేరు. నొప్పించక తా నొవ్వక అన్నట్టు ఉంటారన్న భావన చాలామందికి ఉంది. కానీ ఇందుకు విరుద్ధంగా ఆయన సభాముఖంగా కోపప్రకటన చేసిన సందర్భం ఒకటి నాకు గుర్తుండిపోయింది. అది కాకినాడలో శ్రీశ్రీ సప్తతి జరిగిన సందర్భం. ఆ సభకు ఆయన అధ్యక్షుడని జ్ఞాపకం. ఆ సభలో శ్రీశ్రీ, పురిపండ అప్పలస్వామి, గజ్జెల మల్లారెడ్డి వంటి సాహితీ ప్రముఖులు, సాయంత్రం జరిగిన మరో సభలో హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ పాల్గొన్నారు. ఉదయం  జరిగిన సభలో శ్రీశ్రీ కవిత్వంపై మిరియాల రామకృష్ణ రచించిన పరిశోధనాగ్రంథాన్ని ఆవిష్కరించారు. అందులో 'ఆధునికకవిత్వం: సంప్రదాయం-ప్రయోగం' తన పరిశోధనా గ్రంథంలో చేసిన కొన్ని ప్రతిపాదనలను మిరియాల రామకృష్ణ పూర్వపక్షం చేయడాన్ని ప్రస్తావిస్తూ నారాయణరెడ్డిగారు చిర్రుబుర్రు లాడారు, అది ఆయన స్వభావవిరుద్ధంగా కనిపించి నన్ను ఆశ్చర్యపరచింది.
నేను ఆంధ్రప్రభ దినపత్రికలో ఉన్నప్పుడు అనుకోకుండా ఆయనతో పరిచయం కలిగింది. ఆయన పాల్గొన్న ఒక సినీ కార్యక్రమానికి ప్రముఖ సినీ జర్నలిస్టు దివంగత పి. ఎస్. ఆర్. ఆంజనేయశాస్త్రిగారు వెడుతూ నన్ను కూడా రమ్మన్నారు. ఆంజనేయశాస్త్రిగారు పూర్వపరిచితులే కనుక సమావేశానంతరం తిరిగి వెడుతున్నప్పుడు నారాయణరెడ్డిగారు ఆయనకు, ఆయనతో ఉన్న నాకు తన కారులో లిఫ్ట్ ఇచ్చారు. అప్పుడు ఆంజనేయశాస్త్రిగారు నన్ను ఆయనకు పరిచయం చేయగానే ఆయన వెంటనే నా పేరు గుర్తుపట్టి అంతకు కొన్ని రోజుల ముందే ఉదయం దినపత్రిక సాహిత్యం పేజీలో వచ్చిన నా వ్యాసాన్ని ప్రస్తావించి, అది నేను చదివాననీ చాలా మౌలికమైన ప్రతిపాదనలు ఉన్నాయనీ, రాస్తూ ఉండమనీ అన్నారు. ఆయన దినపత్రికలో వచ్చిన ఒక వ్యాసం చదవడమేకాక, దానినీ, రాసిన నాలాంటి ఒక అప్రసిద్ధునీ గుర్తుపెట్టుకోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది.
ఆ తర్వాత కొన్నేళ్లకు నేను ఆంధ్రప్రభ సాహిత్యం పేజీని నిర్వహిస్తున్నప్పుడు ఆయన కవితల్ని ప్రచురించే అవకాశం కలిగింది. ఆవిధంగా ఆయన నిరంతర కవితావ్యాసంగాన్ని ఒకింత దగ్గరగా చూసే అవకాశమూ కలిగింది. ఒక కవిత ప్రచురించిన వెంటనే ఇంకొక కవిత పంపించేవారు.  పెండింగ్ లో ఉన్న కవిత గురించి తన సహాయకులతో ఫోన్ చేయించి అడిగించేవారు. ఎప్పుడైనా తనే ఫోన్ చేసి అడిగేవారు. ఒకసారి ఆయన కుమార్తె కూడా ఫోన్ చేసినట్టు గుర్తు.
ప్రముఖ కవి, ఆంధ్రప్రభ దినపత్రిక మాజీ సహాయ సంపాదకులు అజంతాకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చిన సందర్భంలో అప్పటి ఆంధ్రప్రభ సంపాదకులు వాసుదేవ దీక్షితులుగారి పూనికతో  హైదరాబాద్ లోఏర్పాటు చేసిన అభినందనసభలో సినారె కూడా ఉన్నారు. అది ఒకవిధంగా చిరస్మరణీయసభ. ఎందుకంటే జంటనగరాలలో ఉన్న వివిధ పంథాలకు, తరాలకు చెందిన కవి రచయితలు ఎందరో ఆ సభకు హాజరయ్యారు. ఈ విశేషాన్ని గమనించిన సినారె పసిపిల్లవాడిలా పొంగిపోయారు. ఈ అరుదైన క్షణాలు గాలిలో కలసిపోవడానికి వీలులేదంటూ నన్ను పిలిచి సభకు వచ్చిన కవిరచయితలు అందరితో గ్రూప్ ఫోటో తీయించమన్నారు.
పార్లమెంటు సభ్యత్వం కూడా ముగిసి ఖాళీగా ఉన్న రోజుల్లో ఆయన హైదరాబాద్ బొగ్గులకుంటలో ఉన్న ఆంధ్రసారస్వత పరిషత్ పునర్వికాసంపై దృష్టి పెడుతూ వచ్చారు. అక్కడ సభలు, సమావేశాలు నిర్వహింపజేసేవారు. ఒకసారి ఆయనను కలసినప్పుడు సారస్వతపరిషత్ గురించే ముచ్చటించారు.
కవితాస్రష్టగానే కాక వ్యక్తిగా కూడా రెండు మూడు తరాలకు చెందిన సాహితీబంధువులకు బాగా తెలిసి, వారి  నాలుకలపై ఆడుతూ వచ్చిన సినారెకు ఈ కాసిని జ్ఞాపకాలతో నా నివాళి.


Friday, October 21, 2016

ఇంత బేషరంగా ఎలా ఫిరాయిస్తారబ్బా?!

తమ మధ్య ఎలాంటి కీచులాటలు ఉన్నా పాతికేళ్లో, పదేళ్ళో కాపురం చేసిన భార్యను భర్త, భర్తను, భార్య విడిచిపెట్టాలనుకోవడం మనదేశంలో ఇప్పటికీ అంత తేలిక కాదు. చట్టపరమైన అడ్డంకుల సంగతి అలా ఉంచితే, పిల్లాలూ, ఇతర ఎమోషనల్ బంధాలూ అడ్డం వస్తాయి. పెద్దవాళ్ళు కూడా చూస్తూ ఊరుకోరు. సర్దు బాటు చేయడానికి ప్రయత్నిస్తారు. అయినా విడిపోవడం లేదని కాదు. విడిపోతున్న కేసులకన్నా సర్దుకుని కలిసే ఉంటున్న కేసులే ఎక్కువ ఉంటాయి. విడిపోవడానికి  మానసికంగా ఎంతో సిద్ధం కావాలి. విడిపోవడమంటే జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడమే. ఎంత తగవులున్నా కలసి ఉండడానికి భార్యాభర్తలు ప్రయత్నించడమే భారతీయవివాహ వ్యవస్థకు గల బలమని అంటారు. అయితే అదే బలహీనత అని అనే వాళ్ళూ ఉన్నారు.

అదలా ఉంచితే, భారతీయ వివాహబంధం నమూనా మన బహుళ పక్ష ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థకు ఏమాత్రం పనికిరావడం లేదు. పాతికేళ్లు ఒక పార్టీలో ఉండి దానితో, దాని ఐడియాలజీతో పెంచుకున్న ఎమోషనల్ బంధాన్ని ఒకే ఒక్క ప్రకటనతో పుటుక్కున తెంచుకుని ఇంకో పార్టీవ్రత్యానికి గెంతడానికి నాయకులు ఏమాత్రం వెనకాడడం లేదు.  అందుకు వాళ్ళలో ఎలాంటి అంతర్మథనం జరుగుతున్న ఆనవాళ్ళు కనిపించడం లేదు. ఇది బహుళపక్ష ప్రజాస్వామ్యానికి బలమో బలహీనతో తెలియడం లేదు.

Tuesday, October 11, 2016

అమ్మవారి పూజ ప్రపంచవ్యాప్తం

చాలా రోజులైంది బ్లాగ్ రాసి. పాఠకులు మన్నించాలి. అందరికీ పండుగ శుభాకాంక్షలు. విజయదశమి సందర్భంలో ప్రైమ్ పోస్ట్ ప్రచురించిన నా వ్యాసం లింకు ఇస్తున్నాను. చూడగలరు. 



అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ…”
అన్న పోతనగారి పద్యం ప్రసిద్ధం. అలాగే, ప్రపంచ పౌరాణికతపై మూడు బృహత్ సంపుటాలు రచించిన క్యాంప్ బెల్  అనే పండితుడు డిమీటర్ అనే గ్రీకుదేవతగురించి The Great Goddess of the Universe అంటాడు. ఆ మాట సూచిస్తున్నది కూడా పోతనగారు పేర్కొన్న అమ్మలగన్న అమ్మనూ, మూలపుటమ్మనే! ఆమె జగజ్జనని, లోకమాత. ఆదిశక్తి.
ప్రపంచమంతటా జగజ్జననిగా కొలుపు లందుకున్న ఆదిమదైవం, స్త్రీ దేవతే.
ఈ చిత్రం చూడండి. చూడగానే ఈమె మన అమ్మవారే నని మీకు అనిపించి తీరుతుంది. సూక్ష్మంగా చూసినప్పుడు వివరాలలో తేడాలు ఉంటే ఉండవచ్చు. నిజానికి ఈమె హెకటే (Hekate) అనే గ్రీకు దేవత. ఈమె చంద్ర సంబంధి, చంద్రునికి ప్రతీక. మాంత్రిక దేవత, ప్రసూతి దేవత కూడా. ఈమె లాంటిదే  అర్తెమిస్ అనే మరో దేవత.  హెకటేను, అర్తెమిస్ ను త్రియోదితిస్ (trioditis), అంటే మూడు మార్గాల కూడలిలో ఉండే దేవతగానూ; త్రిప్రోసొపొస్ (triprosopos), అంటే మూడు ముఖాలు కలిగిన దేవతగానూ కూడా పిలుస్తారు.

Tuesday, July 19, 2016

కాంగ్రెస్ చేసిన తప్పులే బీజేపీ చేయాలా!?

చాలా రోజుల తర్వాత బ్లాగులో రాజకీయ వ్యాఖ్య రాస్తున్నాను.

కాంగ్రెస్ చేయని పనులు కొన్ని బీజేపీ చేస్తుంది(చేస్తోంది). అలాగే కాంగ్రెస్ చేసిన ఎన్నో పనులు కూడా బీజేపీ చేస్తుంది(చేస్తోంది). అలాగే కాంగ్రెస్ కూడా.

ఉదాహరణకు కాంగ్రెస్ మీద అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి. బీజేపీ మీద కూడా కొన్నైనా వచ్చాయి. అప్పుడు బీజేపీని ఆ విషయమై కాంగ్రెస్ అడిగిందనుకొంది, అప్పుడు మీ మీద ఉన్న అవినీతి ఆరోపణల సంగతేమిటని బీజేపీ అడుగుతోంది.

రాజ్యాంగ పదవుల్ని, ఇతర ప్రజాస్వామిక వ్యవస్థలను దెబ్బతీస్తోందని బీజేపీ మీద కాంగ్రెస్ ఆరోపణ చేసిందనుకోండి, మీరు ఆయావ్యవస్థలను భ్రష్టు పట్టించలేదా అని బీజేపీ అడుగుతుంది.

భావప్రకటనా స్వేచ్ఛను బీజేపీ హరిస్తోందని కాంగ్రెస్ అందనుకోండి, అందులో మిమ్మల్ని మించిన ఘనులు ఎవరుంటారని అంటూ బీజేపీ ఎమర్జెన్సీ ని ఎత్తిచూపుతుంది.

ఇలా చాలా ఉదాహరణలు ఇచ్చుకుంటూ పోవచ్చు...

ఇవాళ లోక్ సభలో అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో ఎన్డీయే వ్యవహార సరళి, న్యాయస్థానంలో అది బెడిసికొట్టడం చర్చలోకి వచ్చింది. ప్రభుత్వాలను కుప్ప కూల్చిన చరిత్రలోనూ, వాటి సంఖ్యలోనూ మిమ్మల్ని మించినవాళ్ళు ఎవరున్నారని హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జవాబిచ్చారు.

నాకు వచ్చిన సమస్య ఏమిటంటే, కాంగ్రెస్ చేసిన తప్పులనే బీజేపీ కూడా చేయడం; నువ్వు తప్పు చేయలేదా అంటే నువ్వు చేయలేదా అని ఒకరినొకరు నిందించుకోవడం; ఈ ద్వై పాక్షిక వాగ్యుద్ధానికి జనం నిశ్శబ్ద శ్రోతలుగా ఉండడం... ఇదేనా రాజకీయమంటే?! ఈ జనానికి కూడా కాస్త ఆలోచనాశక్తి, సొంత అభిప్రాయాలూ ఉంటాయని బొత్తిగా తెలియనట్లుగా, లేదా బొత్తిగా పట్టనట్టుగా రాజకీయపక్షాలు ఎలా వ్యవహరిస్తాయి? దేశాన్ని ఎక్కువకాలం పాలించిన కాంగ్రెస్సే ఇలాంటి రాజకీయచర్చా సరళికి బాధ్యత వహించాలనీ, అదే ఈ ధోరణిని పెంచి పోషించిందనీ అనుకుందాం. కాంగ్రెస్ కన్నా గొప్ప పరిపాలన అందిస్తామనీ, గొప్ప ఒరవడులు కల్పిస్తామనీ చెప్పే బీజేపీ కూడా అలాగే ఎందుకు చేస్తోంది? తను ఈ సరళిని మార్చవచ్చు కదా!

జనంలో అందరూ కాంగ్రెస్ వాదులో, బీజేపీ వాదులో ఉండరు. ఉన్నా మంచిని మంచిగా, చెడును చెడుగా చెప్పేవారు వాళ్ళలో చాలామంది ఉంటారు. ఈ పార్టీలు వాళ్ళ ఉనికినే పట్టించుకోనట్టు ఎలా ఉంటాయి?

ఈ సందర్భంలో నా సొంత అనుభవం ఒకటి చెప్పుకోవడం అప్రస్తుతం కాదనుకుంటాను.

2004-05లో కాబోలు బీహార్ లో లాలూప్రసాద్ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయి ప్రమాదంలో పడింది. బీజేపీ మద్దతు గల నితీశ్ కుమార్ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం  హుటాహుటిన రంగంలోకి దిగి గవర్నర్ నుంచి అనుకూల నివేదికను తెప్పించుకుని రాత్రి బాగా పొద్దు పోయిన తర్వాత రాష్ట్రపతి పాలన విధింపునకు మంత్రివర్గ నిర్ణయం తీసుకుని రష్యాలో పర్యటనలో ఉన్న రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి అర్థరాత్రి ఆమోద ముద్ర తెప్పించుకుని రాష్ట్రపతి పాలన విధించింది.

అప్పుడు నేను వార్త దినపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్ గా ఉన్నాను. యూపీఏ చర్యను అర్థరాత్రి ప్రజాస్వామ్యహత్యగా వర్ణిస్తూ చాలా ఘాటైన ఎడిటోరియల్ రాశాను. ఆ పత్రిక యజమాని అప్పుడు కాంగ్రెస్ లో ఉండడమే కాదు, రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్ నేతలనుంచి వరసపెట్టి ఆయనకు ఫోన్లు. ఎడిటర్ గా ఉన్న టంకశాల అశోక్ గారిని దీనిపై ప్రశ్నించారు. "అవును. నాకూ అలాగే అనిపించింది. ఆయనకూ అలాగే అనిపించింది. అదే రాశారు. తప్పేమిటి?" అన్నారు.  విశేషమేమిటంటే దానిపై ఆయన ఆ తర్వాత ఏమీ అనలేదు.
                                                                       ***
రోజులు, జనం ఆలోచనలు మారాయన్న సంగతి గతంలో యూపీఏ గమనించుకోలేదు. అందుకు భారీ మూల్యం చెల్లించుకుంది. యూపీఏ రెండోవిడత పాలనా కాలాన్నే చూడండి. అప్పటికి మీడియా చాలా వ్యాప్తి చెందింది. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రాజకీయచర్చల ప్రత్యక్షప్రసారాలు, వాగ్యుద్ధాలు జనం డ్రాయింగ్ రూమ్ లకు చేరిపోయాయి. ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలో మీడియా శక్తియుక్తులు, పాత్రా సహస్రాధికంగా పెరిగిపోయాయి. ఈ దశలో తనపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలపై మన్మోహన్ ప్రభుత్వం దీర్ఘమౌనం పాటించి అభాసు పాలయ్యింది. దాని పతనం 2010-11 నాటికే ఖరారు అయిపోయింది. 2014 లో జరిగింది అది క్రియారూపం ధరించడం మాత్రమే.

ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ఉదాహరణల ద్వారా బీజేపీ కూడా సరిగ్గా కాంగ్రెస్ చేసిన తప్పే చేస్తోంది.
                                                                    ***

అందుకే అంటున్నాను...కాంగ్రెస్ తన అరవై ఏళ్ళకు పైబడిన పాలనలో చేసిన తప్పులనే చేసే లగ్జరీ బీజేపీకి లేదు. ఎన్నేళ్లలో వంతెన కింద చాలా నీళ్ళు ప్రవహించాయి. నేటి  జనం నిన్నటి జనం కాదు. నేటి మీడియా నిన్నటి మీడియా కాదు. మనిషికి వయసుతో పాటు లోకజ్ఞానం పెరుగుతుంది, మంచి చెడులను అంచనా వేసే వివేకమూ పెరుగుతుంది. చిన్నప్పుడు చేసిన తెలివితక్కువ పనులను పెద్దయిన తర్వాత చేయడు. అలాగే, ప్రజాస్వామ్య అనుభవమూ అవగాహనా కూడా కాలంతోపాటు పెరుగుతాయి. చిన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పుల్నే ఇప్పుడు మేమూ చేస్తామంటే కుదరదు. అది వితండవాదన అవుతుంది. అంతకన్నా ఎక్కువగా అది ఆత్మహానికి దారితీస్తుంది.



Friday, June 24, 2016

'అంగా దంగా త్సంభవసి'- కథ

రాత్రి పదవుతోంది. అప్పుడే ఆఫీసు నుంచి వచ్చి, మొహం కాళ్ళు కడుక్కుని భోజనానికి కూర్చున్నాను. ఇంటికొచ్చేసరికి రోజూ ఆ వేళ అవుతుంది.
అంతలో వీధి తలుపు తోసుకుని ఏదో సినిమాపాట కూనిరాగం తీస్తూ మా రెండోవాడు హడావుడిగా లోపలికి రాబోయి నన్ను చూసి తగ్గాడు. నా మీద ఓ ముసినవ్వు పారేశాడు. నేను ఏమైనా అంటానేమోనని ముందుగానే నా మీద జల్లే మత్తుమందు ఆ ముసినవ్వు. తలుపు వెనకనుంచి మూడు తలకాయలు తొంగి చూసి, నేను కనబడగానే వాడితో ఏదో గుసగుసగా అనేసి మాయమయ్యాయి. వాడు తలుపు వేసేసి ఓసారి లోపలికి వెళ్ళి వచ్చి,
“నాన్నా! రేపు ఆఫీసునుంచి త్వరగా వచ్చెయ్యి. సెకండ్ షో సినిమా కెళ్దాం” అన్నాడు. ఆ మాటకు నా గుండెల్లో రాయి పడింది. నోట్లోకి ముద్ద దిగడం కష్టమైంది.

Thursday, June 2, 2016

స్లీమన్ కథ-35(చివరి భాగం): రోడ్డు మీద కుప్ప కూలిపోయాడు!

పోలీసులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాస్త కళ్ళు తిరిగి ఉంటాయి తప్ప, పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని భావించిన ఆసుపత్రి సిబ్బంది అతన్ని చేర్చుకోడానికి నిరాకరించారు. దాంతో అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అతని ఆనవాలు పత్రాల కోసం, డబ్బు కోసం జేబులు వెతికారు. అవి కనిపించలేదు కానీ, వైద్యుడి చిరునామా దొరికింది. అతన్ని పిలిపించారు. స్లీమన్ గురించి అతను చెప్పిన వివరాలకు  విస్తుపోయారు. అతని దుస్తులు చూసి పేదవాడు అనుకున్నారు. అతను పెద్ద సంపన్నుడనీ, అతని పర్సు నిండా బంగారు నాణేలు ఉంటాయనీ వైద్యుడు చెప్పాడు. తనే అతని చొక్కా లోపలి జేబులోంచి బంగారు నాణేలతో ఉన్న ఒక పెద్ద పర్సును బయటికి తీశాడు.