Sunday, March 31, 2013

డబ్బింగ్ సీరియెల్సేనా? ఎన్నో నిషేధించాలి!

టీవీ చానెళ్లలో డబ్బింగ్ సీరియెల్స్ ను నిషేధించాలని తెలుగు టీవీ కళాకారులు ఆందోళనచేస్తున్నారు.  తెలుగు సినీపరిశ్రమవారు కూడా డబ్బింగ్ సినిమాలను నిషేధించాలని చాలాకాలంగా కోరుతున్నారు. ఈ డిమాండ్ లు నెరవేరితే వాటినుంచి స్ఫూర్తిని పొంది మరికొన్ని డిమాండ్ లు ఇలా మొదలవచ్చు:

హైదరాబాద్ లాంటి నగరాలలో  పిజ్జాలు, బర్గర్లు వగైరాల వైపు జనం మొగ్గు చూపుతున్నారు. దాంతో ఇడ్లీ, సాంబార్,దోస హోటళ్ళ వ్యాపారం దెబ్బతింటోంది. కనుక పిజ్జా,  బర్గర్ వగైరాల అమ్మకాలను నిషేధించాలి.

తెలుగు రాష్ట్రంలో ఇంగ్లీష్ దినపత్రికల సర్క్యులేషన్ వల్ల తెలుగు దినపత్రికల సర్క్యులేషన్ దెబ్బతింటోంది. కనుక ఇంగ్లీష్ దినపత్రికలను నిషేధించాలి.

తెలుగు రాష్ట్రంలో ఇంగ్లీష్  బుక్ మార్కెట్ వల్ల తెలుగు బుక్ మార్కెట్ దెబ్బతింటోంది. కనుక ఇంగ్లీష్ బుక్ మార్కెట్ ను నిషేధించాలి.

తెలుగు రాష్ట్రంలో శీతలపానీయాల మార్కెట్ వల్ల కొబ్బరి బోండాల వ్యాపారం దెబ్బతింటోంది. కనుక శీతలపానీయాల మార్కెట్ ను నిషేధించాలి.

తెలుగు రాష్ట్రంలో తెలుగేతర కంపెనీల ఉత్పత్తుల వల్ల తెలుగు కంపెనీల ఉత్పత్తులు దెబ్బతింటున్నాయి. కనుక తెలుగేతర కంపెనీల ఉత్పత్తులను నిషేధించాలి.

ఒకటనేమిటి, తెలుగువారి ప్రయోజనాలను దెబ్బతీసే తెలుగేతరమైన వాటిని అన్నింటినీ నిషేధించాలి. ఇలా తెలుగు రాష్ట్రంలో ఆందోళనకారులు అందరికీ అన్ని వేళలా కావలసినంత పని!

టీవీ సీరియెళ్లపై ఎన్నో  ఏళ్లుగా ఆధారపడిన తెలుగు కళాకారులు, సాంకేతికనిపుణులకు డబ్బింగ్ సీరియెళ్ల వల్ల ఉపాధి సమస్యలు ఎదురవడం లేదని కాదు. వాటిని సానుభూతితో అర్థం చేసుకోవలసిందే. కానీ, పోటీ తత్వాన్ని పెంచుకుని మరింత నాణ్యమైన తెలుగు టీవీ సీరియెల్స్ ను నిర్మించడమే సమస్యలకు పరిష్కారం కానీ; పోటీని నిషేధించడం కాదు. పోటీ యుగంలో ఉన్న మనం పోటీకి పోటీతోనే సమాధానం చెప్పాలి. సమస్యలకు కారణాలను లోపల వెతకాలి కానీ బయట కాదు.

ఇందులో ఇంకో జోక్ ఏమిటంటే, తెలుగు చానెళ్లు డబ్బింగ్ సీరియెల్స్ ప్రసారం చేయడం వల్ల తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలు, మర్యాదలు వగైరాలు తెలుసుకునే అవకాశం  తెలుగు ప్రేక్షకులకు లభించడం లేదట! అందువల్ల తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు తీరని నష్టం జరుగుతోందట. ఆడ విలన్లను, వారిలో అర్థం లేని పగా, ప్రతీకారాలను చిత్రించి విపరీత భావకాలుష్యానికి కారకులవుతున్న టీవీ సీరియెల్స్ వారు సంప్రదాయాలు, మర్యాదల గురించి మాట్లాడడం ఎంత గొప్ప వినోదం!


Thursday, March 28, 2013

సంజయ్ దత్ పై శ్రుతిమించిన చర్చలు

పాఠకులు మన్నించాలి. నెల రోజులుగా వేరే పనులలో కూరుకు పోవడం వల్ల ఏ అంశం మీదా నా అభిప్రాయాలు పోస్ట్ చేయలేకపోయాను. అయినాసరే, ఈ నెల రోజులుగా నా బ్లాగ్ చూస్తున్న పాఠకులందరికీ ధన్యవాదాలు.
                                                                ***
చట్టవిరుద్ధ ఆయుధాలతో పట్టుబడిన సినీనటుడు సంజయ్ దత్ కు సుప్రీమ్ కోర్టు శిక్ష ఖరారు చేసినప్పటినుంచీ అటు వ్యక్తులలో ఆయనకు అనుకూలంగా వ్యక్తమవుతున్న స్పందనా, ఇటు టీవీ చానెళ్లలో daily basis లో జరుగుతున్న చర్చలూ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అంతకంటే ఎక్కువగా ఆవేదన కలిగిస్తున్నాయి. సంజయ్ దత్ ను క్షమించి విడిచిపెట్టాలని మార్కండేయ కట్జూ లాంటి ఒక మాజీ న్యాయమూర్తి, అందులోనూ ప్రెస్ కౌన్సిల్ కు అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి వాదిస్తున్న తీరు మరింత దిగ్భ్రాంతి కలిగిస్తోంది. అన్ని రంగాలలో ప్రమాణాల అథఃపతనాన్నే ఇది సూచిస్తోంది. సంజయ్ దత్ చేసిన నేరం చిన్నదా, పెద్దదా, ఆయనను క్షమించి విడిచిపెట్టవచ్చా అనే విషయంలో వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు వారికి ఉండచ్చు. కానీ న్యాయస్థానం శిక్ష ఖరారు చేసిన తర్వాత తమ వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించడంలో హద్దులు పాటించాలి. అనేక అంశాలను, విలువలను దృష్టిలో ఉంచుకోవాలి. లేకపోతే, ప్రముఖులకు ఒక న్యాయం, సామాన్యులకు ఇంకో న్యాయం అనే తప్పుడు సంకేతాలు జారీ అవుతాయి. న్యాయవ్యవస్థ ప్రతిష్టను పలచన చేస్తాయి. సంజయ్ దత్ లానే జైబున్నీసా అనే 70 ఏళ్ల సాధారణ మహిళ  కూడా శిక్షను ఎదుర్కుంటోంది. కానీ ఆమె సంజయ్ దత్ లా చర్చలోకి రావడం లేదు. ఆమెపై సానుభూతి సంజయ దత్ స్థాయిలో వ్యక్తం కావడం లేదు. అలాగే, సంజయ్ దత్ ఇంటి నుంచి చట్టవిరుద్ధ ఆయుధాలను ఇంకోచోటికి తరలించిన వ్యక్తికి సంజయ్ దత్ కంటే పెద్ద శిక్ష పడింది. ఇలాంటివి న్యాయస్థానం నాలుగు గోడల మధ్య చర్చించుకోవలసిన విషయాలు. అందులోనూ న్యాయనిపుణులు చర్చించవలసిన విషయాలు. కానీ వీటిని టీవీ చానెళ్లలో daily basis పద్ధతిలో చర్చిస్తున్నారు. టీవీ స్టూడియో లనే కోర్టు రూములుగా మార్చేస్తున్నారు.
టీవీ చానెళ్లు సంజయ్ దత్ పై చర్చలు నిర్వహిస్తున్న తీరూ ఇంతే విషాదకరం. చానెళ్లు ఒకదానితో ఒకటి పోటీపడి మరీ చర్చలు నిర్వహిస్తున్నాయి. ప్రతి రోజూ అవే ముఖాలు చర్చల్లో పాల్గొంటున్నాయి. యాంకర్లు అడిగిన ప్రశ్నలే అడుగుతున్నారు. చర్చలో పాల్గొనేవారు చేసిన వాదమే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. చానెళ్లు టీయార్పీ రేటింగ్ కోసం పాకులాడుతూ ఈ చర్చలు నిర్వహిస్తున్నాయి తప్ప, శ్రోతలు విసుగొచ్చి టీవీ చూడడం మానేస్తున్నారన్న వాస్తవాన్ని పట్టించుకోవడం లేదు. ఒక చానెల్ అయితే, నిన్న మీడియా ముందుకు వచ్చిన సంజయ్ దత్ ప్రతి కదిలిక మీద వ్యాఖ్యానిస్తూ వెగటు పుట్టించింది. అటు వ్యక్తులూ, మీడియా కూడా తమ వ్యవహారశైలిని పునస్సమీక్షించుకోవడం అవసరం.