Saturday, July 1, 2017

'జన్యులిపి'లో ఆర్యుల వలస చరిత్ర

                      (ఆంధ్రజ్యోతిలో 28-6-2017న వచ్చిన నా వ్యాసం పూర్తి పాఠం)
ఆర్యులనబడేవారు భారతదేశానికి బయటినుంచి నిజంగా వచ్చారా, అప్పటికే ఇక్కడ ఉన్న సింధునాగరికతను ధ్వంసం, చేశారా, ఆర్య-ద్రవిడవిభజన నిజమేనా అన్న చర్చ ఈనాటిది కాదు. ఇది గత శతాబ్దకాలంలో వైజ్ఞానికవివాదాన్ని మించి భావోద్వేగ వివాదంగా మారి రాజకీయాలు, సంస్కృతి, సాహిత్యం, చరిత్ర సహా వివిధరంగాలకు చెందిన ఆలోచనాసరళులను ప్రభావితం చేస్తున్న సంగతి మనకు తెలుసు. సింధులిపిని ఛేదించి ఉంటే ఈ విషయంలో ఏ కొంచెమైనా స్పష్టత వచ్చేదేమో కానీ, ఆ ప్రయత్నం ఇంతవరకు సందేహాతీతమైన ఫలితాలను ఇవ్వలేదు. అలాంటిది, ఆధునిక శాస్త్రవిజ్ఞానం ఛేదించిన  జన్యులిపి ఈ వివాదాన్నిఒక కొలిక్కి తెస్తున్నట్టు, ది హిందూ (17 జూన్, 2017)ఒక పూర్తి పేజీ కేటాయిస్తూ ప్రచురించిన టోనీ జోసెఫ్ వ్యాసం వెల్లడిస్తోంది. మూడు నెలల క్రితం బిఎంసి ఎవల్యూషనరీ బయాలజీ అనే పత్రిక ప్రచురించిన పత్రంతోపాటు వివిధ ఇతర పత్రాలలోని వివరాలను, ఆ పత్రాలను రచించిన కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయాలను పొందుపరుస్తూ హౌ జెనెటిక్స్ ఈజ్ సెట్లింగ్ ద ఆర్యన్ మైగ్రేషన్ డిబేట్ అన్న శీర్షికతో వెలువరించిన ఈ వ్యాసం భారతదేశంలోకి ఆర్యుల వలస నిజంగా జరిగిందనేకాక, ఆ వలసకు సంబంధించి చరిత్రకారులు అందించిన తేదీలను కూడా దాదాపు ధ్రువీకరిస్తోంది. శిలాక్షరం కన్నా కూడా స్థిరాక్షరంగా చెప్పదగిన జన్యులిపి ఆధారంగా జరిగిన ఈ అధ్యయనాన్ని ప్రామాణికంగా తీసుకుంటే ఇది ఈ శతాబ్దిలోనే సుదూరప్రభావం చూపగలిగిన మహావిష్కారం అవుతుంది. ప్రత్యేకించి పురాచరిత్ర, పురామానవపరిణామచరిత్రలపై ఆసక్తి, అధ్యయనం ఉన్నవారికి ఇవి ఒక పెద్ద కుదుపునిచ్చే విప్లవాత్మక ఆవిష్కారమూ అవుతుంది.
ఆర్యులకు ఉత్తరధ్రువప్రాంతం తెలుసునంటూ ఋగ్వేదంనుంచి సాక్ష్యాలు అందించిన నాటి లోకమాన్య బాలగంగాధర తిలక్ నుంచి; మధ్యఆసియా లోని కాస్పియన్ సీ పరిసరప్రాంతాలను కాశ్యపి అనేవారని, కాశ్యపి అంటే భూమి అనీ, ఒకనాడు అనేక జాతులకు భాషలకు ఆవాసమైన ఆ కాశ్యపి మీదుగానే ఆర్యులు భారతదేశంలోకి వచ్చారనీ రాసిన ఇటీవలి రాంభట్ల కృష్ణమూర్తి వరకూ ఎందరో పండితులను ఈ సందర్భంలో స్మరించుకోవాలి. ఆర్యులు బండ్ల మీద అగ్నిహోత్రాలు పెట్టుకుని కైబర్, బొలాన్ కనుమల మీదుగా భారత్ లోకి అడుగుపెట్టారని శ్రీపాద అమృత డాంగే రాశారు. సంస్కృతసాహిత్యాన్నీ, దేశీయ మతసంస్కృతులను, పురావస్తు ఆధారాలతో సహా చరిత్రను మధిస్తూ ఆర్యుల రాకను ధ్రువీకరించడమే కాక; క్రీ.పూ. 3000లలో సింధునగరాలు అవతరించాయనీ, ఆర్యుల తొలి ఆక్రమణ క్రీ. పూ. 1750లో, మలి ఆక్రమణ క్రీ. పూ. 1100లో జరిగిందనీ, ఋగ్వేదకాలం క్రీ. పూ. 1500 అనీ, మహాభారతం జరిగిఉంటే క్రీ.పూ. 1000 నాటిదనీ డి. డి. కోశాంబీ అంచనావేశారు. ఇండో-యూరోపియన్ భాషలపై ప్రభావశీలమైన పరిశోధనలు జరిపి, నేటి టర్కీని ఏలిన హిట్టైట్ల లిపిని ఛేదించి అది సంస్కృతంలానే ఇండో-యూరోపియన్ కుటుంబానికి చెందిన క్షత్రభాష అని నిర్ధారించి, తెలుగు, తమిళాలను ద్రావిడభాషలని కాక, సుమేరో-అసీరియన్ భాషలనాలని అంటూ ఈ భాషలకు గల పశ్చిమాసియా చుట్టరికాన్ని చెకొస్లవేకియాకు చెందిన ప్రముఖభాషావేత్త, పురాచరిత్రనిపుణుడు ఫ్రెడరిక్ హ్రోజ్నీ వెల్లడించారు. పశ్చిమాసియాతో దక్షిణభారతజనానికి గల సంబంధాలను ప్రముఖచరిత్రకారుడు నీలకంఠశాస్త్రి చర్చించారు. ఇంకా జోసెఫ్ కాంబెల్, గార్డన్ చైల్డ్,  రొమీలా థాపర్, ఆర్. ఎస్. శర్మ, ఇర్ఫాన్ హబీబ్, బి. ఎస్. ఎల్. హనుమంతరావు వంటి ఎందరో ఆర్యుల రాక గురించిన ఆధారాల వెలుగులో చరిత్రను, పురాణ ఇతిహాసాలను గాలించి కొత్త ఆధారాలను జోడిస్తూ ఈ వాదాన్ని పరిపుష్టం చేశారు. జన్యులిపి ఆధారిత తాజా ఆవిష్కారం వీరి నిర్ధారణలను దాదాపు పూర్తిగా సమర్ధిస్తోంది.
టోనీ జోసెఫ్ వ్యాసం జెనెటిక్స్ ఆధారంగా జరిగిన అయిదు అధ్యయనాల వివరాలను క్లుప్తంగా అందిస్తోంది. తేదీల వారీగా చెప్పుకుంటే, 2009లో హార్వర్డ్ మెడికల్ స్కూల్ కు చెందిన జెనెటిక్స్ ప్రొఫెసర్ డేవిడ్ రీచ్ నాయకత్వంలో రూపొందిన అధ్యయనపత్రం, ఉత్తర భారత పూర్వీకులు(ఏన్ సెస్ట్రల్ నార్త్ ఇండియన్స్-ANI-ఎ ఎన్ ఐ) , దక్షిణ భారతపూర్వీకులు(ఏన్ సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్-ASI-ఎ ఎస్ ఐ) అనే సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చింది. జన్యుపరంగా ఉత్తరభారతపూర్వీకులు మధ్యఆసియా, యూరప్ వాసులకు సన్నిహితంగా ఉన్నారనీ, దక్షిణభారతపూర్వీకులు మాత్రం భిన్నంగా ఉన్నారనీ ఈ అధ్యయనం అన్నప్పటికీ, ఈ రెండు గ్రూపుల కలయిక ఇండో-యూరోపియన్ భాషీయులు ఇక్కడికి రావడానికి కొన్ని వేల సంవత్సరాలకు ముందే సంభవించినట్టు చెప్పింది. భారత్ లోని ఇప్పటి అత్యధికజనాభా ఈ ఎ ఎన్ ఐ, ఎ ఎస్ ఐ ల మిశ్రమానికి చెందినవారని అంటూనే, సాంప్రదాయిక అగ్రవర్ణంలో, ఇండో-యూరోపియన్ భాషీయులలో ఎన్ ఎన్ ఐ జన్యువు హెచ్చు స్థాయిలో కనిపిస్తోందని వెల్లడించింది. ఎ ఎన్ ఐ బహుళవలసల ఫలితం కూడా కావచ్చుననీ, అందులో ఇండో-యూరోపియన్ భాషీయుల వలస ఒకటి కావచ్చుననీ అభిప్రాయపడింది తప్ప వారి వలసను ఈ అధ్యయనం తోసిపుచ్చలేదు. అలాంటిది, ఈ అధ్యయనం ఆర్య-ద్రవిడ విభజనను అబద్ధంగా నిర్ధారించినట్టు చెబుతూ మీడియా ఎలా వక్రీకరించిందో, అందులో లేని తేదీలను ఎలా ఇచ్చిందో టోనీ జోసెఫ్ తన వ్యాసంలో ఎత్తిచూపారు. ఆర్య-ద్రవిడ విభజనను వ్యతిరేకించేవారు ఈ వక్రీకరణను అందిపుచ్చుకుని తమ వాదానికి ఈ అధ్యయనాన్ని ప్రమాణంగా చూపించడమూ జరుగుతోంది.
రెండోది, 2013లో హార్వర్డ్ మెడికల్ స్కూల్ కు చెందిన ప్రియా మూర్జాని నాయకత్వంలో రూపొందిన అధ్యయనపత్రం. ఈ పత్రరచనలో డేవిడ్ రీచ్, హైదరాబాద్ లోని సీసీఎంబి మాజీ డైరక్టర్ లాల్జీ సింగ్ కూడా భాగస్వాములు. ఇది భారత్ లోకి ఇండో-యూరోపియన్ భాషీయుల వలస మీద కాక, భారత్ లో విస్తృతంగా జరిగిన జనాభాసాంకర్యంపై ప్రధానంగా దృష్టిపెట్టింది. ఈ జనాభాసాంకర్యం క్రీ.పూ 1900-4200ల మధ్య జరిగిందనీ, అప్పుడే భారత్ లో సింధుకు చెందిన పట్టణనాగరికత క్షీణించడం, గంగాపరీవాహకప్రాంతమధ్యంలోనూ, దిగువనా జనసాంద్రత పెరగడం, అంత్యక్రియల పద్ధతులు మారడం, ఇండో-యూరోపియన్ భాషలు, వైదికమతం అడుగుపెట్టడం వంటి పెనుమార్పులు సంభవించాయని ఈ అధ్యయనం చెప్పింది. అనూహ్యవేగంతో జరిగిన ఈ జనాభాసాంకర్యాన్ని ఋగ్వేదం నమోదు చేసిందని డేవిడ్ రీచ్ అంటుండగా, ఆ తర్వాత ఈ సాంకర్యంపై తీవ్రవ్యతిరేకత ఏర్పడి సజాతివివాహాలకు దారితీయించిందని ఈ అధ్యయనం చెబుతూ ప్రాచీనభారతీయవాఙ్మయం ఈ పరిణామాన్ని కూడా ప్రతిబింబించిన సంగతిని ప్రస్తావించింది. భగవద్గీత వెంటనే గుర్తుకొస్తున్న ఒక ఉదాహరణ. మొదట యుద్ధానికి విముఖత చూపిన అర్జునుడు, యుద్ధంవల్ల పెద్దఎత్తున జాతిసాంకర్యం ఏర్పడుతుందన్న భయాన్ని వ్యక్తం చేస్తాడు. మహాభారతంలోని ప్రధానాంశాలలో ఈ జనాభాసాంకర్యం కూడా ఒకటి కావడం ఈ సందర్భంలో చెప్పుకోవలసిన మరో ఆసక్తికర విషయం.
మూడవది, మూడేళ్ళ క్రితం కాలిఫోర్నియాలోని స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో జెనెటిక్స్ విభాగానికి చెందిన పీటర్ అండర్ హిల్ నాయకత్వంలో 32 మంది శాస్త్రవేత్తలు ఆర్1ఎ (R1a) అనే హెప్లోగ్రూపు వ్యాప్తిపై (హెప్లోగ్రూపులు ఏక ఆనువంశికతను గుర్తిస్తాయి) చేసిన విస్తృత అధ్యయనం. దీని ప్రకారం, ఈ ఆర్1ఎ గ్రూపు రెండు ఉప-హేప్లో గ్రూపులుగా చీలిపోయింది. ఒకటి ప్రధానంగా యూరప్ కు పరిమితమైతే ఇంకొకటి మధ్య, దక్షిణాసియాలకు పరిమితమైంది. యూరప్ లోని 96 శాతం ఆర్1ఎ నమూనాలు జడ్ 282 అనే ఉప-హేప్లో గ్రూపుకు చెందినవైతే, మధ్య, దక్షిణాసియాలలోని 98.4 శాతం ఆర్1ఎ నమూనాలు జడ్ 93 అనే ఉప-హేప్లో గ్రూపుకు చెందినవని తేలింది. ఈ రెండు గ్రూపులు దాదాపు 5,800 ఏళ్ల క్రితం విడిపోయాయి. భారత్ లో ప్రబలంగా ఉన్న జడ్ 93 ఆ తర్వాత మరిన్ని శాఖలుగా చీలిపోయింది. ఆ చీలిపోవడమూ, ఆ చీలికల విస్తరణా అసాధారణవేగంతో జరిగాయి. అలా చీలిన మూడు ప్రధాన గ్రూపులే ఇప్పుడు భారత్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, హిమాలయప్రాంతాలలో ఉన్నాయి.
నాలుగవది, స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన డేవిడ్ పోజ్నిక్ నాయకత్వంలో రూపొంది 2016 ఏప్రిల్ లో ప్రచురితమైన అధ్యయనపత్రం. పురుషపారంపరికతకు చెందిన వై-డి ఎన్ ఎ(Y-DNA) విస్తరణను ఇది పరిశీలించింది. ఈ పత్రరచనలో పైన పేర్కొన్న డా. అండర్ హిల్ సహా 42మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. జడ్ 93నుంచి చీలిన గ్రూపుల విస్తరణ ఇంచుమించు 4,000-4,500 సంవత్సరాల క్రితం భారీ ఎత్తున జరిగినట్టు ఈ అధ్యయనం తేల్చింది. సింధునాగరికత అంతరిస్తున్న కాలమూ దాదాపు అదే.
అయిదవది, బ్రిటన్ లోని హడ్డర్స్ ఫీల్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొ. మార్టిన్ పి. రిచర్డ్స్ నేతృత్వంలో 16మంది శాస్త్రవేత్తలు మూడు మాసాల క్రితం వెలువరించిన అధ్యయనపత్రం. టోనీ జోసెఫ్ ప్రకారం, ఇది ఇంతవరకు జరిగిన పరిశోధనలను ఒకచోట చేర్చి, పొందికైన వలసచరిత్రను నిర్మించడానికి ప్రయత్నించింది. గత 12,500 సంవత్సరాలకాలంలో భారతీయ జన్యుసంపుటిలోకి బయటనుంచి కొత్త జన్యువులు ఏవీ ప్రవేశించలేదని, ఇంతవరకు అందుబాటులో ఉన్న మాతృపారంపరిక (mtDNA-తల్లి నుంచి కూతురికి సంక్రమించేది) డి ఎన్ ఏ డేటా సూచిస్తుండగా,  కొత్తగానూ విరివిగానూ అందుబాటులోకి వచ్చిన పురుషపారంపరికతను సూచించే వై క్రోమోజోమ్ కు చెందిన డి ఎన్ ఏ డేటా ఆ పరిశీలనను ఎలా తలకిందులు చేస్తోందో ఈ పత్రం వెల్లడించింది. క్రీ. పూ. 2000 ప్రాంతంలో, అంటే ఇప్పటికి 4వేల పై చిలుకు ఏళ్ల క్రితం భారతీయపురుషపారంపరికతలోకి బయటనుంచి కొత్త జన్యువు ప్రవేశించిందని, తల్లి పారంపరికజన్యువులో ఈ సమాచారం లోపించడానికి కారణం, ఈ కొత్త పురుష పారంపరికజన్యువుకు కారణమైన వలసదారులు తమ స్త్రీలను వెంటబెట్టుకుని రాకపోవడమేనని చెప్పింది.  భారత్ లో 17.5 శాతం పురుషపారంపరికత- ఒకే ఆనువంశికతను సూచించే ఆర్1ఎ కి చెందినదని వై-డి ఎన్ ఎ డేటా వెల్లడించింది. ఈ ఆర్1ఎ గ్రూపు ఈరోజున మధ్య ఆసియా, యూరప్, దక్షిణాసియాలలో వ్యాపించి ఉంది. నల్లసముద్ర ఉత్తరతీరంనుంచి కాస్పియన్ సముద్రపు తూర్పు వరకు వ్యాపించిన పాంటిక్-కాస్పియన్ గడ్డిమైదానా(స్టెప్పీలు)లనుంచి వ్యాపించడం ప్రారంభించిన ఈ ఆర్1ఎ గ్రూపు, మార్గమధ్యంలో వివిధ ఉపశాఖలుగా చీలిపోతూ అటు పశ్చిమంగా యూరప్ లోకి ఇటు తూర్పున దక్షిణాసియాలోకి విస్తరించినట్టు అధ్యయనం తేల్చింది.
పాంటిక్-కాస్పియన్ గడ్డిమైదానాలనుంచి వలసలు వ్యాపించడం ప్రారంభించాయనడం- పురావస్తు, భాషా, వాఙ్మయ  ఆధారాలతో ఎప్పుడో ఆ నిర్ధారణ చేసిన ఎందరో చరిత్రకారుల నిశితపరిశోధనకు, వస్తుగతదృష్టికి తిరుగులేని నిరూపణలలో ఒకటి. ఉదాహరణకు, క్రీ. పూ. 2000 ప్రారంభంలో, చివరిలో రెండు విడతలుగా ఆర్యులు మధ్య ఆసియానుంచి వలసలు ప్రారంభించారనీ; ఈ రెండు వలసలూ ఇటు భారత్ ను, అటు బహుశా యూరప్ నూ కూడా ప్రభావితం చేశాయని డి. డి. కోశాంబీ (ద కల్చర్ అండ్ సివిలిజేషన్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా ఇన్ హిస్టారికల్ ఔట్ లైన్) అంటారు. అలాగే, పశుపాలక సంచారులైన ఆర్యులలో కొందరు రష్యన్ గడ్డిమైదానాలపై ఆధిపత్యం సాధించగా, కొందరు కాస్పియన్ సముద్రాన్ని చూడుతూ ఆసియా మైనర్(నేటి టర్కీ)లోకి ప్రవేశించారని, మరో బృందం డాన్యూబ్ నదీలోయలోనూ, ఎగువ యూరప్ లోనూ పరశు(గొడ్డలి)హస్తులుగా ప్రత్యక్షమయ్యారనీ మరోచోట(ఏన్ ఇంట్రడక్షన్ టు ద స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ) రాశారు. ఇంతకీ భారత్ లోకి ఆర్యుల వలస లేదా ఆక్రమణ గురించి పైన చెప్పిన జన్యుసమాచారం ఈ దేశంలో సంభవించిన మొత్తం వలసల గురించిన చిన్న, పాక్షికచిత్రాన్ని మాత్రమే చూపుతోందనీ,  ఇంతకంటే విస్తారంగా జరిగిన వాటితో సహా మరికొన్ని వలసలు ఉన్నాయనీ టోనీ జోసెఫ్ గుర్తుచేశారు. అవి, 1. 55,000-65,000 ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి జరిగినవి. 2. క్రీ. పూ. 10,000 తర్వాత పశ్చిమాసియానుంచి అలలు అలలుగా సాగిన వ్యవసాయసంబంధ వలసలు. 3. తూర్పుఆసియా నుంచి ముండా వంటి ఆఫ్రో-ఏషియన్ భాషీయుల వలసలు. 4. తూర్పుఆసియానుంచే టిబెటన్-బర్మన్ భాషీయుల వలసలు. దాదాపు ఈ వలసలన్నిటిపైనా పురాచరిత్ర, పురామానవపరిణామచరిత్రకారులు చేసిన విలువైన నిర్ధారణలు పుష్కలంగా ఉన్నాయి. జన్యుఆధారాలు వాటినీ ధ్రువీకరించినా ఆశ్చర్యంలేదు.  
ఆర్యుల వలస సిద్ధాంతాన్ని గతంలో వ్యతికేరించిన, లేదా సందేహించిన డా. అండర్ హిల్, డేవిడ్ రీచ్ వంటి జన్యుశాస్త్రవేత్తలు ఇప్పుడు మరింత విరివిగా లభించిన సాక్ష్యాలను పురస్కరించుకుని తమ అభిప్రాయాన్ని సవరించుకున్నట్టు టోనీ జోసెఫ్ వ్యాసం వెల్లడిస్తోంది. అదలా ఉంచితే, ఆర్య-ద్రవిడ విభజనను తీవ్రంగా వ్యతిరేకించే భావజాలానికి చెందినవారు అధికారంలో ఉండి, భాష, చరిత్ర, సంస్కృతి, సాహిత్యం వగైరా అనేక రంగాలను తమ విభజన వ్యతిరేక భావజాలానికి అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్న ఘట్టంలో ఆర్యుల వలస గురించిన ఇలాంటి జన్యుఆధారాలు వెలుగు చూస్తుండడం గమనించవలసిన యాదృచ్చికత. వీటి పర్యవసానాలు, ప్రభావాలు అన్ని రంగాలలోనూ బహుముఖంగా ఉండగల అవకాశముంది.
అయితే, ఆర్యులనేవారు ఎక్కడినుంచో రాలేదనీ, భారతీయపూర్వులు 15వేల సంవత్సరాలక్రితమే మధ్య, పశ్చిమాసియా, యూరప్ లకు విస్తరించి అక్కడి జనాభాలో కలసిపోయారనే వాదమూ ఉంది. ఆవిధంగా జనాభాసాంకర్యం జరిగిందనడంలో ఉభయవాదాల మధ్య ఏకీభావం ఉన్నప్పుడు, వలసలు-జనాభాసాంకర్యం అన్న  కోణం ప్రస్ఫుటంగా ముందుకొస్తుంది. పురాకాలంలో ప్రపంచమంతటా వలసలు సర్వసామాన్యాలు. ఆహారాన్వేషణలో మనిషి భూభ్రమణం చేసిన సంగతిని ప్రస్తావిస్తూ దాని పర్యవసానాలను రాంభట్ల తన జనకథలో రాశారు. ఆత్మోత్కర్షను అలవిమాలిన స్థాయికి పెంచుకుని తామూ, తమ దేశమూ, తమ భాషా, సంస్కృతులూ స్వయంభువులని, ఎలాంటి బాహ్యసంపర్కాలూ లేకుండా స్వతంత్రంగా అభివృద్ధి చెందినవనీ, మనం ఒకరికి ఇచ్చిందే తప్ప తీసుకున్నది ఏమీలేదనీ అనుకునే అవకాశం ఎలా చూసినా లేదు. పురామానవుడి అనుభవవైశాల్యాన్ని కొలవడానికి నేటి మన కొలమానాలు పనికిరావు. నేటిలా ప్రయాణసాధనాలు లేని రోజుల్లో కూడా పురామానవుడు మనం చూడనంత ప్రపంచాన్ని చూశాడని, నేడు మనకు లేనంత భావవైశాల్యాన్ని పెంచుకున్నాడనీ ప్రముఖచరిత్రకారుడు హెచ్. జి. వెల్స్ అంటాడు. వలసలు, జనాభాసాంకర్యం నిజమని తేలినా అది ఈ దేశవైవిధ్యవంతమైన అస్తిత్వానికి మరో నిక్కమైన నిరూపణే అవుతుంది. ఆహారస్వేచ్ఛ, భావప్రకటనస్వేచ్ఛతో సహా అన్ని హక్కులనూ గుర్తించి గౌరవించే  ప్రజాస్వామికవ్యవహరణకు మరింత స్ఫూర్తిదాయకమూ, దోహదమూ అవుతుంది.
                                                                                                            
                                             

5 comments:

  1. భాస్కరం గారు, ఈ అంశం పై ఫేస్ బుక్ లో వేమురి సుధాకర్ లేవనెత్తిన ప్రశ్నలు,జరిగిన చర్చ చూడండి.

    https://www.facebook.com/umraoc/posts/1575820579108978

    ReplyDelete
  2. ఆఖరి పేరాలో మీరు రాసిన ముగింపు ప్రకారం అందరు వలస జీవులైతే ఇక ఆర్యులేవరు? ద్రవిడులెవరు? ఆర్య ద్రవిడ సిద్దాంత అవసరమేమిటి? దానిపై ఇంత పరిశోధన ఎందుకు? ఈ సిద్దాంతం తమిళ నాడు ప్రజలు,బ్రిటిష్ స్టూజ్ లైన రోమిల్లా థాపర్ వంటి లెఫ్టిస్త్ మేధావులు తప్ప, వాళ్లకానుకొని ఉన్న పక్క రాష్ట్రాల తెలుగు,కన్నడ,మళయాళ ప్రజలు ఎందుకు పట్టించుకోరు?నమ్మరు? ద్రవిడులు చుట్టుపక్కల భూభాగం వదిలేసి తమిళనాడులోకి పారాచూట్ వేసుకొని దిగారా? :)
    ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం లో ఉన్నప్పుడు పెరియార్,అన్నా దొరైలు ద్రవిడ ప్రాతిపదికన తెలుగు వాళ్ళు కాంగ్రెస్ పార్టికి వ్యతిరేకంగా ఏకమవ్వాలని ప్రయత్నిస్తే తెలుగు వారు ఆ సిద్దాంతం పట్టించుకోలేదుకదా!

    చివరిగా ఈ బోగస్ సిద్దాంతంపై వందేళ్ళు దాటుతున్నా విదేశీయులకు ఎందుకంత ఆసక్తి? భారత ప్రజలను ఎందుకు తప్పుత్రోవ పట్టించాలనుకొంటారు?

    ReplyDelete
  3. భాస్కరం గారు, ఆర్య ద్రవిడ సిద్దాంతం నిజమా? అబద్దమా? అన్న విషయం పక్కన పెడితే, ఇదొక మంచి వ్యాసం.చాలా ఉపయుక్తమైన వివరాలు ఉటంకించారు

    ReplyDelete
  4. నేడు క్రొత్తగా ఇండియా ఫ్యాక్ట్సలో వచ్చిన వ్యాసం లంకె
    http://indiafacts.org/narrative-meta-narrative-tony-josephs-opus-aryan-invasion-theory/

    Narrative and meta narrative ^ tony joseph ^ opus aryan invasion theory

    ReplyDelete
  5. భాస్కరం గారూ,
    టోనీ జోసెఫ్ వక్రీకరణలకు సమాధానంగా నేడు తాజాగా ఇంకొక వ్యాసం ఇండియా ఫ్యాక్ట్స్ ప్రచురించింది.
    దాని లంకె
    Narrative and matanarrative _ Tony joseph
    http://indiafacts.org/narrative-meta-narrative-tony-josephs-opus-aryan-invasion-theory/

    ఈ వ్యాసంలో ఉదహరించబడిన ఫైనాన్షియల్ టైమ్స్ వ్యాసాన్ని కేవలం చందాదారులు మాత్రమే చూడగలరు. అందుకని, నేను కొంత వెతికి అదే వ్యాసాన్ని ఇంకొక జాలగూడులో కనుగొన్నాను. దాని లంకె కూడా యిస్తున్నాను.
    The human race actually started much earlier than previously believed
    http://www.newsjs.com/url.php?p=http://www.rawstory.com/2017/06/the-human-race-actually-started-much-earlier-than-previously-believed/
    ఇంకొక ఆసక్తికరమైన వ్యాసం కూడా యిస్తున్నాను, నిజానికి అదే ఈ వ్యాసాలన్నింటికీ మూలం.
    Ancient Fossils from Morocco Mess Up Modern Human Origins
    https://www.scientificamerican.com/article/ancient-fossils-from-morocco-mess-up-modern-human-origins/#

    ఒక చిన్న అభ్యర్థన. ఇవన్నీ మీరు చదివిన పిమ్మట టోనీ జోసెఫ్ తప్పుడు ఉద్దేశంతో, మిడిమిడి జ్ఞానంతో ఈ వ్యాసం వ్రాసాడని భావిస్తే మీరు ఆంధ్రజ్యోతిలో వ్రాసిన పై వ్యాసాన్ని సవరిస్తూ ఇంకొక వ్యాసం వ్రాయడానికి అవకాశముందేమో ఆలోచించగలరు.

    ReplyDelete