Sunday, September 21, 2014

ఇది విన్నారా? వీవీఐపీ లకు ప్రత్యేకంగా శ్మశానమట!!!

నిన్న పొద్దుటే ఈ వార్తను ఒక టీవీ చానెల్ లో చూసి నా కళ్ళను, చెవులను నేనే నమ్మలేకపోయాను...

ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆలోచనలు వస్తాయా అనుకున్నాను. ఇంత దిక్కు మాలిన, దరిద్రపు ఆలోచనలు అసలు ఈ రోజుల్లోనే వస్తాయేమో. అందులోనూ మాటి మాటికీ ఆమ్ ఆద్మీ గురించి మాట్లాడుతూ వచ్చిన యూపీఏ ప్రభుత్వం చేసిన ఆలోచన ఇది. 

బాధ కలిగిందని చెప్పను. చాలా కోపం వచ్చింది.  కంపరం కలిగింది. అసహ్యం వేసింది. 

ఢిల్లీలో వీవీఐపీలకోసం ప్రత్యేకంగా ఒక శ్మశానం నిర్మిస్తున్నారట. దీనిని యూపీఏ తలపెట్టిందట. 80 శాతం పని పూర్తయిందట. ఎన్డీయే ప్రభుత్వం బుద్ధిగా మిగతా పనిని పూర్తి చేస్తుందట.

 చావును equalizer గా చెబుతారు. అందులో పేద, ధనిక; రాజు, బంటు లాంటి తేడాలు ఉండవని ప్రతి దేశంలోనూ, ప్రతి సంస్కృతీ బోధిస్తుందని అనుకుంటాను. 'చివరిగా మనిషికి కావలసింది ఆరడుగుల నేల, అంతే కదా!' అనడమూ వింటుంటాం. 'పోయినప్పుడు ఏం పట్టుకు పోతారు?' అనే నానుడి కూడా వింటుంటాం. అలెగ్జాండర్ చనిపోయినప్పుడు రెండు అరచేతులూ తెరచుకుని ఉన్నాయట. పోయేటప్పుడు ఏమీ పట్టు కెళ్లడం లేదని సూచించడమని దానికి అర్థం చెబుతారు. చావుతో అన్ని రకాల హెచ్చుతగ్గుల తేడాలు అంతమైపోతాయని ప్రతి సంస్కృతీ నూరిపోసిన భావన.

అలాంటిది, వీవీఐపీలకు ప్రత్యేక శ్మశానం అనేది ఊహించడానికే సాధ్యం కాని విషయం. అసలీ విషయం వార్తలలోకి మొదటే ఎందుకు రాలేదో ఆశ్చర్యం. 24 గంటల వార్తా చానెళ్ల దృష్టికి కూడా ఈ వార్త ఎందుకు రాలేదో తెలియదు. రాజకీయపార్టీలు ఏంచేస్తున్నాయో తెలియదు. ఎన్డీయే ప్రభుత్వం దీనిని ఎందుకు నిశ్శబ్దంగా పూర్తి చేయాలనుకున్నదో తెలియదు. ఇప్పుడు దీనినే ఆదర్శంగా తీసుకుని దేశమంతా రెండు గ్లాసుల వ్యవస్థలా రెండు శ్మశానాల వ్యవస్థ ఏర్పడే పరిస్థితిని ఒకసారి ఊహించుకుని చూడండి. కంపరం పుట్టుకు రాకుండా ఉంటుందా?

సల్మాన్ ఖుర్షీద్ అనే కాంగ్రెస్ కేరక్టర్ ఈ వీవీఐపీ శ్మశానాన్ని సమర్థిస్తూ,  దేశం కోసం కష్టపడిన నాయకులు, సెలెబ్రటీలకు ఇంతకన్నా గొప్ప నివాళి లేదన్నట్టు మాట్లాడారు. ఛీ...ఛీ...అనడం తప్ప ఏం చేయగలం? 

3 comments:

  1. ఇది వర్గదృష్టితో చేస్తున్నది కాకపోవచ్చు. బ్రతికుండగా VVIP లుగా ఉన్నవాళ్ళకి నివాళులర్పించడానికి ప్రస్తుత VVIP లూ, ఇతర ప్రజలూ వచ్చినప్పుడు వారి కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు అవసరమవుతాయి. అలాగే మృత VVIP ల సమాధులకి ప్రత్యేకంగా మెయిన్ టెనెన్స్ కూడా అవసరమవుతుంది. అవన్నీ మామూలు శ్మశానాల్లో కుదరవు కదా.

    ReplyDelete
  2. దివంగతులకు నివాళి నర్పించుటకు గాను శ్మశానములకు బోవలయునా? పోయినవారి ప్రేతాత్మలు వారి దహనఖననాదిక సంస్కారంబులు జరిగిన చోట్లను వీడక నచ్చటనే వ్రేలాడుచుండు ననియా యట్లు సేయుట? ఒకవేళ దివంగతవ్యక్తులు తమతమ జీవితకాలంబులందు రాజకీయాదికకశ్మలంబులం బొరలియున్న యెడల వారికి స్వర్గమందని యేమి నరకమందునుం బ్రవేశంబు లేకుండవచ్చు నని యా యిట్టి మహోత్కృష్టంబగు నాలోచనంబులను జేయువారల సిధ్ధాంతము. కావచ్చును. అట్లైన సరియే. అట్టి వారల యంతిమసంస్కారంబుల నితర సాధారణమానవులకునుం బలె నాచరించిన నా సాధారణులకు నవమానపూర్వక మగును గాన నిట్టి యాలోచనముల నవశ్యము స్వాగతింపక దీఱదు. ఇట్టి దిక్కుమాలిన యాలోచనంబుల యందును గొంత సారస్యము గోచరించుచున్నది కదా!

    ReplyDelete
  3. డిల్లీ మొత్తం గాంధుల (GhaT)బొందల గడ్డనే కదా ఇప్పుడు కొత్తగా ఆలోచించేది ఏముంది?

    అసలు ఇది ఎన్.డి.ఏ ప్రభుత్వం కనుక ఈ కాస్త విషయం బయటకి వచ్చింది ... యు.పి.ఏ అయ్యుంటే పప్పు రాజా వారు రిబ్బన్ కొరికే వరకు తెలిసేది కాదేమో!!.

    ReplyDelete