Monday, February 8, 2016

చాగంటివారూ...భాగవత అనువాదకులు ఒక్కరు కాదు, నలుగురు!

ఈరోజు పొద్దునే శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనం వింటున్నాను. "మహాభారతాన్ని నన్నయ, తిక్కన, ఎర్రన ముగ్గురు అనువదించారు. కానీ భాగవతాన్ని పోతన ఒక్కరే అనువదించారు" అని ఆయన అన్నారు. "ప్రమాదో ధీమతామపి" అన్నట్టుగా చాగంటివారూ పొరబడతారనిపించింది.

ఆంధ్రమహాభాగవతాన్ని పోతన ఒక్కరే కాక, వెలిగొందల నారయ, గంగన, ఏల్చూరి సింగన అనే మరో ముగ్గురు అనువదించారు, లేదా పూరించారు.

(శ్రీ మహాభాగవతం, తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, పీఠిక, పుట: 15)

11 comments:


  1. స్వామీ !

    భాగవత మంటే పోతన వారి భాగవత మే ! ఆ తరువాయే ఏదైనా ఎవరిదైనా !

    ReplyDelete
  2. స్పష్టత నివ్వడంలో నేనే పొరబడ్డానా? నేనన్నది మనం పోతన భాగవతంగా చెప్పుకుంటున్న రచనను మొత్తం పోతనే రాయలేదని. అందులో మరో ముగ్గురి అనువాదం కూడా ఉందని.

    ReplyDelete
  3. శ్రీమదాంధ్రమహాభాగవత కర్తగారు బమ్మెరపోతనామాత్యులు. అనువాదసరళి, అనువాదప్రణాళిక ఆయనవే కావచ్చును. ఆయన భాగవతగ్రంథానువాదంలో కొన్ని భాగాలను శిష్యులైన వెలిగందల నారయ, సింగన, గంగనలకు ఇచ్చినట్లుగా అభిప్రాయం ప్రచురంగా ఉంది. గ్రంథంలో హెచ్చుభాగం పోతనామాత్యప్రణీతమే.

    కర్తృత్వం: పోతన (1,2,3,4), గంగన (5), సింగన (6), పోతన (7,8,9.10), నారయ (11,12).

    ReplyDelete
  4. నిజమేనండీ. హెచ్చు భాగం పోతనామాత్య ప్రణీతమే. అలాగే మహాభారత అనువాదంలో హెచ్చు భాగం తిక్కనది(15పర్వాలు). నన్నయ(రెండున్నర పర్వాలు), ఎర్రన(అర్థపర్వం) భాగాలు తక్కువే. అయినా కవిత్రయం అంటున్నాము. పూర్తిగా పోతనపేరుతోనే తెలుగు భాగవతం ప్రసిద్ధిలోకి వచ్చినా factual details లోకి వెళ్లినప్పుడు చాగంటివారు అన్నట్టు తెలుగు భారతానికి భిన్నంగా పోతన ఒక్కరే భాగవతాన్ని అనువదించారని అనలేము కదా?!

    ReplyDelete
    Replies
    1. "ఆయన భాగవతగ్రంథానువాదంలో కొన్ని భాగాలను శిష్యులైన వెలిగందల నారయ, సింగన, గంగనలకు ఇచ్చినట్లుగా అభిప్రాయం ప్రచురంగా ఉంది."
      అభిప్రాయం ప్రచురంగా ఉండడం కాదండీ. స్కంధాంత గద్యలో స్పష్టంగా ఉంది. నేను వెంటనే పంచమస్కంధం మాత్రం చూశాను. అందులో, "ఇది సకల సుకవిజనానందకర బొప్పనామాత్యపుత్ర గంగనార్య ప్రణీతంబైన శ్రీమద్భాగవత పురాణంబునందు..."అని ఉంది.

      Delete

  5. ఓహో ! క్రెడిట్ అందరికి ఇచ్చి ఉండవచ్చు గదా అన్న విషయ మన్న మాట !

    ప్చ్ !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మనం కొత్తగా క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదండీ. ఉన్నది చెబితే చాలు.

      Delete
  6. గంగన, సింగన, నారయలు పోతన గారి శిష్యులు. పోతన గారు చేసిన భాగవతం లో కొంత భాగం లుప్తమవడం వల్ల దానిని ఇతఃపూర్వమే గురువుదగ్గర విన్నవీరు పూరించారని చరిత్ర. ఆరేసి స్కంధాలుగా రెండు వరుసలలో అంటే 1నుండి 6 వరకూ ఒక బొత్తిగా, 7నుండి 12 వరకూ ఒక బొత్తిగా ఉంచబడిన తాళపత్రాల దొంతరలు క్రింది వేపు నుండి చెదలు పట్టడం వల్ల 5,6,11,12 భాగాల్లో ఎక్కువభాగం నష్టమయ్యిందనీ వానిని ఈ మువ్వురూ తిరిగి పూరించారనీ చెప్తారు (సౌందర్యలహరిలో నష్టమైన శ్లోకాలు తిరిగి శంకరులు యథాతథంగా పూరించినట్లు కాకపోయినా, పొతనగారు చెప్పిన రీతిలో...) పోతనగారి చరిత్రలో కూడా చెప్పబడింది. చరిత్ర కారులు సాహిత్యకారులూ ఈ విషయమే రూఢి చేస్తున్నారు. అసలు భాగవతం తెనిగించింది పోతనగారొక్కరే. కొన్ని భాగాలు నష్టం వల్ల ఐతే మనకు లభ్యంలో ఉన్నవాటిలో ఈ నాలుగధ్యాయాలలోనూ పోతనగారి పద్యాలతోపాటు ఈ మువ్వురి పద్యాలూ మిళితమై లభిస్తున్నాయి. ఒకవేళ పోతనగారు తన శిష్యులచే ఆ రచనలు చేయించి ఉంటే గ్రంథం మొదట్లోనే ఆ విషయం చెప్పేవారు. ఆయన శ్రామికుడు కానీ శ్రమని దోచుకునేవారు కాదుగా.... :)

    ReplyDelete
  7. some more info on this....

    ఒనరన్ నన్నయ తిక్కనాది కవు లీ యుర్విం బురాణావళుల్
    తెనుఁగుం జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దా నెట్టిదో
    తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్ దీనిం దెనింగించి నా
    జననంబున్ సఫలంబుఁ జేసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్.

    ఇది పోతన కంఠోక్తి. ఇందు భాగవతము తానే రచించి తరింతునని పోతన ఇదమిత్థముగ తెలిపిన సంగతి కలదు. ఇతరుల చేతను రచింపచేసి తరింప జేయుదునని లేదు. అనగా భాగవతములోని 12 స్కంధములను బమ్మెర పోతరాజే రచించెనని అవగాహనమగును. పోతన భాగవతము నందు పోయిన స్కంధములను పోతన తర్వాత ఇతరులు రచించుట సంగతము. ఫొతన ప్రియశిష్యులు వెలిగందల నారయ, హరిభట్టు రచించిన ఏకాదశ ద్వాదశ స్కంధములందు ఇంచుమించు సమాన పద్యములు కలవు అవి పోతన కృతములే అగును. అలతి భేదముల వెలిగందల నారయ, హరిభట్టు పూరించినవి అగును. కనుక పోతన పండ్రెండు స్కంధములను రచించుట తథ్యము.
    పంచమ, షష్ఠ స్కంధములు పూర్తిగను, ఏకాదశ ద్వాదశ స్కంధములు చాలవఱకు శిథిలము లయినవి. చాల వఱకు శిథిలమైన పోతన ద్వాదశ స్కంధము చివఱ మిగిలిన ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి అను పద్యమును పోతన ప్రియ శిష్యుడైన వెలిగందల నారయ తన ద్వాదశస్కంధ కర్తృత్వమునకు బాధకము కాకుండ, అనుకూలమైన అన్యస్థలము నిరవకాశము ఖావున, ప్రతికూలమైన పోతన అవతారిక యందు భద్రము చేయుట సంభవము.... and on..... so the statement stands good sir :)

    ReplyDelete
    Replies
    1. సరళవాక్యంగా మొదలైన విషయం సంక్లిష్టవాక్యంగా మారింది...అయినా బాగుంది.
      ‘పోతనగారు రాసిన భాగవతం” అని ఎవరు ఎన్నిసార్లు అన్నా ఇబ్బంది లేదు. ఆంధ్రమహాభాగవతం అనగానే పోతన భాగవతంగానే ప్రాచుర్యంలోకి వచ్చేసింది. పోతనగారు రాసిన ఘట్టాలే జనం నాలుకలమీద నిలిచిపోయాయి. అదే, భారతానువాదానికి వస్తే, కవిత్రయ భారతం అంటాం కానీ; నన్నయభారతమనో, తిక్కన భారతమనో అనం. ఈ తేడాకు వివిధ కారణాలను చెప్పుకోవచ్చు. కవులుగా నన్నయ, తిక్కన, ఎర్రనలు ఒకే స్థాయికి చెందినవారు కావడం; నారయ, గంగన, సింగనలు పోతనతో సమానస్థాయి కలిగిన కవులు కాకపోవడం వాటిలో ఒకటి కావచ్చు.
      ఇక్కడ అసలు విషయమేమిటంటే, “మహాభారతాన్ని ముగ్గురు అనువదిస్తే, భాగవతాన్ని పోతన ఒక్కరే రాశా”రని చాగంటివారు అనడం! అలా పోల్చి చెప్పడంవల్ల విషయం perception(ఆంధ్రమహాభాగవతం అనగానే పోతన భాగవతంగా ప్రాచుర్యంలోకి రావడం)పరిధిలోంచి, factual detail (భాగవతాన్ని పోతనే కాక; మరో ముగ్గురు పూరించడమో, అనువదించడమో చేశారన్న)లోకి వెళ్లాల్సిన అవసరాన్ని కల్పించింది. Perception బలం వల్ల చాగంటివారు ఆ factual detail ను మరచిపోయి ఉండవచ్చు. అందుకే ప్రమాదో ధీమతామపి అన్నాను.
      తీరా నాగేంద్ర అయ్యగారి స్పందన చూసిన తర్వాత, ఇంతకీ నారయ, గంగన, సింగనలు చెదలు తిన్న పోతన భాగవత భాగాలను కేవలం పూరించారా, లేక స్వతంత్రంగా అనువదించారా అన్న సందేహానికి అవకాశం కలుగుతోంది. ఎలాగంటే,
      1. చెదలు తిన్న భాగాలను పూరించడమే చేసి ఉంటే, అంతకుముందు నన్నయ వదిలిపెట్టిన భాగాన్ని ఎర్రన పూరించిన నమూనా వారికి తెలిసే ఉంటుంది. ఎర్రన తను పూరించిన భాగాల ఆశ్వాసాంతగద్యలో నన్నయ రాసినట్టే చెప్పారు తప్ప తను రాసినట్టు చెప్పలేదు.(“శారదరాత్రు లుజ్జ్వల...” పద్యంతో నన్నయ రచన ఆగిందనీ, “స్ఫురదరుణాంశురాగరుచి...” పద్యంతో ఎర్రన రచన ప్రారంభమైందనీ ఎలా గుర్తించారో? బహుశా శైలీ భేదాన్ని బట్టి గుర్తించారేమో!). తమ ముందు ఎర్రన నమూనా ఉన్నా నారయ, గంగన, సింగనలు స్కంధాంత గద్యలో పోతన రాసినట్టు కాక, తాము రాసినట్టే ఎందుకు చెప్పారు? దీనినిబట్టి వారు చేసింది పూరణ కాదనీ సొంత అనువాదమనీ అనుకునే అవకాశం లేదా?
      2. పోతన రాసిన భాగాలు కొన్నింటిని చెదలు తినడంతో మిగతా ముగ్గురూ పూరించారన్న వాదంలోని హేతుబద్ధతను ఇంకోలా కూడా చూద్దాం. ఆ ముగ్గురూ పోతన గారి శిష్యులే అయినప్పుడు కొంత వయోభేదంతో ఆయనకు సమకాలికులే అవుతారు. అలాంటప్పుడు పోతన జీవించి ఉండగానే, లేదా ఆయన స్వర్గస్తులైన అనతికాలంలోనే ఆయన రాసిన భాగాలను చెదలు ఎలా తింటాయి? ఆమాత్రం జాగ్రత్త తీసుకోకుండా ఉంటారా? అదీగాక, భాగవతానువాదం లాంటి విశిష్టకృతికి ఒకటికి మించిన ప్రతులను వెనువెంటనే తయారు చేసుకుని ఉండడం సహజం. అందులోనూ ముగ్గురు శిష్యులు ఉన్నప్పుడు తప్పకుండా ప్రతులు తయారు చేసి ఉండాలి. అలాంటప్పుడు, ఒక్క ప్రతి మాత్రమే ఉండడం, దానిని చెదలకు అప్పగించడం, దాంతో ముగ్గురు శిష్యులూ దానిని పూరించడం ఏమాత్రమైనా హేతుబద్ధంగా ఉందా?
      3. "ఒనరన్ నన్నయ తిక్కనాది కవులీ యుర్విన్..."అనే పద్యంలో పునర్జన్మ లేకుండా ఈ జన్మను సఫలం చేసుకోడానికే తను భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నానని పోతన చెప్పుకున్నారు, నిజమే. అయితే, మొత్తం భాగవతం తన చేతిమీదుగా తెలిగిస్తేనే జన్మ సఫలమవుతుందని ఆయన భావించి ఉంటారని ఎలా అనుకుంటాం? వయసు, ఆరోగ్యం, సమయాభావం లాంటి వివిధ కారణాల వల్ల కూడా తన దృష్టిలో, లేదా తన అభిరుచిలో రసవత్తరాలు, ప్రధానాలు అనుకున్న ఘట్టాల అనువాదాన్ని తను చేపట్టి; మిగిలినవి మిగతా ముగ్గురికీ విడిచిపెట్టి ఉండవచ్చు. ఆవిధంగా వారిది కేవలం పూరణ కాక, స్వతంత్ర అనువాదమే కావచ్చు. మరి ఆ విషయం ఆయన ప్రారంభంలోనే ఎందుకు చెప్పలేదన్న ప్రశ్నకు వస్తే, స్కంధాంతగద్యలో వాళ్ళే ఆ విషయం చెప్పుకుంటారు కనుక తను చెప్పి ఉండకపోవచ్చు. ఈరోజుల్లో ఉన్నట్టు అలాంటి ఆనవాయితీలను పాటించే డిసిప్లిన్ ఆరోజుల్లో ఉండకపోవచ్చు.

      Delete
  8. అవునండీ, వారి చరిత్రకు సంబంధించిన విషయాలలో వారు ఆ తాళపత్రాల గ్రంథాలను పూజామందిరంలోనే ఉంచారనీ చాలాకాలం దానిని బయటకు తీయకపోవడం వల్ల అలా జరిగిందనీ చెప్తారు. పోతన గారి తమ భాగవతానికి వారు ప్రాచుర్యం చేయలేదు కోరుకోలేదు. అది ఆయన కృతిలోనే చెప్పుకున్నారు. పైగా పోతనగారి జీవించినవి భవంతులు కావు, కాబట్టి ఆకాలంలో పైన చెప్పిన వివరాలు చాలా సహేతుకమైనదీ సహజమైనదీను దాని యందు మన అనుమానాలు చొప్పించ ప్రయత్నం వ్యర్థం.

    for eg: మా పెద్దనాన్నగారు వ్రాసుకున్నవాటిని (దాదాపుగా 50యేళ్ళపైగా) ఆయన సరిగ్గా దాచుకోలేదు ఆయన ఎవరికీ ఇవ్వనూలేదు ఎప్పుడేనా ఒకసారి డిస్కస్ చేసేవారు. వారు గతించిన తరవాతగానీ వాటిని పుస్తక రూపేణా మేము ప్రకటించలేకపోయాం పైగా ఇంకుపెన్నుతో గొలుసుకట్టువ్రాతతో అప్పట్లో వారు వ్రాసుకున్నవాటిలో లుప్తమైన అక్షరాలు కొన్నిటిని ముందు వెనుక వాక్యాలు చూసి మేమే పూరించుకున్నాం.. అర్థం పూర్తిగా వారు వ్రాసుకున్నారు లుప్తమైనవి పూరించాం... ఇవన్నీ అతి సహజమైనవి... అలా చేసుండాల్సింది ఎందుకు అలా చేసుండుండకపోవచ్చు వంటివి పోతన గారి జీవితంలో ఆయన జీవన విధానం రీత్యా మనం ఆపాదించడం కుదరదు. అదే శ్రీనాథుడో నన్నయగారో ఐతే వారికున్న సదుపాయాలు వారి జీవన విధానం వేరు అక్కడ ఈ ప్రశ్నలు నిలబడవచ్చు...

    పోతనగారు భాగవతం ఆంధ్రీకరించే సమయానికి ఆయనేమీ కడు ముదుసలీ కారు, యజ్ఞ వరాహ మూర్తి ఘట్టం గురించి కానీ, గజేంద్రమోక్ష ఘట్టం గురించిన విషయాల రచనా సమయంలోకానీ వారికుటుంబ నేపథ్యానికి సంబంధించిన విషయాలు ఆయన చరిత్రలో సుస్పష్టం. పైగా భాగవతానంతరం వారు వీరభద్రవిజయమూ రచించారు. కాబట్టి ఆయన వయో పరిమితులనూ, అకుంఠిత దీక్షనూ అనుమానింప అనవసరం. అంత పండితుడూ తానొక్కడే భాగవతం తెనిగిస్తానని చెప్పుకొని ఇంకొరికి అప్పగించి వారిని తలచుకోకుండా ఉంటాడన్నది పోతన గారి నైజానికి కుదిరేది కాదు అది అసహజం. ఇక పోతన గారి రచనాశైలీ, వారి వ్యక్తిత్వమూ, క్రమశిక్షణా పూర్వ కవుల స్తుతీ, గ్రంథ రచనలో సంప్రదాయాలను పాటించడంలో క్రమశిక్షణ ఎంచే వీలులేని కృతి వారిది.

    ఇక నేను ఇంతకు ముందు పైన పంపినవి ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రకటించిన "పరిశోధక వ్యాసాల"నుండి... పోతన గారి పద్యాలను రాజాస్థానంలో పండితులకు శ్రీనాథాదులకు వినిపించినది ఆయన శిష్యులైన నారయ సింగనలే.. అందుకే పోతన గారి తరువాత లుప్తమైన వాటిని పూరించి జనబాహుళ్యంలోకి ఆ గ్రంథాన్ని తెచ్చింది వారే అని పోతన చరిత్ర. ఇక .....ఉండచ్చు ఉండకపోవచ్చు వంటివి కేవలం మన అనుమానాలు.

    సరే మొత్తానికి... పోతనగారి భాగవతంలో కొన్ని ఘట్టాలు లుప్తమైతే వారి తరవాత వారి శిష్యులు తమ గురువుగారి వద్ద విన్నవీ, చదివినవీ జ్ఞప్తిలో ఉంచుకొని శక్తిమేర పోతనగారి బాణిలో పూరించి ప్రాచుర్యంలోకి తెచ్చారన్నది శిష్టజనామోదమూ, బహుళామోదమూ తోపాటు ప్రచారంలోనున్న చరిత్ర. అవును మీరన్నట్లు లుప్తమైన కొన్ని శ్లోకాలు పోతనగారివి యథాతథంగా కాక తరువాతివారు ఆయన బాణిలో కొన్ని చోట్ల స్వంత అనువాదం తిరిగి చేసారు ఇదీ చరిత్రలో ఉన్నదే. (refering to many writings on potana garu and andhra bhagavatam, including english commentaries and I share small part in telugubhagavatam research too ) దీనర్థం మొట్టమొదట సంపూర్ణంగా పొతనగారే అనువదించారు అన్నది సుస్పష్టం. కాబట్టి పోతనగారు ఒక్కరే భాగవతాన్ని తెనిగించారనడంలో ఏ సందేహమూ అనుమానమూ లేదు అది నిక్కం. ఐతే మనకు లభ్యమయ్యే ప్రతిలో మిగిలినవారు కూర్చిన / చేర్చిన పద్యాలూ ఉన్నాయి అన్నదీ నిజం. btw, after going thru many such writings and part of debates, this is totally new for me that potana garu did 'only 8' and rest did 4. స్వస్తి _/|\_

    ReplyDelete