Tuesday, June 4, 2013

రాజకీయ పార్టీల 'చావు'

'తన చావు జగత్ ప్రళయ' మని సామెత!

ఇప్పుడు రాజకీయపక్షాలు అలాంటి జగత్ ప్రళయాన్ని ఎదుర్కొంటున్నాయి. ఒక పార్టీ కాదు, కుడి-ఎడమ తేడా లేకుండా అన్ని పార్టీలూ!

రాజకీయ పార్టీల జమా ఖర్చులూ వగైరాలు కూడా సమాచార హక్కు చట్టం కిందికి వస్తాయని కేంద్ర సమాచార కమిషన్ ఉత్తర్వు ఇచ్చింది. అందుకు కొన్ని కారణాలూ చెప్పింది. కమిషన్ అభిప్రాయంలో రాజకీయ పార్టీలు ప్రైవేట్ సంస్థలు కావు, వాటికి ప్రజాసంస్థల స్వభావం ఉంది. అవి ప్రజల మధ్య పనిచేస్తుంటాయి. కనుక వాటి గురించిన అన్ని విషయాలనూ తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. అలాగే, రాజకీయ పార్టీలు ప్రభుత్వం నుంచి, అంటే ప్రజాధనం నుంచి ప్రజల ఆస్తులనుంచి లబ్ధి పొందుతూ ఉంటాయి. ఉదాహరణకు కాంగ్రెస్, బీజేపీలు రెండే ప్రభుత్వం నుంచి 253 కోట్ల రూపాయిల సబ్సిడీ పొందుతున్నాయట. మిగిలిన పార్టీలు పొందే సబ్సిడీని కూడా దీనికి చేర్చుకుంటే అది ఏ  అయిదారువందలకోట్లో, ఇంకా ఎక్కువో ఉంటుంది. ఢిల్లీలో లుటియెన్ బంగాళాల అద్దె మార్కెట్ రేట్ల ప్రకారం లక్షల్లో ఉంటే రాజకీయ పార్టీలు వేలల్లో మాత్రమే అద్దె చెల్లిస్తున్నాయి. పార్టీ భవనాలు కట్టుకోడానికి ప్రభుత్వం ఉచితంగా స్థలం కూడా ఇస్తూ ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఇలా వనరులు, ఆస్తులు పొందే రాజకీయ పార్టీలు మరోవైపు లక్షలు, కోట్లలో విరాళాలు కూడా సేకరిస్తూ ఉంటాయి. అయితే ఆ విరాళాలు ఇచ్చిన సంస్థలు, వ్యక్తులు ఎవరో జనానికి తెలియదు. అది నల్లడబ్బో, తెల్ల డబ్బో తెలియదు. తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని సమాచార కమిషన్ అంటోంది.

అయితే విచిత్రంగా రాజకీయ పార్టీల వ్యవహారాలను బయటపెట్టవలసిన అవసరం లేదని పార్టీలు అంటున్నాయి. కాంగ్రెస్ అదే అంటోంది. బీజేపీ అదే అంటోంది. సీపీయం, సీపీఐలు అదే అంటున్నాయి. బహుశా ఎంఎల్ పార్టీలూ అదే అనచ్చు. రాజకీయ పార్టీలు ప్రైవేట్ సంస్థలే తప్ప ప్రజాసంస్థలు కావంటున్నాయి. వాటిని ప్రజాసంస్థలుగా పరిగణించి సమాచార హక్కు చట్టం కిందికి తేవడం ప్రజాస్వామ్యానికే చేటు తెస్తుందని బెదిరిస్తున్నాయి. కావాలంటే ఎన్నికల కమిషన్ ను అడిగి పార్టీల సమాచారాన్ని తీసుకోవచ్చునంటున్నాయి.

మొత్తం మీద రాజకీయ పార్టీల మధ్య అపూర్వమైన సంఘీభావం వ్యక్తమవుతున్న అరుదైన సందర్భం ఇది.

ఇంతకీ రాజకీయ పార్టీలు సమాచార హక్కు కిందికి రావడానికి ఎందుకు భయపడుతున్నాయి? చర్చ పుంజుకున్న కొద్దీ పార్టీల అసలు రంగులు బయటపడతాయేమో చూద్దాం.

ఓ వ్యాఖ్య తరచూ వినిపిస్తూ ఉంటుంది. శివాజీ గొప్ప వీరుడే, గొప్ప దేశభక్తుడే కానీ శివాజీ లాంటివాడు, పక్క ఇంట్లో పుట్టాలని అనుకుంటారు తప్ప తమ ఇంట్లో పుట్టాలని అనుకోరట. అలాగే, సమాచార హక్కు చట్టం గొప్పదే; అది అధికారపక్షం లేదా ప్రతిపక్షం భరతం పట్టాలి కానీ మన భరతం  పట్టకూడదు. అధికారులు, ఉద్యోగుల అవకతవకలు బయటపెట్టడం వరకు అది గొప్ప చట్టమే. మన జోలికే రావడమంటూ జరిగితే అది ప్రజాస్వామ్య విరుద్ధం! సమాచార కమిషన్ ఉత్తర్వుపై రాజకీయ పార్టీల స్పందన అచ్చం ఇలాగే ఉంది.

రాజకీయ పార్టీలు ప్రైవేటా పబ్లిక్కా అని అడిగితే ఏం చెప్పగలం? చెరువులో చేపలు నీళ్ళు తాగుతున్నాయో లేదో చెప్పడం ఎవరి తరం?

No comments:

Post a Comment