Saturday, March 28, 2015

భారతరత్న ముఖానికి సెన్సార్!!!

'వాజ్ పేయి గారు ఎలా ఉన్నారు?' అని ప్రశ్నిస్తూ ఇదే బ్లాగ్ లో దాదాపు గత మూడేళ్లలో రెండుసార్లు రాశాను. మాజీ ప్రధానే కాక, ప్రతిపక్షనేతగా, గొప్ప పార్లమెంటేరియన్ గా, గొప్ప వక్తగా పేరొందిన ఆయన గురించి, ఆయన ఆరోగ్యం గురించి ఏళ్ల తరబడిగా ఏ కొంచెం సమాచారం ఏవైపునుంచీ లేకపోవడం పై ఆశ్చర్యం ప్రకటిస్తూ వాటిని రాశాను. ఆయనతోపాటు మాజీ రక్షణమంత్రి, ప్రముఖ సోషలిస్టు నాయకుడు, కార్మికనాయకుడు అయిన జార్జి ఫెర్నాండెజ్ గురించి కూడా ప్రస్తావించాను.

ఎట్టకేలకు వాజ్ పేయి గారు వార్తల్లోకి వచ్చారు. అది కూడా దేశ అత్యున్నత పురస్కారం అయిన భారత రత్నను ఆయనకు ప్రదానం చేసిన సందర్భంగా.

అయితే ఒక ఆశ్చర్యం......నిజానికి ఆశ్చర్యం చిన్న మాట...దిగ్భ్రాంతి...ఆ వార్తకు సంబంధించిన ఫోటోలో వాజ్ పేయి గారి ముఖం కనిపించలేదు. రాష్ట్రపతి గారు ఒక్కరే పూర్తిగా కనిపిస్తున్నారు. వాజ్ పేయి గారి ముఖానికి అడ్డుగా ఓ వ్యక్తి చేతిలో ఒక పెద్ద ట్రే లాంటిది పట్టుకుని కనిపించాడు. నాకు అతని మీద చాలా కోపం వచ్చింది. అతని మీద కన్నా ఎక్కువగా ఆ ఫోటోగ్రాఫర్ మీద కోపం వచ్చింది. అంత ముఖ్యమైన కార్యక్రమాన్ని సక్రమంగా చిత్రీకరించే చేతనైన ఫోటోగ్రాఫర్  కూడా ప్రభుత్వానికి దొరకలేదా అని ప్రభుత్వం మీద కోపం వచ్చింది. అలాంటి ఫోటో వేసినందుకు నేను చూసిన పత్రిక మీద కూడా కోపం వచ్చింది.

అంతలో ముందురోజు ఆ వార్తను కవర్ చేసిన టీవీ చానెళ్లు కూడా వాజ్ పేయిని చూపించని సంగతి గుర్తుకొచ్చింది. అయినా ఆశ చావక మరికొన్ని పత్రికలు, ఇంటర్నెట్ చూసాను. ఆ ఫోటోయే కనిపించింది.

కావాలనే వాజ్ పేయి గారిని పూర్తిగా చూపించి ఉండరన్న అనుమానం నాలో బలపడింది. ఒక తెలుగు చానెల్ లో ఉన్న మిత్రుడికి ఫోన్ చేశాను. ఆయన కూడా ఆ ఒక్క ఫోటోయే రిలీజ్ చేశారని చెప్పి, బహుశా వాజ్ పేయి గారు జనానికి చూపించే పరిస్థితిలో ఉండి ఉండరని అన్నాడు.

అదే నిజం కావచ్చు. అయితే ఆ కారణం చేతే మాజీ ప్రధానిని జనానికి చూపించకపోతే అది మరింత దారుణం. వృద్ధులను, అనారోగ్యవంతులను జనం చాలామందిని చూస్తూనే ఉంటారు. ప్రత్యేకించి వాజ్ పేయి గారిని వారు చూడకూడదని అనుకోవడంలో ఎలాంటి వివేకమూ లేదు. లేక కుటుంబసభ్యుల ఒత్తిడి మొదలైనవి ఏవైనా ఉన్నాయేమో తెలియదు. ఏమున్నా సరే మాజీప్రధానిని కనీసం ఇలాంటి సందర్భంలోనైనా జనం కంటబడకుండా నిషేధించే హక్కు ప్రభుత్వానికి లేదు. పైగా జనానికి ఆయనను చూపించవలసిన బాధ్యత ఉంది. చూపించకపోగా, చూపించకపోవడంపై కనీసం వివరణ, సంజాయిషీ కూడా లేవు.

అంతవరకు ఎందుకు? మాజీ ప్రధాని ఆరోగ్యపరిస్థితి అప్పుడప్పుడైనా జనానికి తెలియజేయాలన్న ఇంగితం కూడా ఈ ప్రభుత్వాలకు లేదు. ఇంతకు ముందున్న యూపీయేకూ లేదు, ఇప్పటి ఎన్డీయేకూ లేదు. అసలు బిజీపీకే లేకపోవడం ఇంకా ఆశ్చర్యం.

అన్నింటికన్నా ఆశ్చర్యం ఏమిటంటే,  దేశంలోని 120 కోట్ల మంది పట్ల ఇంత ఫ్రాడ్ జరిగినా మీడియాలో ఉలుకూ పలుకూ లేకపోవడం! మీడియా, ప్రభుత్వం కూడబలుక్కుని మరీ ఈ కుట్ర పూరిత మౌనానికి పాల్పడ్డాయా అనిపిస్తోంది.

1 comment:

  1. ఈ ఫొటో కూడా నిజమైనదిలా లేదు. వాజ్‌పేయి గారి పాత ఫొటొని అతికించినట్టుగా ఉంది.

    ReplyDelete