Thursday, February 21, 2013

జలియన్ వాలా బాగ్ లో ఏం జరిగింది?

బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కెమెరాన్ ఫిబ్రవరి 20న అమృతసర్ లోని జలియన్ వాలా బాగ్ స్మారక నిర్మాణాన్ని  సందర్శించి అమరవీరులకు నివాళి అర్పించారు. 1919 ఏప్రిల్ లో జరిగిన జలియన్ వాలా బాగ్ ఊచకోత బ్రిటిష్ చరిత్రలోనే అత్యంత సిగ్గుమాలిన ఘటనగా సందర్శకుల పుస్తకంలో రాశారు. ఆయన భారతదేశానికి క్షమాపణ చెబితే బాగుండేదని కొందరు అన్నారు. స్మారకస్థలిని సందర్శించి, అమరవీరులకు నివాళి అర్పించడం క్షమాపణ చెప్పడంతో సమానమేనని ఒక రిద్దరు అన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే, ఈ దారుణ ఘటన జరిగిన గత 94 ఏళ్లలో జలియన్ వాలా బాగ్ మృతులకు నివాళి అర్పించిన  తొలి బ్రిటిష్ ప్రధాని ఆయనే.

ఇంతకీ జలియన్ వాలా బాగ్ లో ఏం జరిగిందో, దాని పూర్వాపరాలు ఎలాంటివో క్లుప్తంగా చెప్పుకుందాం:

1919 ఏప్రిల్ 13, ఆదివారం... హిందువులు, సిక్కులూ కూడా పవిత్రంగా భావించే బైశాఖి దినం. గాంధీ నాయకత్వంలో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళన పంజాబ్ తదితర ప్రాంతాలలో హింసాత్మక రూపం ధరించగా, పంజాబ్ లో సైనిక శాసకునిగా జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ను నియమించారు. డయ్యర్ అమృతసర్ లో బహిరంగ సమావేశాలు నిషేధించాడు. ఆ సంగతి తెలియని 10 వేల మంది హిందువులు, సిక్కులు జలియన్ వాలా బాగ్ లో సమావేశమయ్యారు. అది మూడు వైపులా అయిదడుగుల ఎత్తు గోడలున్న మైదానం.

డయ్యర్ ఓ యాభైమంది సైనికులతో వచ్చి మైదానం ప్రవేశ ద్వారాన్ని కమ్మేశాడు. బయటకు వెళ్లడానికి అదొక్కటే మార్గం. చెదిరిపోమని కనీసం ఒక్క హెచ్చరిక కూడా చేయకుండా కాల్పులకు ఆదేశించాడు. గూర్ఖా, బలోచీ రెజిమెంట్లకు చెందిన భారతీయ సైనికులు పది నిమిషాలపాటు కాల్పులు జరిపారు. దాదాపు తూటాకు ఒకరు చొప్పున నేల కొరిగారు. 379 మంది మరణించినట్టు, వెయ్యి మంది గాయపడినట్టు అధికారికంగా ప్రకటించారు. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువ.

ఈ ఘటనకు పూర్వ రంగం:


1919 ఫిబ్రవరిలో నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో రౌలట్ బిల్లుల్ని ప్రవేశపెట్టింది. వాటి ప్రకారం, ఎవరైనా దేశద్రోహచర్యలకు పాల్పడినట్టు ఏ చిన్న ఆధారం దొరికినా, విచారణ లేకుండా అరెస్ట్ చేయచ్చు. అప్పీలుకు కూడా అవకాశం ఇవ్వకుండా రెండేళ్ళు జైల్లో పెట్టచ్చు, రౌలట్ అనే జడ్జీ నాయకత్వంలో రూపొందిన బిల్లులు కనుక వాటికి ఆయన పేరే పెట్టారు.

అప్పుడప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్న గాంధీ ఆ బిల్లులకు వ్యతిరేకంగా సత్యాగ్రహం ప్రారంభించడానికి నిర్ణయించారు. మొదట వల్లభ్ భాయ్ పటేల్ సాయం కోరారు. పటేల్ సరే ననడంతో  20 మందిని సమావేశపరచి సత్యాగ్రహానికి సంసిద్ధం చేశారు. వారిలో కవయిత్రి సరోజినీ నాయుడు కూడా ఉన్నారు. 1857 తర్వాత మొదటిసారిగా వీరందరూ బ్రిటిష్ చట్టాలను ధిక్కరిస్తున్నట్టు బహిరంగంగా ప్రకటించారు. ఈ ఘటన బ్రిటిష్ సామ్రాజ్యచరిత్రను గొప్ప మలుపు తిప్పుతుందని గాంధీ ఊహించారు.

అయితే, చట్ట ధిక్కారానికి కాంగ్రెస్ సిద్ధం కాలేదు. దాంతో సత్యాగ్రహ సభ పేరుతో గాంధీ కొత్త సంస్థను ఏర్పాటుచేశారు. ఢిల్లీ వెళ్ళి వైస్రాయిని కలసి రౌలట్ బిల్లులపై వ్యతిరేకత తెలిపారు. అదే సమయంలో మహమ్మదాలీ జిన్నా, శ్రీనివాస శాస్త్రి ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో బిల్లులకు వ్యతిరేకంగా ప్రసంగించారు. గాంధీ అక్కడినుంచి మద్రాసు వెళ్లారు. అక్కడ రాజగోపాలాచారికి అతిథిగా ఉన్నారు. అప్పుడే రౌలట్ బిల్లులలో ఒకదానిని చట్టం చేసినట్టు గాంధీకి తెలిసింది. మరునాడు, మార్చ్ 23న తెల్లవారుజామున 'నిద్రకూ, మెలకువకూ మధ్య' గాంధీకి ఒక ఊహ కలిగింది. మరుసటి ఆదివారం సమ్మెచేయమని యావద్భారతానికీ పిలుపు ఇవ్వాలనుకున్నారు. రాజగోపాలాచారి అందుకు ఆమోదం తెలిపారు. మార్చ్ 30న సమ్మెకు పిలుపు ఇచ్చిన గాంధీ తర్వాత దానిని ఏప్రిల్ 6కు మార్చారు. అయినాసరే ఢిల్లీ మద్దతుదారులు మార్చ్ 30నే సమ్మెకు సిద్ధమయ్యారు.

సమ్మె పిలుపుకు భారతదేశం అత్యద్భుతంగా స్పందించింది. మిగిలిన చోట్ల కంటే పంజాబ్ ఎక్కువగా అట్టుడికింది. గాంధీ మద్రాసు నుంచి బొంబాయి చేరుకున్నారు. పంజాబ్ వచ్చి అక్కడి ఉద్రిక్తతను చల్లార్చవలసిందిగా పంజాబ్ నాయకులు గాంధీపై ఒత్తిడి తెచ్చారు. గాంధీ ఏప్రిల్ 8న మహదేవ్ దేశాయిని వెంటబెట్టుకుని పంజాబ్ కు రైలులో బయలుదేరారు. బ్రిటిష్ అధికారులు ఆయన పంజాబ్ ప్రవేశాన్ని నిషేధించి బలవంతంగా తిరిగి బొంబాయి పంపేశారు. ఆ సందర్భంలో గాంధీ కొంత దూరం గూడ్సు బండిలో ప్రయాణం చేశారు.

పంజాబ్ లో హింస చెలరేగింది. అయిదారుగురు యూరోపియన్లను హతమార్చారు. మిస్ షేర్వుడ్ అనే ఆంగ్ల యువతిపై అత్యాచారం జరిగింది. జనరల్ సర్ రెజినాల్డ్ డయ్యర్ ను పంజాబ్ లో సైనిక శాసకునిగా నియమించారు.

ఆ తర్వాత...

జలియన్ వాలా బాగ్ ఊచకోతపై దర్యాప్తుకు బ్రిటిష్ ప్రభుత్వం హంటర్ కమిషన్ ను నియమించింది. దానికి నిర్దేశించిన విచారణాంశాలపై అసంతృప్తి ప్రకటించిన కాంగ్రెస్ సొంతంగా దర్యాప్తు జరపడానికి నిశ్చయించి గాంధీ, మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్, ఎం.ఆర్. జయకర్, అబ్బాస్ త్యాబ్జీలతో కమిటీని వేసింది. కమిటీ పని భారాన్ని చాలావరకు గాంధీయే మోశారు. మూడు మాసాలపాటు పంజాబ్ లో తిరిగి ప్రత్యక్ష సాక్షులను విచారించి నివేదికను తనే తయారు చేశారు. జలియన్ వాలా స్మారక నిర్మాణానికి విరాళాలు సేకరించారు. మొదట్లో అందుకు తగిన స్పందన లేకపోవడంతో అవసరమైతే తన అహ్మదాబాద్ ఆశ్రమాన్ని అమ్మేసి అయినా నిధులు సమకూర్చుతానని గాంధీ ప్రకటించారు. అప్పుడు జనం ముందుకు వచ్చారు. 

1920 మే నెలలో హంటర్ కమిషన్ నివేదిక వెలువడింది, గాంధీ నివేదికలోని అంశాలనే అది ధ్రువీకరించింది. అయితే పంజాబ్ గవర్నర్ మైకేల్ ఒడ్వయర్ ను నిర్దోషిగా పేర్కొని విడిచిపెట్టింది. డయ్యర్ ను సైనిక నాయకత్వం నుంచి తప్పించింది. 

కొసమెరుపు

బ్రిటన్ ఎగువసభ(హౌస్ ఆఫ్ లార్డ్స్) డయ్యర్ ఊచకోతకు మెజారిటీ వోటుతో ఆమోదం తెలిపింది. బ్రిటిష్ అభిమానులు అతనికి ఒక కరవాలాన్నీ, 20 వేల పౌండ్లనూ బహూకరించి సత్కరించారు! 


No comments:

Post a Comment