Thursday, February 7, 2013

అయోధ్య... అభివృద్ధి... అస్పష్టత

బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ అలహాబాద్ కుంభమేళాలో మాట్లాడుతూ అయోధ్య రామమందిర నిర్మాణంపై చేసిన వ్యాఖ్యలు అనేక ప్రశ్నలను ముందుకు తెస్తున్నాయి.

అయోధ్య రామమందిర నిర్మాణం 'భారతీయుల ఆత్మగౌరవ అంశమే కానీ, ఎన్నికల అంశం కా'దని ఆయన అన్నారు. 'ఈ అజెండాలకు బీజేపీ దీర్ఘకాలంగా కట్టుబడి ఉందనీ, రామజన్మభూమిలో ఆలయం నిర్మించాలన్నది మా ప్రగాఢమైన కోరిక అనీ' అన్నారు(ది హిందూ, 7 ఫిబ్రవరి).

ఇదే రోజున నరేంద్ర మోడీ ఢిల్లీలో యువతను ఉద్దేశించి మాట్లాడుతూ 'అభివృద్ధి'ని ఉద్బోధించారు.

రాజ్ నాథ్ అయోధ్య మాటలూ, మోడీ అభివృద్ధి మాటలూ ఏం చెబుతున్నాయి? గత ఇరవై ఏళ్లలో(1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత ఘటననుంచీ చెప్పుకుంటే) బీజేపీ అయోధ్య నుంచి అభివృద్ధికి ప్రయాణించిందని చెబుతున్నాయా? రాజ్ నాథ్ అయోధ్య తరాన్ని ఉద్దేశిస్తే, మోడీ అభివృద్ధి తరాన్ని ఉద్దేశించారని చెబుతున్నాయా? బీజేపీ తరాల మధ్య అంతరాన్ని గుర్తించిందని  చెబుతున్నాయా? లేదా బీజేపీ ఇప్పటికీ అయోధ్యా-అభివృద్దిల మధ్య ఊగిసలాడుతోందనీ, రేపటి ఎన్నికలలో ఏదో ఒకటి క్లిక్ అవుతుందనే ఉద్దేశంతో అయోధ్యను కూడా 'లైవ్' లో ఉంచుకుంటోందని చెబుతున్నాయా?

వివరణ లేదు.

అయోధ్య ఎన్నికల అంశం కాదని రాజ్ నాథ్ ఇప్పుడు ఎందుకు అంటున్నారు? లోక్ సభలో ఇద్దరే ఇద్దరు సభ్యులున్న బీజేపీ బలాన్ని అద్వానీ అయోధ్య రథయాత్ర  తొంభై దాకా పెంచిన నేపథ్యంలో ఇప్పుడు అయోధ్య ఎన్నికల అంశం ఎందుకు కాకుండా పోయింది? ఇప్పుడు అయోధ్య పేరు చెబితే వోట్లు రావా? ఎందువల్ల రావు?

వివరణ లేదు.

ఒకసారి తొంభై దశకం లోకి వెడదాం. అయోధ్య రాముడి మీద భక్తితో ఎంతోమంది అమాయక భక్తులు అయోధ్య ఉద్యమంలో పాల్గొన్నారు. జెండాలు మోశారు. కంఠనాళాలు ఉబ్బిపోయేలా నినాదాలు చేశారు. అయోధ్య వరకూ వెళ్ళి కరసేవలో పాల్గొన్నారు. నిజంగానే రామజన్మభూమిలో ఆలయం అవతరిస్తుందని నమ్మారు. 'మీకు అయోధ్య కావాలి. బీజేపీకి అయోధ్య మీదుగా అధికారం కావాలి. అధికారం దక్కితే అయోధ్యను వదిలేస్తుం'దని ఎవరెంత చెప్పినా వారి విశ్వాసం సడలలేదు. ఇంత జరిగిన తరువాత బీజేపీ ఎన్నికల అంశాల జాబితా నుంచి అయోధ్యను కొట్టి పారేస్తే వీరి విశ్వాసానికి, వీరి మనోభావాలకు తగిలే గాయానికి ఎవరు జవాబుదారీ?

బాబ్రీ మసీదు కూల్చివేసిన తర్వాత దానికి ప్రతిక్రియగా జరిగిన ముంబై బాంబు పేలుళ్లలో వందలాదిమంది చనిపోయారు. వందలాది కుటుంబాలు గర్భశోకాన్నిఎదుర్కొన్నాయి. ఆత్మీయులను పోగొట్టుకున్నాయి. అనాథలయ్యాయి. ఈ రోజున కదిపినా ఒక్కొక్క కుటుంబమూ ఒక్కొక్క విషాద, కన్నీటిగాథ చెబుతాయి.  ఈ కుటుంబాలకు ఎవరు జవాబుదారీ?

2002 లో అయోధ్య కరసేవలో పాల్గొని శబర్మతీ ఎక్స్ ప్రెస్ లో గుజరాత్ వస్తున్న భక్తులలో 58 మంది సజీవదహనమయ్యారు. వారిలో 15 మంది పిల్లలు, 25 మంది మహిళలు ఉన్నారు. దానికి ప్రతిక్రియగా గుజరాత్ లో జరిగిన ఊచకోతలో 1200 మంది మరణించారు. గోధ్రా సజీవదహనాన్ని, అనంతర మారణకాండను మరచిపోయి ముందుకు వెళదామంటున్నారు. కడుపులో చల్ల కదలకుండా ఉన్నవాళ్లం మరచిపోతాం సరే. ఆత్మీయులను, అయినవారిని కోల్పోయిన వారు;  జీవన ఆధారాన్ని కోల్పోయి అన్నివిధాలా చితికిపోయినవారు... మరచిపోతారా? మరచిపోవడం సాధ్యమేనా? వారి ఆరని కంటతడికి, వారి గుండెల్లో ఇప్పటికీ సుడులు తిరిగే నిశ్శబ్ద దుఃఖానికి ఎవరు జవాబుదారీ?

బాబ్రీ మసీదు కూల్చివేత అనంతర  ప్రకంపనలను ఏదో ఒక స్థాయిలో దేశవ్యాప్తంగా చాలామంది ఎదుర్కొన్నారు. మతకల్లోలాల భయానక ముఖాన్ని దగ్గరగా చూశారు. తమ నీడకు తమే ఉలికిపడుతూ రోజుల తరబడి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడిపారు. హైదరాబాద్ లో నాటి కర్ఫ్యూ వాతావరణం ఇప్పటికీ కళ్ళముందు కదలుతూనే ఉంది. ఓరోజు రాత్రి ఎనిమిది గంటల వేళ మా ఇంటికి దగ్గరలో రోడ్డు మీద ఎవరినో కత్తితో పొడిచారన్న వదంతి వ్యాపించింది. దాంతోపాటే కొంతమంది కత్తులతో దాడికి దిగబోతున్నట్టు  వదంతి గుప్పుమంది. ఒక్కసారిగా జనం ఇళ్ళలోంచి వీధిలోకి వచ్చారు. అందరి ముఖాల్లోనూ భయాందోళనలు. కొంతమంది యువకులు కత్తులు, కట్టెలు సిద్ధంగా ఉంచుకోవడం ప్రారంభించారు.

మగవారు, యువకులు సరే, వృద్ధులు, ఆడవాళ్ళు, పిల్లల సంగతేమిటి? వారిని సురక్షిత ప్రాంతానికి అప్పటికప్పుడు పంపిద్దామనుకున్నా ఎలా పంపుతాం? ఆటోలు లేవు. ఎవరికీ వాహనాలు బయటికి తీసే ధైర్యం లేదు. హైదరాబాద్ లో రోడ్లు కూడా భయంతో బిక్కచచ్చి పోయి మూగవోయాయి.

నాటి ఆ భయోద్విగ్న వాతావరణం మన ఆలోచనలపై కలిగించే ప్రభావాన్ని తలచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రాణభీతి వెంటాడే ఆ రోజుల్లోనే బాబ్రీ కూల్చివేతను తీవ్రంగా దుయ్యబడుతూ ప్రముఖ పాత్రికేయుడు ప్రేమ్ శంకర్ ఝా 'హిందూ'లో రాసిన ఒక వ్యాసం చదివి నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. ఇలా రాయడం సాధ్యమేనా అనుకున్నాను. మతకల్లోలాల వంటి ఒక అసహజ వాతావరణంలో మామూలు రోజుల్లో మనం అనుభవించే భావప్రకటన స్వేచ్ఛ, ఇతర స్వాతంత్ర్యాలు  కూడా ఎంత అపురూపంగా, ఆశ్చర్యకరంగా తోస్తాయో అనుభవపూర్వకంగా అర్థమైంది.

ఇటువంటి అయోధ్య తరం అనుభవాలు, నేటి అభివృద్ధి తరం వారికి అంతగా తెలియకపోవచ్చు. కానీ అయోధ్య కాండ సృష్టికర్తలకు తెలుసు. అయోధ్యతరం వారు ఇంకా జీవించి ఉన్నారు. కనుక, అయోధ్యను ఎన్నికల అంశాల జాబితానుంచి ఏకపక్షంగా ఉపసంహరించుకునే ముందు ఎందుకు అలా చేస్తున్నారో బీజేపీ  వివరణ ఇస్తే .
బాగుంటుంది.

బీజేపీ చెప్పే అవినీతిరహిత సుపరిపాలన నిఘంటువులొ 'జవాబుదారీ' అనే మాట కూడా  ఉంటే, అయోధ్య కాండకు  జవాబుదారీని ఎలా స్వీకరించదలచుకుందో స్పష్టం చేస్తే కూడా బాగుంటుంది. .


No comments:

Post a Comment