Wednesday, February 6, 2013

బ్రహ్మానందం-హేమ జంటలా ప్రభుత్వం-ప్రజలు

నిన్నటివరకూ కేంద్రప్రభుత్వం ఏమీ చేయకపోవడం జనానికి నచ్చలేదు. ఇప్పుడు ఏం చేసినా నచ్చడం లేదు.

ఈ ప్రభుత్వంతో ప్రజల కాపురం రాను రాను  'అతడు' సినిమాలో బ్రహ్మానందం-హేమల కాపురంలా తయారవుతోంది. అందులో హేమ ఏం మాట్లాడినా బ్రహ్మానందం పెడర్థాలు తీస్తాడు. అఫ్ కోర్స్, ఆ డైలాగులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వు తెప్పిస్తాయనుకోండి. కానీ, ప్రభుత్వం-ప్రజల మధ్య సాగుతున్న డైలాగులు నవ్వు తెప్పించడం లేదు. ఒకింత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఎందుకిలా జరుగుతోందన్న ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి.

ప్రభుత్వం ఏమీ చేయకపోవడం, లేదా ఏదైనా చేయడం నచ్చకపోవడమే కాదు; జనాలకు అసలు ఈ ప్రభుత్వమే నచ్చడం లేదు. అందులోనూ ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ ఈ ప్రభుత్వాన్నీ చూస్తే ప్రతివాళ్ళకీ మొత్తబుద్ధి అవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శల జోరు పెంచడం సహజమే. కానీ వాటికంటే ఎక్కువగా రాజకీయేతర వ్యక్తులు, సంఘాలు  ప్రభుత్వంపై స్వారీ చేస్తుండడమే అసహజంగా కనిపిస్తోంది. నచ్చని ప్రభుత్వాన్ని అవతలకు గెంటి పారేయచ్చు. జనం చేతిలో వోటు అనే ఆయుధం ఎలాగూ ఉండనే ఉంది. ఎన్నికలు కూడా ఇంకో ఏడాది దూరంలోనే ఉన్నాయి. తొమ్మిదేళ్లు ఓపిక పట్టినవారు ఇంకో ఏడాది ఓపిక పట్టడం ఏమంత కష్టం కాదు. కానీ ఎందుకో జనంలో అసహనం పెరిగిపోతోంది. విమర్శలు తప్పనడం లేదు. వాటిలో ఔచిత్యం పాలు తగ్గుతూ ఉండడమే విచిత్రం.

ఒక ప్రభుత్వాన్ని తిరస్కరిస్తే దాని స్థానంలో వచ్చేది ఇంకో ప్రభుత్వమే. ఆ ప్రభుత్వం కూడా అందరికీ  అన్నివిధాలా నచ్చినట్టు ఉండదు. ఏ ప్రభుత్వమైనా ఒక ప్రభుత్వంలానే వ్యవహరిస్తుంది. ప్రభుత్వాలు మౌలికంగా ఒక్కలానే ఉంటాయి. అన్ని ప్రభుత్వాలూ ప్రభుత్వం చేయవలసిన కొన్ని పనులు చేస్తాయి. ప్రభుత్వాలు చేసే సగటు స్పీడులోనే ఆ పనులు చేస్తాయి. ప్రభుత్వాలు పాటించే రీతి, రివాజులను, రాజ్యాంగ విధులనే పాటిస్తాయి. కనీసం పాటిస్తున్నట్టైనా కనిపించక తప్పదు.  ప్రతిపక్షంలో ఉన్నంతసేపూ కొండ మీది కోతిని కిందికి దింపుతామని నమ్మిస్తాయి. ప్రభుత్వం అనే కొండ మీద కూర్చోగానే అవే కోతిగా మారి పృష్ఠభాగం చూపిస్తాయి.

అదీగాక, ఏం చేయడానికైనా ప్రభుత్వానికి కొంత జాగా ఇవ్వాలి. కొంత స్వేచ్చా ఇవ్వాలి. సొంత బుద్ధితో ఆలోచించే అవకాశమూ ఇవ్వాలి. మేము చెప్పినట్టు చేస్తావా, చస్తావా అంటూ బెత్తం పుచ్చుకోవడం ఎంతవరకూ న్యాయం? అది మరో రకం నియంతృత్వం అవదా?

లోక్ పాల్ బిల్లు విషయమే తీసుకోండి. లోక్ పాల్ ప్రతిపాదన నలభై ఏళ్ళకు పైగా ప్రచారంలో ఉంది. ఇన్నేళ్లలో ఏడెనిమిది సార్లు అది పార్లమెంట్ గుమ్మం తొక్కి మళ్ళీ బయటకు రాకుండా నిశ్శబ్దంగా సమాధైపోయింది. ఇలాంటి లోక్  పాల్  విఫల చరిత్ర తెలిసినవారు ఎవరూ  అది ఇప్పట్లో సాకారం అవుతుందనీ ఇటీవలి వరకూ అనుకుని ఉండరు. అది ఏ రూపంలో సాకారం అయినా అదొక అద్భుతమే ననుకుని ఉంటారు.  అన్నా హజారే, ఇతర పౌరసమాజ బృందాల పుణ్యమా అని ఇంతకాలానికి అది నిజమయ్యే రోజు వస్తోంది. ఆ క్రెడిట్ వారికి ఇవ్వవలసిందే.

కానీ లోక్ పాల్ కోసం ఉద్యమించిన వర్గాలలో మాత్రం ఆ సంతోషం, సంతృప్తి కాగడా వేసి వెతికినా కనిపించడం లేదు.  లోక్ పాల్ బిల్లుపై స్థాయీ సంఘం సూచించిన 16 సవరణాలలో 14 సవరణలను కేంద్రమంత్రివర్గం ఆమోదించింది. ఆమోదించిన వాటిలో కొన్ని కీలకమైనవీ ఉన్నాయి. ఆమోదించని రెండు సవరణలలో ఒకటి లోక్ పాల్ ఆదేశాలపై పని చేసే సీబీఐ దర్యాప్తు అధికారిని బదిలీ చేసే అధికారం సీబీఐ డైరెక్టర్ కు ఉండాలా, లోక్ పాల్ కు ఉండాలా అన్న ప్రశ్నకు సంబంధించినది. మంత్రివర్గం సీబీఐ డైరెక్టర్ కే ఉండడం వైపు మొగ్గు చూపింది. రెండో సవరణ, ఆరోపణలు వచ్చిన అధికారిపై దర్యాప్తుకు ఆదేశించే ముందు అతని వాదాన్ని వినాలా వద్దా అన్న ప్రశ్నకు సంబంధించినది. వినాలన్న అభిప్రాయం వైపు మంత్రివర్గం మొగ్గు చూపింది. మంత్రివర్గం ఆమోదించిన బిల్లు రూపం మళ్ళీ పార్లమెంట్ ముందుకు వస్తుంది. అప్పుడు మరోసారి చర్చించుకోవచ్చు. ఆ చర్చ దరిమిలా ప్రభుత్వం తన వైఖరిని పునస్సమీక్షించుకోవచ్చు. లేదా ప్రతిపక్షాలు ప్రభుత్వ వాదనతో ఏకీభవించవచ్చు. ఇవేవీ జరగకుండా బిల్లు ఇప్పటి రూపంలోనే చట్టమై అమలులోకి వచ్చినా అనుభవంలో లోపాలు బయటపడితే అప్పుడే సవరించుకోవచ్చు. ఈ ప్రభుత్వం ఆ పని చేయకపోతే ఇంకో ప్రభుత్వం చేయచ్చు. ఇదొక నిరంతర ప్రక్రియ. లోక్ పాల్ ఇంతకాలానికి సాకారం కానుండడమే ఇక్కడ అసలు విషయం. ఆ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవద్దా? కనీసం దానికోసం అలుపెరుగని పోరాటం చేసినవారు కూడా? వాళ్ళలో ఆ సంతోషం ఎందుకు కనిపించడం లేదు?!

లైంగిక అత్యాచారాల నిరోధనకు ఉద్దేశించిన ఆర్డినెన్స్ కూ ఇదే వర్తిస్తుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనుండగా ఇంత ఆదరాబాదరగా ఆర్డినెన్స్ ను ఎందుకు తీసుకొచ్చారని ప్రతిపక్షాలు అడగడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ విచిత్రంగా మహిళా హక్కుల సంఘాలు కూడా అడుగుతున్నాయి. ప్రభుత్వం మీద కారాలు మిరియాలు నూరుతున్నాయి. ఆర్డినెన్స్ పై సంతకం పెట్టవద్దని రాష్ట్రపతిని కోరే దాకా వెళ్ళాయి, ఇలాంటివి శ్రుతి మించిన స్పందనల గానే కనిపిస్తాయి. మానభంగాల నిరోధానికి ఏమీ చేయడం లేదని ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంది. ఆ విమర్శల తీవ్రతను తగ్గించడానికి అది ఆర్డినెన్స్ మార్గాన్ని వెతుక్కొంది, అదేమీ చట్ట విరుద్ధం కాదు. ప్రభుత్వం తీసుకునే చర్యల్లో పొలిటికల్ మేనేజ్ మెంట్ కోణం కొంత ఉంటుంది. ఈ ప్రభుత్వానికే కాదు, ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. దానిని ఒక వివాదాంశం చేయాలా? పైగా జస్టిస్ వర్మ కమిటీ సిఫార్సులను అన్నిటినీ ఎందుకు ఆమోదించలేదని హక్కుల సంఘాలు నిలదీస్తున్నాయి. ఆమోదించాలని ఏముంది?  సొంత విచక్షణను, ఆచరణ కోణాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించే అధికారం ప్రభుత్వానికి ఉండదా? ఉండదన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు? అదీగాక, ఆర్డినెన్స్ చట్టరూపం ధరించే క్రమంలో దానిపై పార్లమెంట్ లో ఎలాగూ చర్చ జరుగుతుంది. అప్పుడు ఈ అంశాలు ప్రస్తావనకు రానే వస్తాయి.

ఇదంతా చదివి నేను ఈ ప్రభుత్వాన్ని వెనకేసుకుని వస్తున్నానని తొందరపడి నిర్ణయానికి రారనే భావిస్తాను. నేను ఇందులో ఉద్దేశించినది ఫలానా ప్రభుత్వాన్ని కాదు. ప్రభుత్వం అనే వ్యవస్థను.




2 comments:

  1. ప్రభుత్వము తన పని తానూ చేసుకుని పోతుంది ..చట్టమూ తన పని తానూ చేసుకొని పోతుంది. ఎటూ ..జనం కూడా తమ పని తాము చేసుకుపోతూ రాజకీయమనే వ్యవస్థను కామెడి సినిమా చూస్తున్నట్లు చూస్తారు అంతే !

    ReplyDelete