Saturday, February 23, 2013

హోం మంత్రిత్వం నుంచి చిదంబరంను ఎందుకు తప్పించారు?

హైదరాబాద్, దిల్ సుఖ్ నగర్ లో గురువారం నాడు రెండు బాంబు పేలుళ్లు జరిగి 16 మంది చనిపోవడం, 120 మంది గాయపడడం ఊహించని ఘాతుకం. సామాన్యజనానికి ఇప్పటికీ ఉగ్రవాదుల రూపంలో మృత్యువు అడుగడుగునా పొంచి ఉందనడానికి ఇది నిదర్శనం. మృతుల కుటుంబాలకు, గాయపడినవారికి సానుభూతి తెలియజేయడం కన్నా మనం చేయగలిగింది లేదు.

కేంద్రం రాష్ట్రానికి నిర్దిష్టంగా ఇంటెలిజెన్స్ సమాచారం ఎందుకు ఇవ్వలేకపోయింది;  కిందటి సంవత్సరం ఉగ్రవాదులు దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్టు సమాచారం ఉన్నా, రెక్కీ నిర్వహించిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు పలువురు తీహార్ జైలులో ఉన్నా బాంబు పేలుళ్లను ఎందుకు నివారించలేకపోయారన్న ప్రశ్నలపై చర్చ జరుగుతోంది. రాష్ట్ర పోలీసుల వైఫల్యం ఉందా అన్న చర్చ కూడా వినిపిస్తోంది. ఇలాంటి సందర్భాలలో వైఫల్యం ఎక్కడ ఉందో పోలీస్, ఇంటెలిజెన్స్ వర్గాలకే తప్ప మామూలు మనుషులకు తెలిసే అవకాశం లేదు. ఎన్నో ఉగ్రవాద ఘాతుకాలను ఇంటెలిజెన్స్, పోలీస్ వర్గాలు ముందుగానే నిరోధించగలిగాయనీ, వాటికి ప్రచారం, ప్రశంస ఉండవనీ, ఎంత అప్రమత్తంగా ఉన్నా ఒక్కోసారి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయనీ ఆ వర్గాలు అంటూ ఉంటాయి. కానీ అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల అనుభవంతో పోల్చితే ఇది పస లేని వాదంగానే తేలిపోతుంది. నిఘాలో, నిఘా యంత్రాంగంలో ఎక్కడో లోపం ఉండడం తప్ప ఈ వైఫల్యానికి మరో కారణం ఊహించలేం.

సరే, ఈ చర్చను నిపుణులకు వదిలేద్దాం. మామూలు మనుషులు కూడా వేయదగిన ప్రశ్నఒకటుంది.  హోం మంత్రిత్వం నుంచి చిదంబరం ను తప్పించి, సుశీల్ కుమార్ షిండేకు ఆ బాధ్యత ఎందుకు అప్పగించారు?

26/11 ముంబై బాంబు పేలుళ్లపై వెల్లువెత్తిన జనాగ్రహానికి స్పందించి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం శివరాజ్ పాటిల్ స్థానంలో చిదంబరంను హోం మంత్రిగా నియమించింది. శివరాజ్ పాటిల్ అసమర్థ హోం మంత్రి అన్న విమర్శలు అప్పటికి కొంతకాలంగా ఉన్నాయి. రోజుకు నాలుగైదు రకాల దుస్తులు మార్చడంలో ఉన్న శ్రద్ధ ఆయనకు పోలీసింగ్ పై లేదని అనేవారు. 26/11 ఘటన జరిగిన రాత్రి కూడా ఆయన దుస్తులపై మోజుకే ప్రాధాన్యం ఇచ్చారట. ఎట్టకేలకు ఆయనను తప్పించారు. మరుసటి సంవత్సరం ఎన్నికలు జరగబోతున్నాయి కనుక, శివరాజ్ పాటిల్ ను కొనసాగించి మరిన్ని విమర్శలు మూటగట్టుకోవడం పార్టీకి ప్రయోజనకరం కాదన్న దృష్టి కూడా ఈ మార్పును ప్రభావితం చేసి ఉండచ్చు. అదే సమస్య. ఎన్నికల దృష్టి  దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన నిర్ణయాలను సైతం ప్రభావితం చేయగలిగేలా ఉండడమే విషాదం.

చిదంబరం నిజంగానే వ్యవస్థలో కొన్ని కీలకమైన మార్పులు తీసుకు రావడానికి ప్రయత్నించారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్.ఐ.ఏ) ఏర్పాటు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్.ఎస్.జీ)ను దేశంలోని పలు రాష్ట్రాలకు విస్తరింపజేయడం, తీర రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడం, ఇంటెలిజెన్స్ వర్గాల మధ్య సమన్వయ, సహకారాలు పెరగడానికి చర్యలు తీసుకోవడం వగైరాలు వాటిలో కొన్ని. అయితే, ఎన్.ఐ.ఏ గొప్పగా ఫలితాలు సాధించలేదన్న విమర్శ కూడా ఉంది. అందుకు కారణాలను సంస్థాగతంగానే వెతకవలసి ఉంటుంది. నేషనల్ కౌంటర్ టెర్రరిస్ట్ సెంటర్(ఎన్.సీ.టీ.సీ)ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు మాత్రం రాష్ట్రాలనుంచి వ్యతిరేకత వచ్చింది. హైదరాబాద్ ఘటన దరిమిలా అది కూడా చర్చలోకి వస్తోంది. వెంటనే ఎన్.సీ.టీ.సీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చిదంబరం ప్రధానికి లేఖ రాసినట్టు సమాచారం.

వ్యవస్థలో సమూల పరివర్తన తేవడానికి సమయం పడుతుంది. హోం మంత్రిగా చిదంబరం ఆ పరివర్తన ప్రయత్నం పై పట్టు సాధించి దానిని మరింత ముందుకు తీసుకు వెళ్ళే పనిలో తలమునకలవుతూ ఉంటారనడంలో సందేహం లేదు. ఇంతలోనే ఆయనను హోం మంత్రిత్వం నుంచి ఎందుకు తప్పించినట్టు? మంత్రుల నియామకం, శాఖల కేటాయింపు ప్రధాని విశేషాధికారంలోకి వస్తాయి కనుక ప్రశ్నించడానికి వీలులేదన్న మాట నిజమే. అయినాసరే, హైదరాబాద్ ఘటన నేపథ్యంలో చిదంబరంను హోం మంత్రిత్వం నుంచి తప్పించడం లోని ఔచిత్యాన్ని సందేహించకుండా ఉండడం కష్టం.

ఒక కారణం స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్థికమంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతిని చేశారు కనుక, ఆయన తర్వాత  ప్రధాని దృష్టిలో చిదంబరమే ఆర్థికమంత్రిత్వ శాఖకు సహజమైన ఛాయిస్ కావడంలో మామూలు పరిస్థితులలో ఆశ్చర్యం లేదు. ఇదే సమయంలో టైమ్ మ్యాగజైన్ మన్మోహన్ సింగ్ ఆర్థికరంగంలో గొప్పగా ఏమీ సాధించలేదంటూ ముఖపత్ర కథనాన్ని ప్రచురించింది. చిదంబరానికి తిరిగి ఆర్థికమంత్రిత్వం అప్పగించడం ద్వారా ఆ అప్రతిష్ట నుంచి కొంతైనా బయటపడచ్చని మన్మోహన్ సింగ్ అనుకుని ఉండచ్చు. అంటే వ్యక్తిగత ఇమేజ్ కోసం హోం మంత్రిత్వశాఖను, దేశభద్రతా ప్రయోజనాలను పణంగా పెట్టారా అన్న అభిప్రాయం కలుగుతుంది. 26/11 తర్వాత ఉగ్రవాదుల దాడులు పూర్తిగా తగ్గకపోయినా వెనకటితో పోలిస్తే, తగ్గుముఖం పట్టాయనే చెప్పవచ్చు. చిదంబరంను హోం మంత్రిత్వ శాఖనుంచి తప్పించడానికి అది కూడా ఒక కారణం కావచ్చు. ఉగ్రవాదుల దాడులు తగ్గాయన్న ప్రభుత్వం భరోసా రాష్ట్రపతి పార్లమెంట్ ప్రసంగంలో కూడా వ్యక్తం కావడం గమనార్హం. ఆ ప్రసంగం రోజునే హైదరాబాద్ లో బాంబు పేలుళ్లు జరిగాయి.

చిదంబరంను తప్పించి షిండేను హోం మంత్రిని చేయడంలో మన్మోహన్ సింగ్ క్షేత్రవాస్తవికతను సరిగా అంచనా వేయలేకపోయారా? అదే నిజమైతే అంతకంటే దురదృష్టం ఉండదు.

పోలిక చూడండి...సరిగ్గా 2009 ఎన్నికలముందే, 26/11 దాడులను పురస్కరించుకుని అసమర్థ హోం మంత్రిగా ముద్రపడిన శివరాజ్ పాటిల్ ను తప్పించారు. ఇప్పుడు 2014 ఎన్నికలముందు, హైదరాబాద్ బాంబు పేలుళ్ళ నేపథ్యంలో హోం మంత్రిగా షిండే సమర్థతపై విమర్శలు పుంజుకుంటున్నాయి. కొన్ని సందర్భాలు పునరావృతమవుతాయంటారు. ఇది అలాంటి ఒక సందర్భం కావచ్చు. శివరాజ్ పాటిల్ విషయంలో తీసుకున్న చర్యనే షిండే విషయంలోనూ తీసుకుంటారా?! వేచి చూడవలసిందే.

ఇండియన్ ముజాహిదీన్ లాంటి టెర్రరిస్టు మాడ్యూళ్లను ఒక్కటి కూడా లేకుండా తుడిచిపెడతామని ఇప్పుడు శపథం చేస్తున్నారు.  ఇలాంటి శపథం చేయడం ఇది ఎన్నోసారి? ఉగ్రవాదుల దాడులు తగ్గుముఖం పట్టడంతో మాడ్యూళ్ళ వేట మందగించిందని అనుకోవాలా?! 

No comments:

Post a Comment