Friday, May 24, 2013

IPL ముందు 'ఇండియన్ పోలిటికల్ లీగ్' ఏపాటి?!

మీడియాలో IPL  స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం కవరేజ్ చూస్తుంటే చాలాకాలం క్రితం చదివిన ఒక జోక్ గుర్తొచ్చింది.

 ఓ విదేశీయుడు మొదటిసారి హైదరాబాద్ వచ్చాడు. ఓ ట్యాక్సీలో ప్రయాణం చేస్తున్నాడు.  అసెంబ్లీ పక్కనుంచి ట్యాక్సీ వెడుతుండగా దానిని చూపించి ఈ భవనం ఎవరిదని డ్రైవర్ ను అడిగాడు. 'పతానై' అని డ్రైవర్ జవాబిచ్చాడు. ఆ పక్కనే ఉన్న పబ్లిక్ గార్డెన్స్ ను చూపించి ఇది ఎవరిదని అడిగాడు. డ్రైవర్ 'పతానై' అన్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత హుస్సేన్ సాగర్ కనిపించింది. దీనిని ఎవరు నిర్మించారని అడిగాడు. డ్రైవర్ 'పతానై' అన్నాడు. మరికొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక శవయాత్ర కనిపించింది. పూల దండలతో కప్పేసిన శవం వెంట ఆడామగా చాలామంది వెడుతున్నారు. దారి పొడవునా కూడా పూలు జల్లుతున్నారు. 'ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు?' అని విదేశీయుడు డ్రైవర్ ను అడిగాడు. యథాప్రకారం అతను 'పతానై' అన్నాడు.

తను దిగిన హోటల్ కు చేరుకున్నాక ఆ విదేశీయుడు డైరీలో ఇలా రాసుకున్నాడు: "హైదరాబాద్ లో 'పతానై' అనే  ప్రముఖ వ్యక్తి ఉన్నాడు. అతడు చాలా ధనవంతుడు. అతనికి పెద్ద పెద్ద భవనాలు, తోటలు ఉన్నాయి. అతను నగరం మధ్యలో ఒక పెద్ద చెరువు నిర్మించాడు. విచిత్రంగా 'పతానై' ఈ రోజే చనిపోయాడు. అతని శవాన్ని పూలతో కప్పి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఎంతోమంది ఆ శవయాత్రలో పాల్గొన్నారు."

అలాగే, భారతదేశం గురించి, క్రికెట్ గురించి ఏమీ తెలియని వారు మీడియాలో రోజుల తరబడిగా సాగుతున్న IPL స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం కవరేజ్ చూస్తున్నారనుకోండి. అప్పుడు వాళ్ళు భారతదేశం గురించి బహుశా ఇలా అనుకుంటారు:

 "భారతీయులు  క్రికెట్ అనే ఆటను ఎక్కువగా అభిమానిస్తుంటారు. అసలు భారతదేశంలో most happening event క్రికెట్ ఒక్కటే. ఇక్కడ 'ఇండియన్ ప్రీమియర్ లీగ్' అనే క్రికెట్ సంస్థ ఉంది. అది 'ఇండియన్ పొలిటికల్ లీగ్' కన్నా కూడా చాలా గొప్పది, ముఖ్యమైనది.  ఆ సంస్థ నిర్వహించే క్రికెట్ పోటీలలో బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ జరిగినట్టు ఆరోపణలు రావడంతో కొంతమందిని అరెస్ట్ చేశారు. మీడియా చానెళ్లు ఈ ఒక్క అంశం గురించే రోజుల తరబడి, రోజంతా కథనాలు ప్రసారం చేస్తున్నాయి. దీనినిబట్టి  క్రికెట్ ప్రియులైన భారతీయులు ఈ పరిణామానికి తట్టుకోలేకపోతున్నారనీ, తమ అభిమాన క్రీడ భవిష్యత్తును ఊహించుకుని తీవ్ర  మనోవేదనతో కుంగిపోతున్నారనీ అర్థమవుతోంది. ప్రభుత్వం కూడా దీనిని చాలా సీరియెస్ గా తీసుకుంది. క్రికెట్ లో జరిగే మోసాలను అరికట్టడానికి కఠిన చట్టాలను తీసుకురావాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఈ కుంభకోణం పై మీడియా కవరేజీ; ప్రభుత్వం, రాజకీయ పార్టీల స్పందనా  చూస్తుంటే, భారతదేశంలో ఇప్పటికీ రోజుకు ఒక డాలర్ ఆదాయం కూడా లేని పేదలు కోట్ల సంఖ్యలో ఉన్నారనీ, జనాభాలో దాదాపు యాభై శాతం మంది పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారనీ, మానభంగాలు ఎక్కువనీ, ఇతర శాంతిభద్రతల సమస్యలు కూడా ఎక్కువేననే ప్రచారం కట్టుకథలా, భారతదేశం అంటే పడని వారు చేసే దుష్ప్రచారంలా కనిపిస్తోంది. నిజానికి భారతీయులు అత్యంత క్రీడాప్రియులనీ, క్రీడారాధకులనీ, అందులోనూ క్రికెట్ వారి ఆరాధ్యదైవమనీ, అదే వారి మతమనే అభిప్రాయం కలుగుతోంది. ఇన్ని రోజులుగా మీడియాలో రాజకీయాల ఊసే లేదంటే బహుశా భారతీయులు కారల్ మార్క్స్ చెప్పిన  state wither away స్థితిని అందుకున్నారనిపిస్తుంది. వాళ్ళను చూస్తే అసూయా కలుగుతుంది."

సరే, మన విషయానికి వస్తే, ఇటీవల రాజీనామా చేసిన కేంద్రమంత్రులు అశ్వినీ కుమార్, పవన్ కుమార్ బన్సల్ లు ఒక విధంగా దురదృష్టవంతులని- ఇతరులే కాక స్వయంగా వారు కూడా ఈపాటికి అనుకుని ఉంటారు. ఎలాగంటే, IPL స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం వార్త ఓ పదిహేను ఇరవై రోజుల ముందు వచ్చిందనుకోండి, అప్పుడు వారు 'spotlight' నుంచి తప్పించుకుని ఉండేవారు. రాజీనామా చేయాల్సిన అవసరం ఉండేది కాదు. మీడియా ఫోకస్  పూర్తిగా క్రికెట్ కుంభకోణం పైనే ఉండేది. అత్యంత ఆరాధ్యదైవమైన క్రికెట్టే సంక్షోభంలో పడితే మంత్రుల కుంభకోణాలు ఓ లెక్కా?!

అలాగే బహుశా రాజకీయాలలో దశాబ్దాలుగా ఉన్నవారు అసూయ చెందాల్సిన వ్యక్తి ఒకరున్నారు. ఆయన, గురునాథ్ మెయ్యప్పన్! ఆ పేరుగల వ్యక్తి ఒకరున్నారనీ, ఆయన బీసీసీఐ ఛైర్మన్ శ్రీనివాసన్ అల్లుడనీ మొన్నటిదాకా ఈ దేశంలో కోట్లాదిమందికి తెలియదు. మీడియా పుణ్యమా అని రెండు రోజుల్లో ఆయన పేరు దేశమంతా మారుమోగే పరిస్థితి వచ్చింది. ఆయనను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారని తాజా సమాచారం అనుకోండి. ఒకవేళ రేపు ఆయనకు వ్యతిరేకంగా పోలీసులు సాక్ష్యాలు సమకూర్చలేకపోవడంతో ఆయన నిర్దోషిగా బయటపడ్డారనే అనుకుందాం.  అప్పుడు ఆయన అశేష క్రికెట్ ప్రియుల సానుభూతిని చూరగొనే ఒక సెలెబ్రటీ అవుతారు. ఆ సెలెబ్రటి హోదాను పెట్టుబడి చేసుకుని ఆయన అనాయాసంగా పార్లమెంటు సభ్యుడూ కావచ్చు!

నిజంగానే ఈ దేశంలో క్రికెట్ ఒక మతమే ననిపిస్తోంది. మతం మత్తు మందన్న మార్క్స్ మాటల్లో నిజముందనీ అనిపిస్తోంది. క్రికెట్ దేవుడు ఆవహించిన ఈ దేశాన్ని ఏ దేవుడు రక్షించగలడు?!


No comments:

Post a Comment