Saturday, March 8, 2014

కేజ్రీవాల్ ది పబ్లిసిటీ యావే! కానీ అది లేనిదెవరికి?

 నరేంద్ర మోడి అభివృద్ధి, సుపరిపాలన అంటున్నారు.
రాహుల్ గాంధీ సెక్యులరిజం, ఇంక్లూజివ్ గ్రోత్ అంటున్నారు..
అరవింద్ కేజ్రీవాల్ అవినీతి, కార్పొరేట్ పాలన అంటున్నారు..

మొత్తానికి ముగ్గురికీ ఎవరి అజెండాలు వారికి ఉన్నాయి.
ఎవరి అజెండాలు వాళ్ళు పట్టుకుని ఎన్నికల యుద్ధానికి దిగారు.

కాకపోతే, అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాలు నడుపుతున్న తీరే ఎక్కువ విమర్శలను ఆకర్షిస్తోంది. ఎందుకు?

అవినీతి కొత్త సమస్య కాకపోయినా, కేజ్రీవాల్ రాజకీయాలు మాత్రం కొత్తగానే ఉన్నాయి. సాంప్రదాయిక రాజకీయాలకు అలవాటుపడిన కాంగ్రెస్, బీజేపీలకే కాక మిగిలిన పార్టీలకు కూడా ఇది మింగుడుపడడం లేదు. కేజ్రీవాల్ ఏం చేసినా వార్త అవుతోంది. ఆయన గుజరాత్ లో ఉన్న మూడు రోజుల్లోనూ మూడేళ్లకు సరిపోయే పబ్లిసిటీని సంపాదించుకున్నారు. మీడియా కెమెరాలన్నీ ఆయన చుట్టూనే పాతుకుపోయి ఉంటున్నాయి. నరేంద్రమోడీ అనే సింహం డెన్ లోకి నేరుగా వెళ్ళి ఢీకొన్న వీరుడిగా మీడియా ఆయనను ఫోకస్ చేస్తోంది. ఇంతకాలం కాంగ్రెస్ చేయలేకపోయిన పని ఆయన చేశాడనే వ్యాఖ్యాలూ వినిపిస్తున్నాయి. నరేంద్ర మోడీని కలవడానికి ఆయన చేసిన ప్రయత్నం అతిగానూ, నాటకీయంగానూ ఉన్న మాట నిజమే. తను కోరగానే మోడీ తన ఎంగేజ్ మెంట్లు అన్నీ రద్దు చేసేసుకుని వెంటనే అపాయింట్ మెంట్ ఇస్తారని కేజ్రీవాల్ కూడా అనుకుని ఉండరు. అది simply impossible. మోడీ ఒక ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి. ఆయనది ఎంత బిజీ షెడ్యూలో అర్థం చేసుకోగలం.

అయితే, కేజ్రీవాల్ కు నిజంగా కావలసింది మోడీని కలవడం కాదు, పబ్లిసిటీని తెచ్చుకోవడం. అది పూర్తిగా నెరవేరింది. ఇక్కడ రెండింటినీ వేరు చేసి చూడాలి. మోడీ తనకు వెంటనే అపాయింట్ మెంట్ ఇవ్వాలని కేజ్రీవాల్ కోరుకోవడం తప్పు. కానీ పబ్లిసిటీని కోరుకోవడం తప్పు కాదు. అదంతా పబ్లిసిటీ స్టంట్  అని ఇతర రాజకీయ పార్టీలు విమర్శించడంలో అసలే అర్థం లేదు. పబ్లిసిటీకి పాకులాడని పార్టీలు ఏవున్నాయి?

కేజ్రీవాల్ అవినీతి గురించి మాట్లాడడంలో కూడా ఒక కొత్త ఎలిమెంట్ ఉంది. ఆయన కేవలం ఉన్నత స్థానాలలో ఉన్న నాయకుల అవినీతి గురించీ, అవినీతి కుంభకోణాల గురించీ మాత్రమే మాట్లాడడం లేదు. పాలనా వ్యవస్థలో కింది స్థాయిలో ఉన్న అవినీతి గురించి కూడా మాట్లాడుతున్నారు. గుజరాత్ లో కూడా లంచం ఇవ్వనిదే ఏ పనీ జరగదని ఆరోపిస్తున్నారు.

నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా అవినీతి మరక అంటని స్వచ్ఛ చరితులే కావచ్చు. కానీ పాలనా యంత్రాంగం మొత్తాన్ని అలా చేయగలిగారా అన్న ప్రశ్నకు కేజ్రీవాల్ రాజకీయాలు అవకాశమిస్తున్నాయి. అంటే అవినీతిపై చర్చ విస్తృతమవుతోందన్న మాట. ప్రజల కోణం నుంచి అది మంచిదే కదా.


1 comment:

  1. అసలు కేజ్రీవాల్‌కు ఆ హక్కు ఉందా లేదా అనే విషయం ఓసారి ప్రశ్నించాలండి. నిన్నంటే నిన్ననే, ఆ.ఆ.పా. సంస్థాపక సభ్యులు పదకొండు ప్రశ్నలతో ఆ పార్టీ ఆఫీసుకు వచ్చారు కేజ్రీవాల్‌ను కలవటానికి. ముందు వాళ్ళు తమ పార్టీ కార్యకర్తలు కాదని కేజ్రీవాల్ బుకాయించాడు. వాళ్ళు సంస్థాపక సభ్యులుగా వాళ్ళ్ ధృవీకరణ పత్రాలు చూపించాక, మీకు టిక్కెట్లు ఇవ్వనని ప్రకటించాడు. నిజానికి, వాళ్ళు ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టు అడగటానికి రాలేదని తర్వాత వేరే ఛానల్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పటమే కాకుండా, తాము టిక్కెట్టు కోసం అప్లికేషన్ పెట్టామని ఆరోపించే ముందర ఆ అప్లికేషను బయటపెట్టమని కూడా ఛాలెంజ్ చేసారు. ఇదివరకు, వినోద్ బిన్నీ విషయంలోనూ కేజ్రీవాల్ ఇలాంటి తతంగాన్నే నడిపాడు. తనను ఇరుకున పెట్టే ప్రశ్నలు వేసేవాళ్ళందరూ టిక్కెట్లు దొరక్క యాగీ చేస్తున్నారని విమర్శిస్తున్నాడు. అంటేకానీ, వాళ్ళ ఆరోపణలకు, ప్రశ్నలకు మాత్రం సమాధానాలు ఇవ్వటంలేదు.

    ReplyDelete