Thursday, June 19, 2014

గవర్నర్ల విషయంలో ఇంత రభస చేయాలా?

యూపీఏ హయాంలో నియమించిన గవర్నర్ల తొలగింపు విషయంలో జరుగుతున్న చర్చ, రచ్చ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. మన ఆలోచనల్లో ఉండే హిపోక్రసీని బయటపెడుతున్నాయి. ఇది అన్ని పార్టీలూ కలసి ఒక అవగాహనకు వచ్చి అతి తేలికగా పరిష్కరించుకోగలిగిన విషయం. కానీ ఆ పని చేయకుండా అదే పనిగా రాజకీయం చేసి జనం ముందు అర్థంలేని ఆట ఆడుతున్నాయి.

1977 వరకు కాంగ్రెస్ ఒక్కటే కేంద్రంలో అధికారంలో ఉంది కనుక ఈ సమస్య రాలేదు. 1977లో జనతాపార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ నియమించిన గవర్నర్లను తొలగించింది. అప్పుడే ఈ విషయంలో ఒక అవగాహనకు వచ్చి ఉండవలసింది. రాలేదు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వం కాంగ్రెస్ నియమించిన గవర్నర్లను కొనసాగించింది. 2004లో యూపీయే ప్రభుత్వం ఎన్డీయే నియమించిన గవర్నర్లను తొలగించింది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం అదే చేస్తోంది. దీనిపై పెద్ద రభస.

దీనిని ప్రాక్టికల్ కోణం నుంచి చూద్దాం. మంత్రి పదవులు, ఇతర పదవులలానే గవర్నర్ కూడా ఒక పదవి. అధికారానికి వచ్చిన ఏ పార్టీ అయినా తన పార్టీవారికో, మిత్రపక్షం వారికో పదవులు ఇస్తుంది తప్ప ప్రతిపక్షాలకు ఇవ్వదు. ఇది సహజన్యాయం. మంత్రి, లేదా ఇతర పదవులను ఆశించేవారు ఉంటారు. పదవి ఇవ్వకపోతే అలిగే వారు ఉంటారు. అలాగే గవర్నర్ పదవికోసం ఆశించేవారూ ఉంటారు. 282 సీట్లు తెచ్చుకున్న అధికారపక్షం వీలైనంత ఎక్కువమందికి పదవులు ఇవ్వాలనుకుంటుంది. అందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే, పార్టీ విజయానికి ఎంతో మంది తోడ్పడి ఉంటారు. రాజకీయవాదులకు ఇవ్వచ్చా, ఇవ్వకూడదా అనేది వేరే చర్చ. అందులో కూడా అందరూ ఒక అవగాహనకు వస్తే మంచిదే. అలాగే, ఇతర రంగాలకు చెందిన కొందరు రాజకీయేతర ప్రముఖులూ అధికారపక్షం దృష్టిలో ఉండచ్చు. వీలైనంతలో అందరికీ అవకాశం కల్పించాలని ఆ పార్టీ అనుకుంటుంది.

గవర్నర్ పదవి అన్ని పదవుల్లాంటిది కాదు, అది రాజ్యాంగపదవి అనే వాదాన్ని ముందుకు తెస్తూ ఉంటారు. మిగిలినవేవీ రాజ్యాంగ పదవులు కానట్టు. గవర్నర్లను రాజకీయాలకు అతీతంగా చూడాలనేది ఇంకో హిపోక్రటిక్ వాదం. ఇలా అంటూనే ఆ పదవుల్లో రాజకీయవాదులను నియమించి కేంద్రానికి వాళ్ళను ఏజంట్లుగా వాడుకుంటూ అనేక భ్రష్టమైన పనులు వాళ్ళతో చేయిస్తూ ఆ పదవిని దిగజార్చివేస్తూ ఉంటారు. అలాగే ఎవరెవరో అనామకుల్ని తీసుకొచ్చి ఆ పదవిలో కూర్చోబెడుతూ ఉంటారు.

కనుక ఇప్పటికైనా ఈ హిపోక్రసీని పక్కన పెట్టి ప్రాక్టికల్ కోణం నుంచి, సహజన్యాయం నుంచి ఈ విషయాన్ని చూడాలి. అన్ని పార్టీలు ఒక అవగాహనకు రావాలి. కేంద్రంలో ప్రధాని రాజీనామా చేస్తే, మంత్రివర్గం రద్దయిపోతుంది. అలాగే ఆ ప్రధాని హయాంలో నియమితులైన గవర్నర్లు కూడా రాజీనామా చేసే ఏర్పాటు ఉండాలి. కొత్త ప్రధాని అధికారం చేపట్టి, గవర్నర్లను నియమించేవరకు పాత గవర్నర్లు ఆపద్ధర్మ గవర్నర్లుగా కొనసాగవచ్చు. ఒకవేళ పాత గవర్నర్లలోనే ఎవరినైనా కొనసాగించదలచుకుంటే, వారి రాజీనామాను తిరస్కరించవచ్చు. ఏ నిర్ణయమైనా తీసుకోగల వెసులుబాటు కొత్త ప్రధానికి ఉండాలి, ఎంతైనా రాష్ట్రపతి గవర్నర్లను నియమించేది మంత్రిమండలి సిఫార్సు పైనే. ఇందువల్ల గవర్నర్ పదవికి గల రాజ్యాంగ ప్రతిపత్తికి వచ్చే నష్టం ఏమీ లేదు.

మెడీజీ సమస్యను మేడ్ డిఫికల్టు చేస్తున్నారు. రాజ్యాంగ పదవి పేరిట గవర్నర్ పదవిని రాజకీయం చేయడం తప్ప ఇది మరొకటి కాదు. 

2 comments:

  1. భాస్కరం గారూ, అధికారంలోకి వచ్చిన వారు పాత గవర్నరులను మార్చడం అలాగే అవతలి వారు రభస చేయడం రెండూ ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. పాత్రలు తారుమారు అయ్యాయి అంతే.

    ReplyDelete
    Replies
    1. కానీ ఈ‌పని, ఘనతవహించిన కాంగ్రేసువారు చేస్తే, మీదియా ఇంత ఫోకస్ ఇచ్చి ఉండేది కాదేమో ఆలోచించండి. కాంగ్రెసేతర ప్రభుత్వం ఏదైనా అధికారంలోకి రావటం ఆలస్యం మీడియా అతి తక్షణం మొదలౌతుంది!

      Delete