Tuesday, February 19, 2013

ప్రతి యుద్ధోన్మాదీ ఈ బాలచంద్రుని హత్యకు బాధ్యుడే

ఈ ఫోటోను ఈ పాటికి చాలామంది చూసి ఉంటారు. కడుపు తీపి తెలిసిన తల్లులు, తండ్రుల పేగు కదలి ఉంటుంది. ఇతని పేరు బాలచంద్రన్ ప్రభాకరన్. తమిళ టైగర్ల నాయకుడు వేలుపిళ్లై ప్రభాకరన్ కొడుకు. ఇతని పేరు వినగానే పల్నాటి యుద్ధంలో మరణించిన బాలచంద్రుడి పేరు గుర్తొస్తోంది కదూ. అయితే, పల్నాటి బాలచంద్రుడు యుద్ధం చేసి మరణించాడు. నిరాయుధుడైన ఈ బాలచంద్రుడు శ్రీలంక సైనికులకు చిక్కాడు. వారు అతనికి బిస్కట్లు ఇచ్చి ఆ తర్వాత దగ్గరనుంచి ఛాతీకి గురిపెట్టి అయిదు తూటాలు పేల్చి చంపారు! అలా చంపడానికి రెండు గంటల ముందు తీసిన ఫోటో ఇది. తన ఆయువు ఇక రెండు గంటలే నన్న సంగతి ఈ బాలచంద్రునికి తెలియదు.

చంపిన సైనికుల్లో కొందరైనా పిల్లల తండ్రులుంటారు. ఈ బాలుని చంపేటప్పుడు వాళ్ళకు తమ పిల్లలు గుర్తొచ్చేరో లేదో తెలియదు. చంపడానికి ముందూ, చంపిన తర్వాతా వారు ఈ బాలుని ఫోటోలు తీశారు. ఎందుకు తీశారనుకుంటున్నారా? ఈ ఫోటోలు పైవారికి చూపిస్తే వారికి పతకాలు, ప్రమోషన్లు, నగదు బహుమతులు లభిస్తాయి. వారిని దేశభక్తులుగా గుర్తిస్తారు. బాలుని రక్తం చవి చూసిన ఈ కర్కోటక చర్యనే దేశభక్తిగా గుర్తించవలసివస్తే అలాంటి 'దేశభక్తి'ని ఎవరు కోరుకుంటారు?! శ్రీలంక సైనికులే కాదు అనేక దేశాల సైనికులు ఇలాంటి 'దేశభక్తి'ని తరచు ప్రకటించుకుంటూనే ఉంటారు.

 సైనికులనే అనుకోవడం దేనికి? తెల్లని పంచె, లాల్చీ, కండువా ధరించి సంస్కారవంతులుగా, నాగరికులుగా కనిపించేవారిలో కూడా సైనికులను తలదన్నే కరకు గుండెల వాళ్ళు ఉంటారు. ఉదాహరణకు, జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యం స్వామి లాంటివారు. తమిళ టైగర్లు ఇంతకంటే దారుణాలు చేశారని ఆయన అన్నారు. వారు పిల్లలకు కూడా సైనికశిక్షణ ఇచ్చి యుద్ధంలో ఉపయోగించుకున్నారనీ, ఈ బాలుడు కూడా 'క్రాస్ ఫైరింగ్' లో ప్రాణాలు కోల్పోయి ఉండచ్చనీ శ్రీలంక సైనికులను వెనకేసుకువచ్చారు. చొక్కా కూడా లేని ఈ బాలుడి ఫోటోలు చూస్తే ఇతడు యుద్ధంలో ఉన్నాడనీ, క్రాస్ ఫైరింగ్ లో చనిపోయాడంటే ఎవరూ నమ్మలేరు.

తమిళ టైగర్లు కూడా ఎన్నో ఘాతుకాలు చేసిన మాట నిజమే. అంతమాత్రాన ఈ బాలుని నిర్దాక్షిణ్య వధను సమర్థించగలమా? తమిళ టైగర్ల అధినేతను కూడా చంపేసి, తిరుగుబాటును నిర్వీర్యం చేసిన స్థితిలో ఈ బాలుని చంపవలసిన అవసరం ఏమొచ్చింది? పతకాలు, ప్రమోషన్లను మించి ఇంకే కారణం ఉంటుంది?

ఇంతకీ చంపడం, చావడం నిత్యకృత్యంగా, వీరోచితచర్యగా, గౌరవప్రదంగా భావించిన ఒకనాటి అనాగరిక దశనుంచి మనం ముందుకు వెళ్ళామా? అంతకంటే అనాగరిక, ఆటవిక దశకు తిరోగమించామా?

మహాభారతయుద్ధ సమయంలో కూడా అటువారు, ఇటువారు కూడా కొన్ని యుద్ధ నియమాలు పెట్టుకున్నారు. యుద్ధనీతి అవసరాన్ని గుర్తించారు. అక్కడక్కడ ఉల్లంఘనలు జరగడం వేరే విషయం. యుద్ధం వల్ల జరిగే జనక్షయాన్ని, ఇతర నష్టాలను  తలచుకుని ధర్మరాజే కాదు; మహావీరుడైన అర్జునుడు కూడా కలతచెందాడు. అయినాసరే, యుద్ధాన్ని, యుద్ధం పేరుతో జరిగే అనేకానేక అమానుషాలను దేశభక్తి పేరుతోనో, మరో పేరుతోనో నేటికీ సమర్థిస్తున్న మనం మహాభారతకాలం నుంచి ఎంత పురోగమించగలిగాం? నాగరికుల మనిపించుకోడానికి  మనం అర్హులమేనా?

బాలచంద్రుని నెత్తుటి  మరకలు అంటిన చేతులు కేవలం శ్రీలంక సైనికులవే ననుకోవడం పొరపాటు. ప్రపంచంలోని ప్రతి యుద్ధోన్మాది చేతులకూ అంటిన నెత్తుటి మరకలు అవి!


2 comments:

  1. "తెల్లని పంచె, లాల్చీ, కండువా ధరించి సంస్కారవంతులుగా, నాగరికులుగా కనిపించేవారిలో కూడా సైనికులను తలదన్నే కరకు గుండెల వాళ్ళు ఉంటారు"
    నిజమేనండీ...

    మరో క్షణం లో ఏమి జరుగుతుందో తెలియకుండా అమాయకంగా చూస్తున బాబు ఫొటో చూస్తే చాలా బాధగా అనిపించింది..

    ReplyDelete
  2. ఆలా అంటే చైనా కుక్కలు ఏడుస్తాయి.

    ReplyDelete