Saturday, February 9, 2013

అఫ్జల్ గురు ఉరి: patience please

భారత్ ఉగ్రవాదుల పట్ల మెతకగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం మనదేశంలోనే కాదు, బయటి దేశాలలో కూడా ఉంది. 2001లో పార్లమెంట్ పై దాడికి కుట్ర చేసిన అఫ్జల్ గురు ఉరితీతలో జరుగుతున్న అసాధారణ జాప్యం ఈ అభిప్రాయానికి మరింత ఊతమిచ్చింది. అయినాసరే ప్రభుత్వం అఫ్జల్ గురు విషయంలో ఆరేళ్లు ఆలస్యం చేసింది. ఈ పరిస్థితిలో నవంబర్ లో అజ్మల్ కసబ్ ను, ఈ రోజు అఫ్జల్ గురును ఉరితీయడం ద్వారా ఉగ్రవాదులకు, బయటి దేశాలకూ కూడా ఉగ్రవాదులపట్ల కఠినంగా వ్యవహరిస్తామన్న స్పష్టమైన మెసేజ్ ను భారత్ ఇంతకాలానికి ఇవ్వగలిగింది.

ఇది చాలా ముఖ్యమైన...ఈ దేశ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సందేశం. ఈ సందేశం ప్రాముఖ్యాన్ని  రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక్క గొంతుతో నొక్కి చెప్పినప్పుడే అది చేరవలసిన వారికి చేరుతుంది. ఇతరేతర అంశాల చాటున అది మరుగున పడిపోతే ప్రయోజనం ఉండదు.

నిజమే, అఫ్జల్ గురు ఉరితీతలో ప్రభుత్వం విపరీత ఆలస్యం చేసింది. ఆ అలస్యాన్ని చాలాకాలంగా ప్రశ్నిస్తూనే ఉన్నాం. ప్రశ్నించవలసిందే. అయితే, ఊరి తీసిన తరువాత కూడా ఎందుకింత ఆలస్యం చేశారన్న ప్రశ్నను తిరగ దోడకూడదు. కనీసం ఈ చర్య ద్వారా అందించే మెసేజ్ ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇచ్చే దేశాలు, వ్యక్తుల బుర్రల్లో నాటుకునే వరకైనా ఓపిక పట్టాలి. అలాగే, ఇంత  టైమ్  ఎందుకు తీసుకున్నారని ఇంతకాలం ప్రశ్నించినవారే, ఇప్పుడు 'టైమింగ్' ను ప్రశ్నించడం లోనూ ఔచిత్యం లేదు. బడ్జెట్ సమావేశాల ముందే ఎందుకు ఈ పని చేశారని అడగడమూ అర్థవంతంగా లేదు.

అఫ్జల్ గురు ఉరి ఒక ప్రభావవంతమైన పరిణామం. రోజువారీ విమర్శల తరహా దాడితో దాని ప్రాధాన్యాన్ని పలచన చేయడం మంచిది కాదు.

కాస్త వివేకాన్ని, సంయమనాన్ని పాటించడం అవసరం. అది కూడా కొద్ది రోజులపాటు...


No comments:

Post a Comment