Wednesday, February 26, 2014

రోటీ-కపడా-మకాన్ ఔర్ బీజేపీ

కొన్ని మార్పులు చాపకింద నీరులా వస్తాయి. ఆశ్చర్యం కలిగిస్తాయి. బీజేపీలో వచ్చినట్టు పైకి కనిపిస్తున్న మార్పు అలాంటిదే! 'పైకి కనిపిస్తున్న' అనే మాట ఎందుకు వాడానంటే, అందులో ఇంకా స్పష్టత రావలసి ఉంది కనుక.

ఆ మార్పు ఏమిటో చెప్పుకునే ముందు, అసలు రాజకీయాలు, అందులోనూ ప్రజాస్వామ్య రాజకీయాలు దేనికో ఒకసారి చూద్దాం...

రోటీ-కపడా-మకాన్ అనే మాట ఉంది. దీనిని కూడు, కట్టుకునేందుకు వస్త్రం, గూడు అని తెలుగులో చెప్పుకోవచ్చు. వీటికి అదనంగా భద్రతను కూడా చేర్చుకోవచ్చు. మనిషికి మౌలికంగా కావలసినవి, రాజకీయాలనుంచి ఆశించేవి ఇవే. విద్య, ఆరోగ్యం, ఉద్యోగం, అభివృద్ధి మొదలైనవన్నీ ఈ మౌలిక అవసరంలో భాగాలే. రాజకీయాలకు, లేదా ప్రభుత్వాలకు సర్వోన్నత బాధ్యత వీటిని సమకూర్చడమే. ఇవి ఎప్పుడైతే సమకూడాయో అప్పుడు మిగిలిన అవసరాలు ప్రజలే చూసుకుంటారు. వాటి విషయంలో ప్రభుత్వాలకు, రాజకీయాలకు ఎలాంటి జవాబుదారీ ఉండనవసరంలేదు.

భారతదేశం స్వతంత్రం కాకముందునుంచీ, అయిన తర్వాతా ప్రజల సమస్య రోటీ-కపడా-మకాన్ లే. స్వతంత్ర భారత ప్రభుత్వాలు ఆ దిశగా ఏవో కొన్ని అడుగులు వేశాయి. అయితే ఆ అడుగులు ఆశించినంత వేగంగా పడలేదనే అభిప్రాయం ఉంది. దానికితోడు అవినీతి లాంటి జాడ్యాలు ఆ అడుగులకు మరిన్ని బ్రేకులు వేస్తూ వచ్చాయి. ప్రతిపక్షస్థానంలో ఉన్న పార్టీలు చేయవలసింది ఆ సంగతిని వేలెత్తి చూపించడం. మేము అధికారంలోకి వస్తే ఆ పని చేస్తామని చెప్పడం. కొన్ని పార్టీలు ఆ పని చేస్తూనే వచ్చాయి...

మరి బీజేపీ?!

బీజేపీకి రోటీ-కపడా-మకాన్ గురించిన ఆలోచనలు లేవని కావు. ఉన్నాయి. అయితే అవి (కనీసం నిన్నటి వరకు)ఆ పార్టీ రాజకీయ తాత్విక పత్రంలోనూ, ఎన్నికల మేనిఫెస్టోలలో మాత్రమే ఉంటూ వచ్చాయి. పైకి మాత్రం హిందుత్వ, అయోధ్య, సాంస్కృతిక జాతీయవాదం వగైరాల గురించి మాట్లాడే పార్టీగానే జనానికి పరిచయమవుతూ వచ్చింది. ఆ మాటలతోనే ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్షస్థాయికి ఎదుగుతూ వచ్చింది.

ఒక ఉదాహరణ చూడండి...

తొంభైల ప్రారంభంలో దేశం ఆర్థికంగా ఒక సంక్షోభపరిస్థితిని ఎదుర్కొంది. ఆ సంక్షోభం మేధావులకే కాక మామూలు జనానికి కూడా మొదటిసారి ఆందోళన కలిగించింది. ఆ సమయంలో అప్పుడప్పుడే బీజేపీ అయోధ్య రథయాత్ర ముగించుకుంది. బాబ్రీ మసీదు కూల్చివేత దిశగా అడుగు వేస్తోంది. సరిగ్గా అప్పుడే పీవీ నరసింహారావు కీలకమైన కొన్ని ఆర్థిక చర్యలు తీసుకున్నారు. అవి సంక్షోభాన్ని గట్టెక్కించి దేశాన్ని నేటి అభివృద్ధి నమూనావైపు తీసుకు వెళ్ళాయి. ఈ నమూనా వల్ల మంచి జరిగిందా, చెడు జరిగిందా అనేది వేరే చర్చ. అందులోకి మనం ఇప్పుడు వెళ్లనవసరం లేదు.

అప్పుడు కూడా రోటీ-కపడా-మకాన్ పార్టీలు వాటి గురించి మాట్లాడుతూనే ఉన్నాయి. కానీ బీజేపీ తొంభైల ద్వితీయార్థంలో తను అధికారంలోకి వచ్చాకే వాటి మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తూ వచ్చింది. అప్పుడు కూడా ఆ మాటలతోపాటు, తనవైన పైన చెప్పుకున్న మాటలూ మాట్లాడుతూనే ఉంది. 2004లో తను అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఈ రెండు రకాల మాటలనూ కొనసాగిస్తూనే ఉంది. ఇప్పుడు, ఈ 2014లో మాత్రం ఆ పార్టీ రోటీ-కపడా-మకాన్ ల గురించే మాట్లాడాలని నొక్కి నొక్కి చెబుతోంది. ఇందుకు భిన్నమైన కమ్యూనల్ మాటలు మిగతా పార్టీలే మాట్లాడుతున్నాయని ఆక్షేపిస్తోంది. స్థానాలు ఎలా తలకిందులయ్యాయో చూడండి.

ఏమైనా బీజేపీ రోటీ-కపడా-మకాన్ లను నొక్కి చెప్పడం ఆహ్వానించదగిన పరిణామం. అయితే తన పాత అజెండా సంగతేమిటి? అందులో ఇంకా స్పష్ట త రాలేదు. సాంస్కృతిక జాతీయవాదం లాంటి లక్ష్యాలను ఆ పార్టీ సాంస్కృతికరంగ నాయకత్వానికి వదిలేసి తను ఒక రాజకీయ పక్షంగా రోటి-కపడా-మకాన్ లకే పరిమితమవుతుందా?....అదీ శేషప్రశ్న.


No comments:

Post a Comment