Sunday, February 9, 2014

మోడీ ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకా?!

రాజకీయనాయకులు ఆడిస్తున్నారా...లేక మీడియా ఆడిస్తోందా...లేక రాజకీయనాయకులూ, మీడియా కలసి ఆడిస్తున్నారా? మొత్తమ్మీద జనాన్ని ఆడిస్తున్నారు...జనంతో ఆడుకుంటున్నారు!

మీడియా, రాజకీయనాయకులూ కలసి జనాన్ని ఎలా ఆడిస్తారో జనసామాన్యానికి తెలిసే అవకాశం లేదు. అది రాజకీయనాయకులకూ, మీడియాకు మాత్రమే తెలుస్తుంది.

నాకేమనిపిస్తుందంటే, ప్రజాస్వామ్యం అంటే రాజకీయనాయకులూ, మీడియా కలసి రోజుల తరబడి, నెలల తరబడి, ఏళ్లతరబడి జనంతో ఆడుకొనే ఖరీదైన ఆట.

మీడియాలో ఉన్నవాళ్లకి ఈ రహస్యం కొంతవరకు తెలుస్తుంది. వాళ్ళు చాలా విషయాలలో  జరగబోయేది సరిగా చెప్పగలుగుతారు. ఎప్పుడో కానీ వాళ్ళ లెక్క తప్పదు. ఆత్మస్తుతి అనుకోకపోతే సరదాగా నా అనుభవాలు మీతో పంచుకుంటాను.

రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించే అవకాశం గురించి కోర్ కమిటీ సమావేశానికి వారం పది రోజుల ముందునుంచీ మీడియా అదేపనిగా ఊదరగొట్టింది. దానిపై డిబేట్లు కూడా జరిపింది. "చూస్తూ ఉండండి, రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించదు" అని పది రోజులముందే నేను జర్నలిస్టు మిత్రులతో అన్నాను. అదే జరిగింది.

తెలంగాణాకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకున్నాక సమైక్యాంధ్ర ఉద్యమం ఒక్కుమ్మడి పైకి లేచింది. అశోక్ బాబు అనే ఎన్జీవో నాయకుడు హఠాత్తుగా వార్తలలోకి వచ్చారు. ఉద్యమానికి మంచి ఊపు తీసుకొచ్చి తాడో పేడో తేల్చగల మనిషిగా ఆశాజీవులకు కనిపించారు. సమైక్యాంధ్రవాదులలో, ముఖ్యంగా హైదరాబాద్ లోని సీమాంధ్రజనంలో విభజన ఆగిపోతుందనే భ్రమ కలిగించారు. సమైక్యాంధ్ర వాదం ఇంత ఉవ్వెత్తున ఎగసిపడుతుందని కేంద్రం ఊహించి ఉండదని, ఇప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవచ్చని చాలామంది విద్యావంతులే నాతో అన్నారు. అశోక్ బాబును ప్రశంసించారు. ఒక టీవీ చానెల్ వాళ్ళు నన్ను అడిగినప్పుడు, కేంద్రం ఆ నిర్ణయం నుంచి వెనక్కి వెళ్లదని చెప్పాను. అదే జరిగింది. ఎలా చెప్పానంటే, నా అంచనాలు, నా లెక్కలు నాకున్నాయి.

ఆరు రాజ్యసభ స్థానాలకు రాష్ట్రంనుంచి జరుగుతున్న ఎన్నికలనే తీసుకోండి. కొంతమంది తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగారు. పైగా కాంగ్రెస్ నాయకత్వానికి సమైక్యాంధ్ర డిమాండ్ తడాఖా చూపించడానికే బరిలోకి దిగామన్నారు, ఇంకేముంది, రాజ్యసభ ఎన్నికలపై ప జనంలో ఎక్కడలేని ఉత్కంఠనూ, అధికారిక అభ్యర్థులలో ఆందోళనను సృష్టించడానికి మీడియా యథాశక్తి ప్రయత్నించింది. ప్రత్యేక కథనాలు రాసింది. చానెళ్లు ఎంతో air time ను ఖర్చుపెట్టాయి. కానీ అధికారిక అభ్యర్థులే బరిలోకి మిగులుతారని నాకు తెలుసు. అదే జరిగింది. నాకు ఎలా తెలుసునంటే మన రాజకీయనాయకుల వ్యక్తిత్వం మీద నాకు గురి ఉంది కనుక. principled stand తీసుకుని రాజకీయభవిష్యత్తుతో ఆడుకోడానికి వీళ్ళు వెనకటి విలువల దృష్టి ఉన్న చాదస్తపు రాజకీయ నాయకులు కాదు. కనుక వీరివి ఉత్తరకుమార ప్రగల్భాలని, తాటాకు చప్పుళ్లని ఊహించడానికి పెద్ద తెలివి అక్కరలేదు. మరెందుకు తిరుగుబాటు అభ్యర్థులుగా నిలబడ్డారంటారా? చైతన్యరాజు, ఆదాల ప్రభాకరరెడ్డి అనే జనానికి తెలియని ఆ ఇద్దరు అభ్యర్థులూ free గా ఎంత air time ను, న్యూస్ పేపర్ జాగాను వాడుకును పబ్లిసిటీ తెచ్చుకున్నారో ఒకసారి చూడండి.

ఇప్పుడు, నిజమో అబద్ధమో ఇంకా తేలవలసిఉన్న ఒక గెస్ గురించి చెబుతాను...

నరేంద్ర మోడి ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకి అని చాలా రోజులుగా నా మనసుకు గట్టిగా అనిపిస్తోంది. అలా అనిపించడానికి కారణాలు ఉన్నాయి. నా అంచనాలో మోడీ వ్యక్తిత్వం ఇందిరా గాంధీ వ్యక్తిత్వం లాంటిది. అందులో తాము అనుకున్న అజెండాయే తప్ప ఇంకొకళ్ళ అజెండా ఉండే చాన్సే లేదు. ఈ దేశంలోని ఒక రాష్ట్రాన్ని విడగొట్టి ఇంకో రాష్ట్రాన్ని సృష్టించడం అన్నది ఇందిర, మోడీ తరహా వ్యక్తిత్వాలు ఉన్న వారి అజెండాలో ఉండడానికి అసలే అవకాశం లేదు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్లకు స్టేటస్ కొ ను చెరపడం ఎంతమాత్రం ఇష్టం ఉండదు. ఒకవేళ చెరపాలనుకున్నా అది  తమ అజెండాలో ఉండాలి.  తమకు ఇష్టమైనదే వీరు చేస్తారు తప్ప ఇంకొకరు అడిగింది చేయరు. మోడీ తెలంగాణ గురించి మాట్లాడకపోవడం కూడా నా అనుమానానికి ఒక సమర్థన. రాష్ట్ర విభజన pre-modi అజెండా తప్ప post-modi అజెండా కాదన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి, ఇంతవరకు వచ్చాక తెలంగాణాను బీజేపీ ఆపగలదా అన్న ప్రశ్నను అలా ఉంచితే,  మొత్తానికి post-modi సందర్భంలో బీజేపీ  ఈ  విషయంలో లోలోపల ఏవో మల్లగుల్లాలు పడుతోందనే నాకు అనిపిస్తోంది. నా అంచనా ప్రకారం మోడీ రాష్ట్రవిభజనకు వ్యతిరేకి అనే విషయం ఎప్పటికైనా బయటపడితే, అది నిజమైన నా అంచనాలలో ఇంకొకటి అవుతుంది.





1 comment:

  1. మొన్న రీడిఫ్ లో వ్రాసాడు.
    వచ్చేది బిజెపి ప్రభుత్వమే కాబట్టి, తెలంగాణా తలనొప్పిని ఇప్పుడే వదిలించుకుంటే మేలని బిజెపి భావిస్తోందట.

    ReplyDelete