Saturday, July 6, 2013

ఔట్ సోర్సింగ్ పూజలు, కొరియర్ ప్రసాదాలు!

నా దగ్గరి బంధువు ఒకామెకి హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్ అమ్ముకోవాలనుకుంది.  చాలాకాలంగా తెలిసిన ఓ స్నేహితురాలు అమ్మి పెడతానని చెప్పి డాక్యుమెంట్లు తీసుకుంది. ఆ తర్వాత కొన్ని మాసాలకు తన సంతకం ఫోర్జరీ చేసి ఫ్లాటును ఎవరికో అమ్మేసినట్టు తెలిసింది. వాళ్ళు ఫ్లాట్ ను ఆక్రమించుకున్నారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది, కోర్టుల సంగతి తెలిసిందే కదా. ఎప్పటికి తేలుతుందో తెలియదు. ఇప్పటికే వేల రూపాయిలు ఖర్చు పెట్టింది.

అదలా ఉండగా, తిరుపతిలో ఉండే ఒకాయన పూజలు చేసి ఇలాంటి సమస్యలను పరిష్కరిస్తారని తెలిసి ఆయన ఫోన్ నెంబర్ సంపాదించి మాట్లాడింది. నా పూజతో మీ సమస్య ఇట్టే పరిష్కారమై పోతుందనీ, నేను తిరుపతిలోనే ఉండి పూజ చేస్తాననీ, డబ్బు ఖర్చు పెట్టుకుని మీరు కూడా రావలసిన అవసరం లేదనీ, తర్వాత కొరియర్ లో ప్రసాదం పంపిస్తాననీ, మీరు చేయవలసిందల్లా 15వేల రూపాయిలు చెక్కు పంపించడమే ననీ ఆయన చెప్పాడు. ఆమె క్షణకాలం సంశయించడం గమనించి, అందులో నేనేమీ తీసుకోననీ, అంతా పూజలకే ఖర్చవుతుందనీ, పని జరిగాక మీ సంతోషం కొద్దీ ఏమైనా ఇస్తే తీసుకుంటాననీ అన్నాడు. ఆలోచించి చెబుతానని ఆమె అంది,

నాతో ఈ విషయం చెప్పి డబ్బు పంపనా అని అడిగింది. వద్దు, ఇప్పటికే చాలా ఖర్చు పెట్టావు, మరికొన్ని వేలు నష్టపోవద్దని చెప్పాను. దాంతో ఆమె ఊరుకుంది.

ఇలాంటి వ్యాపారమూ, బేరసారాలు ఎక్కడైనా ఉంటాయా చెప్పండి? ఆయన తిరుపతిలోనే ఉండి పూజలు చేస్తాడట! పూజ చేయించుకునే మనిషి కూడా రావలసిన అవసరం లేదట! డబ్బు పంపితే చాలట! ఆయన పూజ చేశాడని నమ్మకమేమిటి? అదే విశ్వాసం మహిమ. మీరు పూజ చేశారో లేదో మాకు ఎలా తెలుస్తుందని సమస్యల్లో ఉన్నవారు అడగరనీ, ఏం చెప్పినా నమ్మేస్తారనీ ఆయన నమ్మకం. నిజంగానే అలా అడగని వాళ్ళు, డబ్బు పంపేసేవాళ్లూ ఉంటారు. ఏదో విధంగా సమస్య పరిష్కారం అయిపోతే బాగుండునన్న ఆతృత వారిని అలా నమ్మేలా చేస్తుంది. ఆ నమ్మకాన్ని కొల్లగొట్టి సొమ్ము చేసుకోవడమే అవతలివాళ్ళకు బతుకుతెరువు. తిరుపతి మనిషి లాంటివారు ఒకరు కాదు లక్షల్లో ఉంటారు.

చిట్ ఫండ్ కంపెనీల మోసాల గురించి వింటుంటాం. నిజానికి విశ్వాసాన్ని అడ్డుపెట్టుకుని చేసే వ్యాపారాలు, మోసాలు అంతకన్నా పెద్దవి. మోసపూరిత చిట్ ఫండ్ కంపెనీల వాళ్ళు డబ్బుతో పరారీ అయ్యే ముందు కొంతకాలమైనా మన ఎదురుగా ఉంటారు. వాళ్ళకో ఆఫీసూ, చిరునామా ఉంటాయి. మనిషి కనిపించకుండా పోస్ట్ ద్వారా లావాదేవీలు జరిపే వారి కన్నా ఆమేరకు వారు నయమే కదా!

ముందు పూజలు చేయండి, పని జరిగిన తర్వాత డబ్బు ఇస్తామని అంటే ఎలా ఉంటుంది? అప్పుడు వాళ్ళు ముందుకొస్తారా? రారు. ఎందుకంటే తమ పూజ వల్ల పని జరుగుతుందన్న నమ్మకం వాళ్లకూ ఉండదు కనుక. మరి పూజా సామగ్రికీ, ఆయన వెచ్చించే కాలానికీ, శ్రమకీ ప్రతిఫలం ఇవ్వద్దా అన్న ప్రశ్న రావచ్చు. అందుకు కావాలంటే కొంత మొత్తం పంపచ్చు. మిగతాది పని జరిగాక ఇస్తామని చెప్పచ్చు. దానికి వాళ్ళు ఒప్పుకుంటారా?  అదీగాక ఎక్కడో ఉండి పూజలు చేస్తాం, మీరు నమ్మండి అనడం ఎలా కుదురుతుంది?

విశ్వాసం తప్పుకాదు. వివేకం లోపించిన విశ్వాసంతోనే ముప్పు. 

2 comments:

  1. చెట్టు కింద నిలబడి ఒక రాయి విసిరితే అది ఆ చెట్టు కాయ/పండు యొక్క మూలానికి సరిగా తగిలితే, ఆ ప్రాంతం లో గ్రావిటీ (భూమ్యాకర్షణ) ఉంటే, కాయ కింద పడుతుంది. అంతేగాని ఒక మంత్రం చదవడం వల్ల అది కిందపడుతుందా? అయితే రాయి విసిరే ముందు దేవుడిని ఎందుకు తలచుకుంటారు? ఏకాగ్రత కోసం, రాయి సరిగా విసరడం వరకే నా పని, ప్రతిఫలం రావచ్చు లేక రాకపోవచ్చు అన్న సత్యాన్ని గుర్తుచేసుకోడానికి. అలాగే మనం చేసే పూజలైనా వ్రతాలైనా మన మనస్సుని సరైన ఆలోచనా విధానం లో పెట్టడానికి, ప్రశాంతత పొందడానికే తప్ప, "హాం ఫట్" అన్నట్లు సమస్య మాయమయిపోడానికి కాదు. కాబట్టి మిత్రులారా "ఈ పూజతోనో e-pooja తోనో మీ సమస్య తీరిపోతుందని" చెప్పే మోసగాళ్ళ మాటలు నమ్మకండి. అయినా భగవానుడే స్వయంగా చెప్పాడుగా "ఈ కలియుగం లో అతి సులువుగా నామస్మరణ ద్వారానే తనని పొందవచ్చు" అని. అలాంటపుడు రోజూ పొద్దున్న ఏకాగ్ర చిత్తం తో చేసే 5 నిముషాల ధ్యానమో ఇంకేదో చాలదూ? (మీరు ఏ మతం వారైనా సరే). ఆలోచించండి.

    ReplyDelete
    Replies
    1. స్పందనకు ధన్యవాదాలు సూర్యగారూ...

      Delete