Sunday, December 9, 2012

వోటు ఎగ్గొట్టిన ఆ ముగ్గురూ...

ఈ బ్లాగ్ ప్రారంభించాక గత రెండున్నర మాసాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఒకే ఒకటి (ఆంధ్ర రాజకీయాలు: ఒక ఆబ్సర్డ్ డ్రామా) మించి  రాయలేదు. ఆంధ్ర రాజకీయాలలో ఉత్తేజపరిచేవీ, ఉత్సాహపరచేవీ ఏవీ లేకపోవడం ఒక కారణం.  కనీసం చీల్చి చెండాడేటంత స్థాయీ, సరుకూ కూడా వాటిలో  లేకపోవడం ఇంకో కారణం. 'కలం' శోష తప్ప అందులో ఏమీ ఉండదు. జాతీయరాజకీయాలు ఎక్కువ ఆసక్తిదాయకంగా ఉండడం కూడా ఒక కారణమైతే కావచ్చు. ఒకవైపు ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుకోబోతున్న పండుగ వాతావరణంలో కూడా ఆంధ్రప్రదేశ్ గురించి ఇలా మాట్లాడడం... మీకే కాదు, ఒక తెలుగువాడిగా నాకూ బాధగానే ఉంటుంది. అయినా ఎంత నిష్టురంగా ఉన్నప్పటికీ, చెప్పుకోవలసిన సమయంలో  కొన్ని నిజాలు చెప్పుకోక తప్పదు.

జాతీయస్థాయి నుంచి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా అనామకంగా, ఆర్భకంగా కనిపిస్తుంది. కేంద్రంలో వరసగా రెండుసార్లు యూపీఏ అధికారంలోకి రావడానికి కావలసిన సంఖ్యాబలాన్ని సమకూర్చిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ దే అగ్రస్థానం. అయినాసరే, జాతీయ కాంగ్రెస్ లో మంచి 'విజిబిలిటీ' ఉన్న నాయకుడు తెలుగువాళ్లలో ఒక్కడూ కనిపించడు. కేంద్రం దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఒకడూ తద్దినం పెట్టేవాడి తమ్ముడిలానే కనిపిస్తాడు. రాష్ట్రానికి వచ్చేసరికి ప్రతివాడూ పులైపోతాడు. జైపాల్ రెడ్డి పార్లమెంటేరియన్ గా, వివాదరహితుడిగా, స్థాయి కలిగిన నేతగా ఒక ఇమేజ్ ఉన్నవారే. కానీ ఆయన ఎక్కువగా కనబడరు, వినబడరు. కాంగ్రెస్ కు ముప్పైమందికి పైగా ఎం.పీల నిచ్చిన ఈ రాష్ట్రం నుంచి క్యాబినెట్ హోదా ఉన్న మంత్రి నిన్నటివరకూ ఆయన ఒక్కడే.

పోనీ ఇతర పార్టీలలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందా అంటే, అదీ కనిపించదు. ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీలో ఒక్క వెంకయ్య నాయుడే కాస్త నదురుగా కనిపిస్తుంటారు. అది కూడా చాలా అరుదుగానే. ఆయనకు మరో ప్రత్యేకత కూడా ఉంది. కేంద్రస్థాయిలో ఎప్పుడైనా లిప్తకాలంపాటు ఆయన అలా తళుక్కు మంటుంటారేమో కానీ రాష్ట్రంలో మాత్రం మసక మసకే. ఇక సీపీయం నేత సీతారాం ఏచూరి కేంద్రస్థాయిలో కొంత గుర్తింపు ఉన్నవారే. అయితే తెలుగువాడే అయినా ఆయన పాదాలు తెలుగునాట ఎంత బలంగా ఆనాయో చెప్పలేం. ఢిల్లీ మనిషిగానే ఆయనను గుర్తించక తప్పదు. సురవరం సుధాకర్ రెడ్డి అవడానికి సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శిగా ఉన్నాతనకు ముందు ఆ హోదాలో ఉన్న ఏ.బీ. బర్దన్  ధాటిలో దూకుడులో విజిబిలిటీలో  సహస్రాంశం కూడా సురవరంలో కనిపించదు. కనిపించాలని రూలేమైనా ఉందా అని అడిగితే నేనేమీ చెప్పలేను.

మరి తెలుగుదేశం...?! నిజానికి దేవేందర్ గౌడ్ గురించి రాయబోయి ఇంత శాఖాచంక్రమణం చేశాను. రాయడానికి ఏమీ లేదనుకునే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను స్పృశించక తప్పని పరిస్థితిని కల్పించింది ఆయనే. ఆయనతో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు...సుజనా చౌదరి, గుండు సుధారాణి. అయినాసరే ముఖ్య ప్రేరణ దేవేందర్ గౌడే!

దేవేందర్ గౌడ్ ఎంత రాజకీయ జీవితం చూశారు! రాజకీయవిజ్ఞత, వివేకం అవసరమైన ఎన్ని కీలక పదవులు నిర్వహించారు! తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో ఆయన సెకండ్ ఇన్ కమాండ్ అనిపించుకున్న రోజులు ఉన్నాయి. అటువంటి వ్యక్తి రాజ్యసభకి  వెళ్ళేసరికి ఏమైంది?  విజ్ఞతా వివేకాలు ఒక్కసారిగా జీరో అయిపోయాయి. ఒక కీలకమైన రాజకీయ ప్రాముఖ్యం కలిగిన వోటు వెయ్యవలసిన రోజున  రాజ్యసభకు వెళ్లకుండా ఎగ్గొట్టి  ఓ సుజనా చౌదరితోనూ, ఓ గుండు సుధారాణితోనూ సమానం అయిపోయారు. రాష్ట్రం దాటితే మనవాళ్లు సైలెంట్ అయిపోవడమే కాదు, పార్లమెంట్ సభ్యత్వాన్ని విరామ సంగీతంగా, ఆటవిడుపుగా, టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా  తీసుకుంటారనడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా?

దేవేందర్ గౌడ్ లాంటి సీనియర్ కి రాజకీయంగా, పార్టీ పరంగా ఎఫ్.డీ.ఐ వోటు ఎంత కీలకమో ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. అది కేవలం ఎఫ్.డీ.ఐకి అనుకూలంగానో, వ్యతిరేకంగానో వేసే వోటు కాదు. రాజకీయ సంకేతాలను, రేపటి సమీకరణలను సూచించే వోటు. పార్టీల కమిట్ మెంటును, కప్పదాట్లను కూడా  వెల్లడించే  వోటు. వామపక్షాలతో, తృణమూల్ కాంగ్రెస్ తో కలసి వోటు వేయని టీడీపీ సభ్యులు రేపు ఏ మొహం పెట్టుకుని థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో 'థర్డ్ ఫ్రంట్' నాయకులకు మొహం ఎలా చూపిస్తారు? వాళ్ళతో గ్రూప్ ఫోటో ఎలా దిగుతారు?

ఎఫ్.డీ.ఐ వోటు అధికార/ప్రతిపక్షాలు ఉభయులకూ ఎంత ప్రతిష్టాత్మకంగా ఎంత జీవన్మరణసమస్యగా మారిందో కొన్ని రోజుల ముందునుంచే మీడియా ఊదరగొడుతోంది. అందులో కొంత అతి ఉంటే ఉండచ్చు, అది వేరే విషయం. మొత్తం మీద జనం దృష్టి, మీడియా చూపు రాజకీయపక్షాల మీద ఫోకస్ అయి ఉన్నాయి. చివరికి కాంగ్రెస్ సభ్యులలో ఒకరు వీల్ చైర్లో, ఇంకొకరు స్ట్రెచర్ మీద వచ్చి వోటు వేస్తే, రెండు కాళ్లతో   నడవగలిగిన స్థితిలో ఉండి కూడా మన  దేవేందర్ గౌడ్, ఆయన పార్టీ సహచరులు ఇద్దరు సభకు వెళ్లకుండా ముఖం చాటేశారు!

పైగా తను వోటు వేయకపోవడాన్ని అంత 'వివాదాస్పదం' చేయడంపై గౌడ్ 'హాశ్చర్యం' వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల తీర్మానం ఓడిపోతుందని ముందే తెలిసిపోయింది కనుక తను వోటు వేయకపోయినా నష్టముండదనే ఉద్దేశంతో అధినేత అనుమతితోనే గైరు హాజరయ్యానని ఆయన చెబుతున్నారు. అదే నిజమైతే అధినేత అనుమతి ఎలా ఇచ్చారో మరో ఆశ్చర్యం. గౌడ లానే మిగిలిన పార్టీలూ అనుకుని వోటింగ్ కు గైరుహాజరవచ్చు కదా! ఎందుకు కాలేదు?

మిగిలిన ఇద్దరూ తప్పు ఒప్పుకుని క్షమాపణ కోరినట్టు వార్త. అధినేత వాళ్ళను క్షమించి విడిచిపెడితే, నేరస్తులు ముగ్గురు కాదు, ఆయనతో కలుపుకుని నలుగురు అవుతారు. కనుక రాజీనామా చేయించడం ఉన్నంతలో పరువు నిలుపుకునే మార్గం. రాజ్యసభకు రాజీనామా చేయడం శిక్షగా వాళ్ళూ భావించనవసరం లేదు. రాజ్యసభలో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చునే ఆ కాలాన్ని సొంత వ్యాపారాలకు నిక్షేపంగా వినియోగించుకోవచ్చు!




No comments:

Post a Comment