Thursday, December 27, 2012

తెలుగు సభలు...నిరసనలు...శ్రీశ్రీ...

ఈ రోజు నుంచీ మూడు రోజులపాటు తిరుపతిలో 4వ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. సాధారణంగా ఇలాంటి సభలూ సమావేశాలూ జరుగుతున్నప్పుడు గుంపులో గోవిందం లా అనేకమందితో పాటు నాకు కూడా ఆహ్వానపత్రం అందుతూ ఉంటుంది. ఈసారి రాలేదు. కనుక సభల అజెండా ఏమిటో, ఏమేం కార్యక్రమాలు జరుగుతున్నాయో, ఎవరెవరు పాల్గొంటున్నారో నాకు తెలియదు. కార్యక్రమాల ఖరారు కూడా ఆదరాబాదరగా చివరి క్షణంలో జరిగిందని పత్రికలు రాశాయి కనుక ఆహ్వానపత్రాలు అచ్చుకావడంలో, పంపిణీ చేయడంలో కూడా అదే సంభవించి ఉండాలి. ఎవరెవరు వెడుతున్నారో తెలియక పోయినా; ఏ ఏ సంస్థలవారు వెళ్ళడం లేదో మాత్రం పత్రికల ద్వారా కొంత సమాచారం అందుతోంది. చివరికి తెలుగు భాషోద్యమ సమాఖ్యవారు కూడా సభలకు నిరసన తెలుపుతున్నారు.

జరిపేది ప్రపంచ స్థాయి సభలైనా ఏర్పాట్లు ఆఖరి క్షణం వరకూ డేకుతూనే ఉంటాయి. అదేమిటో తెలియదు. సభలు  ప్రారంభం కాకముందే ఏర్పాట్లపై విమర్శలు జోరందుకుంటాయి. సభలు జరుగుతున్నప్పుడూ, ముగిసిన తర్వాతా కూడా విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంటుంది. కాకపోతే వాటిలో వస్తువు మారుతుంది. అందులో సర్కారీ ఆధ్వర్యంలో జరుగుతున్నసభలైతే  ఇక చెప్పనే అవసరం లేదు. ఏర్పాట్లలోనేకాదు, కార్యక్రమాల నిర్వహణలో కూడా  త్వరగా తెమిల్చివేసే ధోరణి ఇలాంటి సభలలో తరచు కనిపిస్తుంటుంది.  తిరుపతి వరకూ వెళ్ళి మూడు రోజులూ గడిపి ఏమి వెంటబెట్టుకుని వెడుతున్నామని ఒకసారి సమీక్షించుకుంటే ఏమీ కనిపించదు. ప్రభుత్వం ఖాతాలో మాత్రం కోట్ల రూపాయిల ఖర్చు కొట్టొచ్చినట్టు(తిరుపతి సభల వ్యయం 40 కోట్లు అంటున్నారు) కనిపిస్తుంది.

ఈ సభలు కూడా నామ్ కే వాస్తే గా, ఆషామాషీగా జరిగిపోతాయా అన్న అనుమానాన్ని పెంచే సూచనలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. ఈ నెల 28నే తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ఢిల్లీలో జరగబోతోంది కనుక ముఖ్యమంత్రి చెప్పుల్లో కాళ్లు పెట్టుకునే సభల్లో పాల్గొనక తప్పదు. లేదా ఆయనతోపాటు రాజకీయప్రముఖులందరూ భౌతికంగా సభల్లో ఉన్నా మానసికంగా ఢిల్లీలో ఉండడం అనివార్యమవుతుంది. ప్రపంచ తెలుగు సభలు జరుపుకుంటున్నాం కనుక అఖిలపక్షాన్ని సభలకు ముందో, తర్వాతో ఏర్పాటు చేయమని మనవారు ఎందుకు ఢిల్లీని కోరలేదో తెలియదు. అదే తమిళులైతే ఏం చేసి ఉండేవారో!

తెలుగువారు అంతా కలసి ఇలాంటి సభలు జరుపుకోవలసిందే. అయితే అదేం చిత్రమో కానీ తెలుగు సభలు అనే సరికి భాష, సంస్కృతీ, సాహిత్యం, కళలు, సన్మాలు, సత్కారాలు,  కవిసమ్మేళనాలు వగైరాలు అజెండా మొత్తాన్ని కబ్జా చేసేస్తాయి.  వాటిని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. వాటితోపాటు, తెలుగువారి వ్యవసాయపరిస్థితులు, తెలుగువారి పరిశ్రమలు, తెలుగువారి జాబ్ మార్కెట్, తెలుగువారి పర్యాటక రంగం వగైరాలపై కూడా ఫోకస్ చేస్తే సభలు మరింత ప్రయోజనాత్మకం అవుతాయి. అన్నట్టు పారిశుద్ధ్యలోపం, పోషకాహార లోపంతో సహా అనేకానేక వికృతులతో కళావిహీనంగా మారిన తెలుగు పల్లెలపై దృష్టి పెట్టడం అత్యవసరాలలో ఒకటని నేను కొన్ని రోజులుగా రాస్తున్నాను.

ఇలాంటి సభల్లో కనిపించే మరో వింత ఏమిటంటే, భాష, సంస్కృతి, సాహిత్యం గురించి ఏమాత్రం తెలియని రాజకీయప్రముఖులు, ఇతర ప్రముఖులు వాటి గురించి మాట్లాడుతూ ఎక్కువ సమయం మింగేస్తారు. తీరా వాటి గురించి మాట్లాడవలసిన వక్తలను అయిదు నిముషాలలోనే ముగించమని నిర్వాహకులు తొందర పెడుతుంటారు. ప్రముఖ చరిత్రపరిశోధకుడు వకుళాభరణం రామకృష్ణ గారు ఒకసారి తన అనుభవాన్ని నాకు చెప్పారు. చెన్నైలో జరిగిన హిస్టరీ కాంగ్రెస్ సభలకు అనుకుంటాను, ఆయనను ఆహ్వానించారట. ఆయన ప్రసంగపాఠాన్ని తయారు చేసుకుని పదిహేను గంటలపాటు రైలు ప్రయాణం చేసి చెన్నై సభలకు వెడితే, మీరు అయిదు నిముషాలలో ముగించాలని సభాధ్యక్షుడు ఆదేశించాడట. ఇదేం పద్ధతని రామకృష్ణ గారు వేదికమీదే గొడవపడ్డారట. అప్పటినుంచీ ఎక్కువమంది వక్తలున్న సభలకు నేను వెళ్ళడం లేదని ఆయన చెప్పారు.

1975 నాటి ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంలో నిరసన దళానికి, గళానికి మహాకవి శ్రీశ్రీ నాయకత్వం వహించాడు. అప్పటి నిరసన ఉధృతికీ, ఇప్పటి నిరసనకూ  పోలిక లేదు. ఇప్పుడూ నిరసన వ్యక్తమవుతోంది కానీ, దానికి శ్రీశ్రీ లాంటి ఉత్తేజభరిత నాయకత్వం లేదు. అప్పట్లో జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనను ఉద్దేశించి 'బానిసకొక బానిసకొక బానిసా' అంటూ శ్రీశ్రీ తన సహజ శైలిలో చెప్పిన కవిత నాటి శ్రీశ్రీ అభిమాన యువత నాలుకలపై నర్తించింది. తెలుగు సభల సందర్భంలోనే శ్రీశ్రీని, మరికొందరు కవి రచయితలను ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలులో పెట్టింది. ఆ సమయంలో నేను అంత్యప్రాసలతో రాసిన ఒక ఔత్సాహిక కవిత పూర్తిగా గుర్తులేదు కానీ నాలుగు పంక్తులు గుర్తున్నాయి. అవి ఇవీ:

కటకటాలలోనె జరిగెను
భారత స్వాతంత్ర్య శిశూదయం
మరల అదే చోట ప్రభవించును
సమసమాజ ఉషోదయం

ఇక్కడే ఒక చిన్న వ్యక్తిగత అంశాన్ని ప్రస్తావిస్తాను. అరెస్ట్  తర్వాత కొన్ని రోజులకు శ్రీశ్రీ రాజమండ్రి వస్తున్నట్టు తెలిసి ఆయనపై నేను రాసిన కవిత తీసుకుని రాజమండ్రి పరుగెత్తాను. వీరేశలింగం టౌన్ హాల్ లో సమావేశం. శ్రీశ్రీ ఇంకా రాలేదు. అంతవరకు నేను శ్రీశ్రీ ని చూడలేదు కనుక ఆయన రాకకోసం ఉత్కంఠతో ఎదురుచూస్తూ ప్రేక్షకుల్లో కూర్చున్నాను. మా పక్కనుంచే విస్త్రీ కూడా లేని ముతక పైజమా, మోచేతుల చొక్కా ధరించిన ఒక బక్క పలచని ఆకారం వేదికవైపు నడిచి వెళ్లింది. సమావేశం మొదలై వేదిక మీదికి పిలిచిన తర్వాత ఆయనే మహాకవి శ్రీశ్రీ అని తెలిసింది. ఆయనే ఆ సమావేశానికి అధ్యక్షుడు కూడా. నాకు ఆశ్చర్యంతోపాటు ఆనందం కలిగించిన మరో విశేషం ఏమిటంటే, వేదిక మీదకి పిలిచినవారిలో ప్రముఖ దిగంబర,విప్లవ కవి చెరబండరాజు కూడా ఉన్నారు. ఆయనతో నాకు హైదరాబాద్ లో పరిచయం. ఆయన ద్వారా శ్రీశ్రీ మీద రాసిన కవితను శ్రీశ్రీ సమక్షంలోనే చదవచ్చనుకుని ఆశపడి వేదిక పక్కనే నిలబడి చెరబండరాజు దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశాను. చెరబండరాజు నన్ను చూసి ఆశ్చర్యపోతూ లేచి నా దగ్గరకు వచ్చారు. "నువ్వేమిటి ఇక్కడున్నావు?" అని అడిగారు. "మా ఊరు ఇక్కడికి దగ్గరే" నని చెప్పి, "శ్రీశ్రీ మీద రాసిన ఈ కవిత చదవాలని ఉంది. నాకు అవకాశం ఇప్పించా"లంటూ కవిత ఆయన చేతికి ఇచ్చాను. అది చదివిన చెరబండరాజు, "ఇలా రాసావేమిటి? మా ఉద్దేశంలో మనకింకా స్వాతంత్ర్యం రాలేదు కదా!" అన్నారు. నాకు ఏం చెప్పాలో తోచలేదు. "సరే, నువ్వు ఇక్కడే  ఉండు. శ్రీశ్రీ తో చెబుతాను. పిలిచినప్పుడు వద్దువుగాని" అని చెప్పి ఆయన వేదిక మీదికి వెళ్ళి నన్ను చూపించి శ్రీశ్రీ తో ఆ మాట చెప్పారు. శ్రీశ్రీ తల ఊపారు. అందరి ప్రసంగాలూ అయి శ్రీశ్రీ అధ్యక్షుడి మలి పలుకులు ప్రారంభించేసరికి చెరబండరాజు నొచ్చుకుంటూ నా దగ్గరికి వచ్చి"ఆయన మలి పలుకులు ప్రారంభించేశాడు. నీ కవిత విషయం మరచిపోయినట్టున్నాడు. ఏమీ అనుకోకు. ఆయన మీద రాసిన కవితే కదా, ఆయనకే ఇస్తాను, ఇటివ్వు" అని తీసుకుని వెళ్ళిపోయారు.

చెప్పొచ్చేదేమిటంటే, అప్పటికీ ఇప్పటికీ వంతెన కింద చాలా నీరు ప్రవహించింది. కానీ ప్రభుత్వం నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభల తీరు మారలేదు. జోరు తగ్గినా వాటిపై నిరసనల తీరూ మారలేదు.




2 comments:

  1. bhaskaram gaaru, mee phone number naa email lo pedtaaraa voka saari?

    ReplyDelete