Friday, December 28, 2012

నిజాల నేల విడిచి 'తెలుగు' సాము?!

తెలుగు భాష అస్తిత్వంపై ఉన్న భయాలు, అనుమానాల గురించి రాద్దామని కూర్చుంటే, ఇంతలో ఒక ముచ్చట గుర్తొచ్చింది. సీనియర్ పాత్రికేయులు, ఇండియా టుడే(తెలుగు) మాజీ సంపాదకులు ఎం. రాజేంద్ర గారు చెప్పారు. 1975 తెలుగు సభల వేదిక మీద 'మా తెలుగు తల్లికి మల్లె పూదండ' గీతాన్ని టంగుటూరి సూర్యకుమారి ఆలపిస్తున్నారు. ఆ గీతం పాడడానికే ఆమెను లండన్ నుంచి రప్పించారు. తనూ, మరికొందరు పాత్రికేయులూ వెనక వరసలో కూర్చుని ఉన్నారు. అంతలో ప్రవేశద్వారం వద్ద ఏదో వాదులాట వినిపించింది. మాసిపోయి మాసికలు పడిన దుస్తులతో ఆ పరిసరాలలో ఏమాత్రం ఇమడనట్టుగా కనిపించే ఒక వ్యక్తి, "ఆ పాట నేను రాసిందే, నన్ను లోపలికి వెళ్లనివ్వండి" అని అడుగుతున్నాడు. ద్వారం దగ్గర ఉన్నవారు ఒప్పుకోవడం లేదు. చిత్తూరు జిల్లాకు చెందిన రాజేంద్ర గారు, ఆ జిల్లాలోని మదనపల్లెలో ఉంటున్న ఆ వ్యక్తిని గతంలో చూశారు కనుక వెంటనే గుర్తుపట్టి సభల నిర్వాహకులకు చెప్పారు. అప్పుడు వారు ఆయనను తీసుకు వెళ్ళి వేదిక ఎక్కించి శాలువా కప్పి పంపించారు. ఆయనే శంకరంబాడి సుందరాచారి!

(ఆయన గురించి సి. పూర్ణచంద్ ఈ రోజు(డిసెంబర్ 28) ఆంధ్రజ్యోతి, నవ్యలో రాసిన వ్యాసం కూడా వీలైతే చూడండి)

ప్రభుత్వం చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. గీతం పాడడానికి ఎక్కడో ఉన్న టంగుటూరి సూర్యకుమారిని రప్పిస్తారు. కానీ అంతటి మహత్తర గీతానికి జన్మ నిచ్చిన కవి తమకు దగ్గరలోనే ఉన్నా పట్టించుకోరు.  అసలాయన  ఉన్నాడో లేడో కూడా ఆరా తీయరు. ప్రస్తుత సభల సందర్భంలో కూడా ఇలాంటి ముచ్చట్ల రికార్డులు ఎన్ని తయారవుతున్నాయో!  వేచి చూడవలసిందే.

ఇక తెలుగుభాష అస్తిత్వ భయాల గురించి...

1994లో ఒక వ్యక్తి, "మీతో మాట్లాడాలి" అంటూ నాకు ఫోన్ చేసి మరీ నా దగ్గరకు వచ్చారు. గుర్తుపెట్టుకోండి...అప్పటికి నూతన ఆర్థిక విధానాలు అడుగుపెట్టి రెండేళ్ళు మాత్రమే అయింది. విదేశీ ఉద్యోగాలు ఇంతగా పెరగలేదు. తెలుగు చానెళ్లు ఇన్ని లేవు.  అందులోనూ వార్తా చానెళ్లు అసలే లేవని చెప్పచ్చు. దూరదర్శన్ ఒక్కటే రాజ్యం ఏలుతోంది. సెల్ ఫోన్లు రాలేదు. ఇప్పటిలా ప్రపంచీకరణ విస్తరించి ప్రపంచం ఒక గ్రామం అయిపోలేదు. ఆ వ్యక్తి వస్తూనే, "తెలుగు భాషను కాపాడుకోవాలండీ" అన్నారు. "సరే, ఏం చేయాలని మీ ఉద్దేశం?" అని నేను అడిగాను. ఆయన దానికి నిర్దిష్టంగా జవాబు చెప్పలేదు. తెలుగు వాడకం ఎలా తగ్గిపోతోందో చెప్పి, "తెలుగును కాపాడుకోవలసిందే నండీ" అని మరోసారి నొక్కి చెప్పారు. "మీ ఊహలో ఉన్న ప్రణాళిక ఏమిటో చెప్పండి. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను ఎత్తేయలా? హిందీ దూరదర్శన్ ప్రసారాలు తెలుగువాళ్ళ మీద రుద్దవద్దని చెప్పదలచుకున్నారా? తెలుగు దూరదర్శన్ లో తెలుగు కార్యక్రమాల సమయాన్ని పెంచాలని అడగదలచుకున్నారా? నేటి తరంవారిలో తెలుగు మీద అభిరుచి పెంచే కార్యక్రమాలు ఇవ్వాలా? పుస్తకాలు ప్రచురించాలా?..." ఇలా నేనే ఆయనకు ఆలోచన అందించడానికి శతవిధాల ప్రయత్నించాను. కానీ ఆయన ప్రతిదానికీ తల అడ్డంగా ఊపారు. "మనకు ఇతర భాషా ద్వేషం ఏమీ లేదండీ. ఇంగ్లీషు ఉండవలసిందే, హిందీ ఉండవలసిందే. మన తెలుగును మనం కాపాడుకోవాలండీ" అని మరోసారి ఉద్ఘాటించారు. 'రావణుడితో రామునికి ఎలాంటి శత్రుత్వమూ అవసరం లేదు, కానీ సీత చెరవీడవలసిందే' అన్నట్టుగా ఆయన మాటలు ధ్వనించాయి. నిజం చెప్పాలంటే, 'తెలుగును కాపాడుకోవాలన్న' ఒక్క ముక్క తప్ప ఆయన ఏం చెప్పదలచుకున్నారో నాకు అర్థం కాలేదు. చూడండి చిత్రం, ఆయనా, నేనూ తెలుగులోనే మాట్లాడుకుంటున్నాఇలా అర్థం కాని పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఎందుకంటే, నేను మాట్లాడింది తెలుగే కానీ ఆయన మాట్లాడింది 'ఉద్యమం' అనే భాషలో! 'ఉద్యమం' అనేది దానికదే ఒక భాష అన్న అభిప్రాయం నాలో అప్పటినుంచీ బలపడింది.

1994 సంగతి చెప్పాను కానీ తెలుగు భాషా పరిరక్షణోద్యమం ఇంకా ముందే మొదలయ్యుంటుంది. 1994 తర్వాత, నేను పైన చెప్పినవన్నీ వచ్చాయి. అంటే ఏమిటన్నమాట? తెలుగు వాడకం ఇంకా తగ్గింది. తెలుగు వాడకం తగ్గినకొద్దీ సహజంగానే తెలుగు పరిరక్షణోద్యమం  ఇంకా పుంజుకుంది. అంటే తెలుగు వాడకం తగ్గడమూ, తెలుగు పరిరక్షణోద్యమమూ కలవని రైలు పట్టాలలా సమాంతరంగా పయనిస్తున్నాయన్న మాట. ఈ సమాంతరపయనం ఇలా ఎంతకాలం సాగుతుంది? ఎంతకాలమైనా సాగుతుంది సరే, చివరికి ఏ గమ్యానికి చేరుకుంటుంది?

ఈ సమాంతర పయనం ఎందుకు సంభవించింది అంటే, ఒక రైలు పట్టా పూర్తిగా కటిక వాస్తవికత అయితే, రెండో రైలు పట్టా, భాష బతకాలన్న కేవల ఆకాంక్ష కావడం వల్ల. ఆ రెండింటి మధ్యా వైరుధ్యం ఉంది. కటిక వాస్తవికత ఏమిటంటే, జీవన పోరాటం తొలి అంకంలో ఉన్న తరం చదువుల్లో, ఉద్యోగ విపణిలో పోటీని తట్టుకోడానికి అవసరమైన అన్ని వనరులను, అవకాశాలనూ వాడుకుంటూ మునుముందుకు వెళ్లిపోవడానికే ప్రాధాన్యమిస్తుంది. తెలుగు ఏమైపోవాలని మీరు వారిని గుచ్చి అడిగితే ఏమీ ప్రయోజనం ఉండదు.

ఒక తమాషా చూడండి...తెలుగు భాషోద్యమ సమాఖ్యకు అధ్యక్షుడిగా ఉన్న డా. సామల రమేశ్ బాబు గారి పిల్లలు ఇంగ్లీష్ మాధ్యమం లోనే చదివినట్టు నాకు ఈ రోజే తెలిసింది. తెలుగు భాషా పరిరక్షణోద్యమంలో క్రియాశీలంగా ఉన్న ఎంతోమంది పిల్లలు అదే చేసి ఉంటారనడంలోనూ ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, అది కటిక వాస్తవికత. నేను ఉద్యమంలో లేకపోయినా(అలాగని తెలుగు పరిరక్షణ పట్ల నాకు ఆసక్తి లేదని దయచేసి అపార్థం చేసుకోవద్దు) మా పెద్దబ్బాయిని పాఠశాల స్థాయిలో తెలుగు మీడియం లో చదివించాను. అప్పుడు నా అంచనా ఒకటే. తెలుగు మీడియంలో చదివినా ఇంగ్లీష్ వస్తుందని!  నా అనుభవాన్ని అబ్బాయి మీద ప్రయోగించాను. కానీ ఇంటర్ లో ఇంగ్లీష్ మీడియం లోకి మారి మావాడు చాలా ఇబ్బంది పడ్డాడు. మధ్యలోనే పొరపాటు గుర్తించి మా రెండో అబ్బాయిని స్కూలు స్థాయినుంచీ ఇంగ్లీష్ మీడియం లోనే చదివించాను.

ఇంతకీ కావలసినదేమిటి? ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో కూడా తెలుగును నిర్బంధం చేయడం, పాలనా వ్యవహారాలు తెలుగులో జరగడం, మీడియాలో అనవసరంగా  ఇంగ్లీష్ వాడకం మానేయడం వగైరాలు. ఇవేమీ అన్యాయమైన కోరికలు కావు. బుర్ర ఉన్న ఏ ప్రభుత్వమైనా పాఠశాల స్థాయిలో మాతృభాషను నిర్బంధం చేయకుండా ఉండదు. అందుకోసం కూడా ఉద్యమం చేయవలసి రావడమే మన ఖర్మ. ఇలాంటి ఆచరణాత్మకపార్స్వానికి తెలుగు సంస్కృతి, తెలుగు చరిత్ర, తెలుగు ఐక్యత, తెలుగువారి ఆత్మగౌరవం లాంటివి కూడా కలిపేసి అన్నింటినీ భావోద్వేగాల స్థాయికి తీసుకు వెళ్ళి సరళం చేయవలసింది కాస్తా సంక్లిష్టం చేస్తున్నామా అని నాకో అనుమానం. వాస్తవికత మరోలా ఉన్న పరిస్థితిలో తెలుగు వాదాన్ని భావోద్వేగాల స్థాయికి పెంచేసి అదే పనిగా రుబ్బుతూ ఉండడం వల్ల యువతలో ఒకవిధమైన అయోమయం, అపరాధభావం ఏర్పడే అవకాశం లేదా?

పిల్లల్ని విదేశీ ఉద్యోగాలకు పంపేసి, ఇక్కడ తమ లాంటి తల్లిదండ్రులు ఒంటరి జీవితం గడపవలసి రావడం గురించీ, మృగ్యమవుతున్న మానవసంబంధాల గురించీ, వెనకటి పల్లె జీవితంలో పరిఢవిల్లిన అనుబంధాల గురించీ సెల్ఫ్ పిటీతో కవిత్వం రాసే కవులు నాకు తెలుసు. పిల్లలు తెచ్చే డాలర్లు తీసుకుంటూ మనం ప్రతిగా ఏమిస్తున్నాం? మీరు మానవ సంబంధాలకు దూరమైపోయారనే అపరాధ మనస్తత్వాన్ని ఇస్తున్నాం. నిజం చెప్పాలంటే మన తరం వాళ్ళ కన్నా ఇప్పటి తరం వారు ఉదారంగా, విశాలంగా ఆలోచిస్తున్నారు.

అదలా ఉంచి పాఠశాల స్థాయి వరకూ తెలుగును నిర్బంధం చేస్తే తెలుగు బతుకుతుందన్న వాదనపై నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే, పాఠశాల విద్య తర్వాత ఒక వ్యక్తి తన చదువులోనూ, ఉద్యోగజీవితంలోనూ తెలుగేతర భాషా సాహచర్యంలోనే ఎక్కువ కాలం గడుపుతాడు. అదీగాక, పాఠశాల విద్య తర్వాతే అతడు మరింత విశాల ప్రపంచంలోకి ప్రభావాలలోకి అడుగుపెడతాడు. సొంత బుద్ధితో ఆలోచించడం కూడా అప్పుడే ప్రారంభిస్తాడు. ఈ పరిస్థితిలో అతడు పాఠశాల స్థాయిలో నేర్చుకున్న తెలుగు మిగులుతుందని చెప్పలేం. కనుక పీజీ వరకూ, చివరికి వైద్య, సాంకేతిక కళాశాల స్థాయిలో కూడా తెలుగు ఏదో ఒక పరిమితిలో కొనసాగవలసిందే. కావాలంటే, వైద్య, సాంకేతిక అంశాలు తెలుగులో ఎలా చెప్పాలో కసరత్తు చేసే అవకాశం వారికే ఇవ్వచ్చు. దానిని ఒక పరీక్షాంశం చేయచ్చు.

కావలసినవి నిర్దిష్టమైన చర్యలు.

యువతకు తెలుగును ఆకర్షణీయంగా 'ప్యాక్' చేసి ఇవ్వడానికి ఇంకా మరికొన్ని చేయచ్చు. ఇప్పటికే వ్యాసం పెద్దదైంది కనుక వాటి గురించి మరోసారి.





No comments:

Post a Comment