Saturday, January 19, 2013

రాహుల్ గాంధీ ప్రమోషన్:1

జైపూర్ లో జరుగుతున్న కాంగ్రెస్ చింతన్ శిబిర్ నుంచి ప్రస్తుతానికి చెప్పుకోదగిన సందేశాలు  రెండు అందాయి. మొదటిది, పట్టణ ప్రాంత జనానికి; ముఖ్యంగా యువతకు, మధ్యతరగతికి పార్టీ దగ్గరవాలన్న సోనియా గాంధీ సందేశం. రెండవది, రాహుల్ గాంధీని ఉపాధ్యక్షుడిగా నియమించడం ద్వారా పార్టీలో 'సెకండ్ ఇన్ కమాండ్' ఆయనేనన్న సందేశాన్ని అధికారికంగా అందించడం. క్రమంగా ఆయనే 'ఫస్ట్ ఇన్ కమాండ్' గా మారతారన్న విషయం ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు.

గమనించవలసింది ఏమిటంటే, యువతకు దగ్గరవాలన్న సోనియా సందేశానికి రాహుల్ పదోన్నతి ఒక సహజక్రియగా  కాంగ్రెస్ శ్రేణులు నమ్ముతూ ఉండచ్చు. కానీ క్షేత్రవాస్తవికత(గ్రౌండ్ రియాలిటీ)నుంచి చూస్తే పై రెండు సందేశాలు పరస్పర విరుద్ధమైనవని అర్థమవుతుంది. ఎలాగో చూద్దాం.

పట్టణ ప్రాంత జనాలు, యువత, మధ్యతరగతి క్రమంగా రాజకీయంగా తమ ఉనికిని స్థాపించుకుంటున్నారనీ, వారిని దూరం చేసుకోవడం పార్టీకి నష్టం కలిగిస్తుందనీ సోనియా గాంధీ సరిగానే గుర్తించారు. కాకపోతే పదేళ్ళు, లేదా కనీసం అయిదేళ్లు ఆలస్యంగా గుర్తించారు. నేటి యువత పది, పదిహేనేళ్ళ నాటి యువత కాదు. ఇంకా చెప్పాలంటే ముప్పై ఏళ్లనాటి యువత కూడా కాదు. ముప్పై ఏళ్ల క్రితం వరకు యువతతోపాటు మొత్తం  మధ్యతరగతి విద్యావంతవర్గం వోటుకు అంత విలువ లేదు. ఎన్నికలలో రాజకీయ అధికారాన్ని ప్రభావితం చేయగలిగిన శక్తి వారికి  లేదు. అది రాజకీయంగా విస్మృతవర్గం. ఎన్నికల్లో కనీసం వోటు హక్కును కూడా వినియోగించుకోని మందకొడి వర్గంగా వీరు విమర్శలను ఎదుర్కోవలసి రావడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. లేదా ఇదే కారణం కావచ్చు. కాంగ్రెస్ సహా  మధ్యేవాదపక్షాలు అన్నీ పాదయాత్రలు చేయడం, పల్లె బాటలు పట్టడం, కిలో రెండు రూపాయల బియ్యం వంటి ప్రజాకర్షక పథకాలు ప్రకటించడం వగైరాలన్నీ ఎన్నికలలో నిర్ణయాత్మక పాత్ర పోషించే గ్రామీణ వోటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగమే. ఇప్పుడు ఈ వోటర్ల ప్రాధాన్యం పోయిందని అనడంలేదు. కాకపోతే మధ్యతరగతి విద్యావంతవర్గం కూడా రాజకీయంగా గొంతు పెంచుకుంటోంది. సోనియా గాంధీ మాటలు ఆ గ్రహింపునే వెల్లడిస్తున్నాయి.

మరీ ముఖ్యంగా గత పది, పదిహేనేళ్లుగా చూస్తున్న యువత అంతకు ముందునాటి యువత కంటే భిన్నం. ఈ యువత ఉదారవాద ఆర్థికవిధానాల మధ్య కన్ను విప్పిన లేదా పెరిగిన యువత. సోనియా గాంధీ అన్నట్టు వెనకటి కంటే ఎక్కువగా ఆధునిక విద్యను అందుకుంటూ, ఆర్థికంగా బలపడుతూ; సమాచార హక్కూ, సోషల్ మీడియా వంటి వనరులతో సరికొత్త రాజకీయ చైతన్యాన్నిపుంజుకుంటూ, భావప్రకటనాశక్తిని సమీకరించుకుంటున్న యువత. అంతేకాదు, ఈ యువత పాత రాజకీయ సంస్కృతిలోని కొన్ని అంశాలను ద్వేషిస్తోంది. పాలకులనుంచి జవాబుదారీని డిమాండ్ చేస్తోంది.  ముప్పై ఏళ్ల లోపు వారు నేటి జనాభాలో 40 శాతం ఉన్నారు కనుకనే వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలనడం నేటి యువతపట్ల పూర్తి అవగాహనను ప్రతిబింబించదు. ఈ యువత గుణాత్మకంగానే(qualitatively) భిన్నమైనదన్న అవగాహన అవసరం.

గుణాత్మకమైన తేడా అలా ఉండగా, మధ్యతరగతి విద్యావంతవర్గంలో భాగంగా నేటి యువతకు కొన్ని చారిత్రక వారసత్వాలూ ఉన్నాయి. అది కనీసం 90 ఏళ్ల వారసత్వం. మొదట్లో గాంధీజీని వ్యతిరేకించిన సనాతనవాదులకూ; ఆ తర్వాత స్వతంత్ర భారతంలో తమను ఒక రాజకీయ అప్రధాన, విస్మృతవర్గం గా మార్చిన నెహ్రూ-ఇందిరాగాంధీల నాయకత్వంలోని కాంగ్రెస్ ను వ్యతిరేకించిన వారికీ నేటి యువత వారసులు. కాంగ్రెస్ విద్వేషం మధ్యతరగతి విద్యావంత వర్గపు ఇంటింటి వారసత్వం. కాంగ్రెస్ విద్వేషంలో కాంగ్రెస్ ఆనువంశిక అధికారం(కేంద్రంలో అత్యున్నత అధికారం నెహ్రూ-గాంధీ కుటుంబానికి పరిమితం కావడం) ఒక ముఖ్యమైన భాగమన్న సంగతిని మరచిపోకూడదు.

మళ్ళీ సోనియా గాంధీ సందేశం దగ్గరకు వెడితే; యువతను, మధ్యతరగతి వర్గాన్ని ఆకట్టుకోవలసిన అవసరాన్ని ఆమె సరిగానే గుర్తించారు. మరోవైపు, మధ్యతరగతి యువతకు ఏమాత్రం రుచించని ఆనువంశిక అధికార సంస్కృతికి అద్దం పట్టే రాహుల్ గాంధీ పదోన్నతికీ, కాంగ్రెస్ నేతలు ఆయనను పూలదండలతో ముంచెత్తుతున్న దృశ్యానికీ, వారి వందిమాగధ స్తోత్రాలకు మౌన సాక్షిగా, శ్రోతగా ఉండిపోయారు. అలా జైపూర్ చింతన్ వేదిక నుంచి జారీ అయిన రెండు ముఖ్య సందేశాలూ పరస్పర విరుద్ధంగా పరిణమించాయి.




3 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. as this tradition started and percolated downwards from Nehru only.

      Delete
    2. This comment has been removed by the author.

      Delete