Friday, January 4, 2013

అక్బరుద్దీన్ కేసు: చట్టం తన పని తాను చేస్తోందా?

ఇంతకీ ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ విషయంలో రూల్ ఆఫ్ లా అమలు జరుగుతోందా?

 'అమలు జరుగుతోందని' ప్రస్తుతానికి అంత కచ్చితంగా చెప్పలేం. అమలు జరిగీ జరగనట్టుగా ఉంది. పూర్తిగా అమలు జరగకపోవచ్చు. చివరికి, అసలే అమలు జరగలేదన్న అభిప్రాయం కలిగించినా ఆశ్చర్యంలేదు.

 భోపాల్ దుర్ఘటన కేసులో ఏం జరిగింది?  యూనియన్ కార్బైడ్ సీ ఈ ఓ వారెన్ యాండర్సన్ ను అరెస్ట్ చేసినట్టే చేసి మధ్యాహ్నానికి 'రూ.25 వేల'పూచీకత్తుతో బెయిల్ ఇచ్చేశారు. గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వవాహనంలో విమానాశ్రయంలో దిగబెట్టి దేశం దాటించేశారు. కనుక ఆయన విషయంలో రూల్ ఆఫ్ లా (అరెస్ట్ చేశారు కనుక)అమలు జరగలేదా అంటే జరగలేదని చెప్పలేం. కానీ యాండర్సన్ మళ్ళీ ఇండియాకు రాలేదు. 90 దాటిన వయసులో న్యూయార్క్ లో విశ్రాంతజీవితం గడుపుతున్నాడు. ఆవిధంగా చూస్తే యాండర్సన్ విషయంలో రూల్ ఆఫ్ లా అమలుకాలేదు.

బోఫోర్స్ ముడుపుల ఆరోపణ వెలుగుచూసిన పందొమ్మిదేళ్ళ తర్వాత,  నిందితులలో ఒకడైన ఆట్టోవియో కత్రోచీ విషయంలో 'రూల్ ఆఫ్ లా అమలుచేయడానికి' సీబీఐ శతవిధాల ప్రయత్నించింది. తీరా ఆయనను నిర్బంధంలోకి తీసుకోబోయేసరికి అంతవరకూ ఇండియాలోనే ఉన్న ఆయన కాస్తా మలేసియా జారుకున్నాడు. ఎలాగైనాసరే 'రూల్ ఆఫ్ లా అమలుచేయదలచుకున్న' సీబీఐ ఆయనను ఇండియా రప్పించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. తగిన సాక్ష్యాలు లేవని మలేసియా ప్రభుత్వం ఆయనను అప్పగించడానికి తిరస్కరించింది. ఆ తర్వాత రూల్ ఆఫ్ లా అమలులో భాగంగా సీబీఐ ఇచ్చిన ఎలర్ట్ కు స్పందించిన ఇంటర్ పోల్ అర్జెంటీనా లో కత్రోచీని నిర్బంధంలోకి తీసుకుని సీబీఐ కి ఆ విషయం తెలియజేసింది. పదహారురోజుల ఆలస్యంగా సీబీఐ ఒక బృందాన్ని అర్జెంటినా పంపింది. కానీ ఆ బృందం తాజా వారెంట్ లాంటి అత్యవసర పత్రాలు తీసుకువెళ్లడం మరచిపోయింది. దాంతో కత్రోచీ అప్పగింతకు నిరాకరించిన కోర్టు, ఆయన కోర్టు ఖర్చులు కూడా ఇండియాయే భరించాలని ఆదేశించింది. కత్రోచీ కడుపులో చల్ల కదలకుండా క్షేమంగా ఉన్నాడు. చెప్పొచ్చేదేమిటంటే, ఎంత ప్రయత్నించినా కత్రోచీ విషయంలో రూల్ ఆఫ్ లా అమలుకాలేదు.

అక్బరుద్దీన్ ది భిన్నమైన కేసైనా రూల్ ఆఫ్ లా వర్తింపులో పై ఇరువురితో కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. ఆయన డిసెంబర్ 8న నిజామాబాద్ లో, డిసెంబర్ 22 న ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో మతవిద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆరోపణ. డిసెంబర్ 9న...లేదా కనీసం 10న ఆయనపై కేసు దాఖలు చేసి ఉంటే రూల్ ఆఫ్ లా అమలుపై సందేహాలు వచ్చి ఉండేవికావు. కానీ అది జరగలేదు. ఈ లోపల ఆయన 22న మరోసారి అటువంటి ప్రసంగమే చేశారు. ఆ తర్వాతైనా వెంటనే కేసు దాఖలు చేసి ఉంటే రూల్ ఆఫ్ లా అమలు పట్ల సందేహాలు ముదిరి ఉండేవికావు. కానీ అదీ జరగలేదు. ఎట్టకేలకు కోర్టు చెబితే తప్ప రూల్ ఆఫ్ లా అమలుకు ప్రభుత్వం పూనుకోలేదు. 25 రోజుల తర్వాత కేసు దాఖలు చేశారు. ఈ లోపల అక్బరుద్దీన్ లండన్ వెళ్ళిపోయారు. ఆయన తిరిగి ఇండియాకు వచ్చిన మాట నిజమే. అయితే వచ్చి ఒక రోజు దాటిపోయినా ఆయనను అరెస్ట్ చేయలేదు. ఆయన కోర్టుకు హాజరు కావలసిన ఊళ్లలో 144 సెక్షన్ విధించారు తప్ప ఆయన ఇంటి ముందు జనం గుమి కూడకుండా నివారించలేదు. వైద్యపరీక్షల పేరుతో ఆయన కోరిన నాలుగు రోజుల గడువును ఇస్తున్నట్టే కనిపిస్తున్నారు. తేడా చూడండి...ఈ మధ్య మహారాష్ట్రలో ఒక అమ్మాయి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వ్యాఖ్యను పురస్కరించుకుని ఆమెను ఆగమేఘాల మీద అరెస్ట్ చేశారు!

అంతకుముందు, అక్బరుద్దీన్ పై చర్య తీసుకోవడంలో దాదాపు నెల రోజులపాటు ఆలస్యం ఎందుకు జరిగిందని అడిగితే, న్యాయ సలహాదారు అభిప్రాయం మొన్ననే(జనవరి 2) అందిందని పోలీసులు చెప్పారు. అంటే, అక్బరుద్దీన్ ప్రసంగాలు మతవిద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయో లేదో చెప్పడానికి న్యాయసలహాదారుకు  అన్ని రోజులు పట్టింది.  ఎందుకని? ఆయన అక్బరుద్దీన్ కావడం తప్ప మరో కారణం కనిపించదు. కత్రోచీనీ నిర్బంధంలోకి తీసుకున్నట్టు ఇంటర్ పోల్ తెలియజేసిన తర్వాత కూడా 16 రోజుల పాటు ఎందుకు తాత్సారం చేశారని అడిగితే, అర్జెంటినా నుంచి అందిన పత్రాలు స్పానిష్ భాషలో ఉండడం వల్ల తర్జుమాకు సమయం పట్టిందని సీబీఐ జవాబిచ్చింది (నిజానికి ఇంగ్లీష్ లోనే పత్రాలు అందాయని మరో సమాచారం).  అక్బరుద్దీన్ విషయంలో కూడా, ఆయన ప్రసంగాలు ఉర్దూలో ఉండడం వల్ల తర్జుమాలో ఆలస్యం జరిగిందంటున్నారు.  కత్రోచీ దేశం దాటిపోతుంటే చూస్తూ ఊరుకుని ఆ తర్వాత ఇంటర్ పోల్ ను ఎలర్ట్ చేసినట్టే; అక్బరుద్దీన్ విషయం లోనూ అవసరమైతే ఇంటర్ పోల్ సాయం తీసుకుంటామని పోలీసులు అన్నారు. గమనించారా, పోలికలు ఎంత బాగా కుదిరాయో! కేసు ఏమైనా కావచ్చు గాక, రూల్ ఆఫ్ లా అమలుపట్ల ఇలాంటివి జనంలో నమ్మకం కలిగించవు.

ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకుంటున్నది, అక్బరుద్దీన్ గురించో, యాండర్సన్, కత్రోచీల గురించో కాదు...రూల్ ఆఫ్ లా అమలు గురించి! అక్బరుద్దీన్ పార్టీ వాళ్ళు ఇదే రూల్ ఆఫ్ లా ను బాల్ థాక్రే, ప్రవీణ్ తొగాడియా తదితరుల విషయంలో ఎందుకు అమలు చేయలేదని అడగచ్చు. అలా అడగడం న్యాయమే. అలాగని అక్బరుద్దీన్ విషయంలో అమలు కాకూడదని వాళ్ళు అనకూడదు. అలాగే, బాల్ థాక్రే, ప్రవీణ్ తొగాడియా మద్దతుదారులు  అక్బరుద్దీన్ మీద చర్య తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నప్పుడు, మరి బాల్ థాక్రే, ప్రవీణ్ తొగాడియా వంటి వ్యక్తుల  విషయంలో మీరేమంటారని అడిగితే, సమాధానం దాటవేయకూడదు.

కానీ దురదృష్టం కొద్దీ ఇప్పుడు అదే జరుగుతోంది.  రూల్ ఆఫ్ లా అమలు డిమాండ్ కూడా పార్టీల ప్రాతిపదికన చీలిపోతోంది. ప్రభుత్వం ఇతరేతర ఇబ్బందులు, సానుకూలతలు, ప్రతికూలతల దృష్ట్యా రూల్ ఆఫ్ లా ను 'సెలెక్టివ్'గా అమలు చేయడం, లేదా కనిపించీ కనిపించనట్టుగా అమలు చేయడం మొదలైనవి దీనికి అదనం.

కనుక, ఈ దేశంలో ఇప్పుడు అత్యవసరంగా జరగవలసింది రూల్ ఆఫ్ లా అమలును కోరుకునేవారందరూ ఒక పార్టీగా ఏర్పడడం!

 చట్టాలను 'సెలెక్టివ్'గా అమలు చేసే అవకాశం ఎప్పుడైతే ఇచ్చారో, లేదా  ఎప్పుడైతే దానిని సమర్థించారో అక్బరుద్దీన్ లకు, ప్రవీణ్ తొగోడియాలకు, వరుణ్ గాంధీలకే 'న్యాయం' అందుతుంది తప్ప; ఒక సామాన్య హిందువుకు, ఒక సామాన్య ముస్లిం కు, ఒక సామాన్య క్రైస్తవునికి, ఒక సామాన్య దళితునికీ, ఒక సామాన్య ఆదివాసీకి ఎప్పటికీ న్యాయం జరగదు.

మానభంగ నేరాన్ని శిక్షించడానికి ఎంత కఠినమైన చట్టాన్నైనా తీసుకురండి. ఎన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులనైనా ఏర్పాటు చేయండి. కానీ, చట్టాన్ని 'సెలెక్టివ్'గా అమలుచేయడాన్ని మీరు ఎప్పుడైతే మౌనంగా అంగీకరించారో  అప్పుడు పలుకుబడి, డబ్బు, అధికారం ఉన్నవారిని ఎంతటి కఠిన చట్టాలైనా ఏమీ చేయలేవు. అవేవీ లేనివారు మాత్రమే శిక్షించబడతారు.

కనుక పార్టీ లకు అతీతంగా అందరూ రూల్ ఆఫ్ లా అమలును కోరుకోవాలి. రూల్ ఆఫ్ లాను కోరుకునేవారందరూ ఒక పార్టీ కావాలి.

ఈ దేశంలో మెజారిటీగా ఉన్న సామాన్యుడు రూల్ ఆఫ్ లాను కోరుకోవడం, కేవలం తప్పు చేసినవారిని శిక్షించి తీరాలన్న ధర్మాగ్రహంతో కాదు సుమా, అంతకంటే ముఖ్యంగా ఆత్మరక్షణ కోసం!


3 comments:

  1. మీ వ్యాఖ్యలతో నూరు శాతం ఏకీభవిస్తాను భాస్కరం గారు.
    ఇప్పుడు ప్రతీ చట్టం పార్టీ ప్రాతిపదిక మీదనే నడుస్తుంది తప్ప సామాన్యుడికి ఉపయోగపడేలా ఏదీ జరగట్లేదు.
    ప్రస్తుతం ఉన్న ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలలో ఎంతమంది రాజకీయ నాయకులు రూల్ ఆఫ్ లా సక్రమంగా అమలవాలని కోరుకుంటారు

    ReplyDelete
  2. సామాన్యుల విషయంలోనూ, తమకి కోపం ఉన్న వాళ్ళ విష్యంలోనూ కేసులు "సుమొటో"గా వచ్చేస్థాయి. ఇలా మతవిద్వేషాలని రెచ్చగొట్టే వారి విషయంలో అన్నీ సక్రమంగా చూసుకొని చట్టాన్ని వందసార్లు చదివి కానీ కేసు రావటంలేదు. చట్టం విషయంలో ఎటువంటి అనుమానం లేదు. అవి అమలు చేసేవారి కుల,మత రాజకీయాలు వల్లనే ఈ దుస్థితి. అక్బరుద్దీన్ లాంటి వారి విషయంలో సక్రమమైన చర్యలు తీసుకోక పోతే భారత్ లోని ప్రజలు ముస్లింస్ని అనుమానంగా చూస్తారు. బిన్‌లాడెన్ వలన ప్రపంచ ముస్లీములకి ఇదే గతి పట్టింది.

    ReplyDelete