Thursday, January 10, 2013

అక్బరుద్దీన్ కేసు: మెజారిటీ ప్రజల ప్రేక్షకపాత్ర ఎంతకాలం?

"ధర్మరాజు తన్నోడి నన్నోడెనా, లేక నన్నోడి తన్నోడెనా?" అని కౌరవసభలో శత్రుపక్షానికి చెందిన ద్రౌపది అడిగిన ప్రశ్న న్యాయమేనన్నవాడు మహాభారతంలో వికర్ణుడు ఒక్కడే కనిపిస్తున్నాడు. రెండు పక్షాలు కలబడుతున్నప్పుడు మధ్యలో నలిగి చచ్చేవి  న్యాయమూ ధర్మమేనని ఆనాడే నిరూపించిన పాత్ర వికర్ణుడు.

ఇప్పుడూ అదే జరుగుతోంది.

న్యాయ, ధర్మాలు, నిష్పాక్షికత  అనే ఒక తటస్థస్థితినుంచి నేటి ఆధునిక ప్రజాస్వామిక భారతీయ సమాజమూ దూరంగా జరిగిపోతోంది. రాజకీయాలు మతీకరణ చెందుతున్నాయి. మతాలు రాజకీయీకరణ చెందుతున్నాయి. బుద్ధిజీవులు రాజకీయీకరణ చెందుతున్నారు. నిజానికి న్యాయస్థానాలు, చట్టాలు అనేవి ఉన్నది సమాజంలో తటస్థభూమికను పోషించడానికే. అవి మనదేశంలో మనం తెచ్చుకున్న లౌకిక, ప్రజాస్వామిక రాజ్యాంగనిర్దేశాలను అమలు చేస్తాయి. రాజ్యాంగం కూడా తటస్థ ప్రాతిపదికపై రూపొందినదే. అది కుల, మత, ప్రాంత, భాషా, లింగ భేదాలకు అతీతంగా ఒక సమక్రీడాస్థలి(లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్)ని ఏర్పాటుచేసింది.

విచిత్రం, అంతకంటే విషాదం ఏమిటంటే, మనం చాలా వివాదాల సందర్భంలో తటస్థ రాజ్యాంగం ఉనికినీ, దాని వెలుగులో అవతరించిన చట్టాల ఉనికినీ మరచిపోతుంటాం. 1950(రాజ్యాంగం అవతరించిన సంవత్సరం)కి వెనకటి కాలంలోకి వెళ్ళిపోయి, అప్పటి వివాదాలను, అంతకంటే చాలాముందునుంచీ ఉన్న వివాదాలను 2013లోకి కూడా తీసుకొస్తుంటాం. ఆనాటి మైండ్ సెట్ తో మాట్లాడుతూ ఉంటాం. చట్టాలను చేతుల్లోకి తీసుకుంటుంటాం. అలా తీసుకోవడాన్ని సమర్థిస్తుంటాం. ఎవరో నిరక్షరులు సమర్థించడం కాదు, బుద్ధిజీవులు అనబడేవారు కూడా.

అక్బరుద్దీన్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రకటనలు చేసినవారు, రోడ్లమీద ప్రదర్శనలు చేసినవారు; అక్బరుద్దీన్ లానే మతవిద్వేషాలు రెచ్చగొట్టే ఇతరుల మీద కూడా చర్య తీసుకోవాలని అనడం లేదు. చర్య తీసుకోవలసిన అవసరం లేదా అని అడిగితే జవాబు దాటవేస్తున్నారు. ఒకవేళ వారిపై కూడా చర్యకు సిద్ధమైతే అందుకు వ్యతిరేకంగా వీరే మరోసారి రోడ్ల మీద నిరసన ప్రదర్శనలకు సిద్ధమవుతారు. అంటే ఏమిటన్న మాట? అక్బరుద్దీనా, ఇంకొకరా అన్నదానితో నిమిత్తం లేకుండా చట్టాన్ని అమలు చేయాలన్న మాట ఆ పక్షం నుంచీ, ఈ పక్షం నుంచీ కూడా వినిపించడం లేదు. రెండూ చట్టం ఉనికిని గుర్తించడం లేదు. లేదా చట్టాన్ని సెలక్టివ్ గా అమలు చేయాలని కోరుకుంటున్నాయి.

చట్టం ఉనికిని గుర్తించని ఈ దేశంలో, చట్టాన్ని సెలక్టివ్ గా అమలు చేయాలని కోరుకునే ఈ దేశంలో మరో పక్క ఉన్న చట్టాలు చాలవనీ, కఠిన చట్టాలు తేవాలనే డిమాండ్ వినిపిస్తోంది! ఎంత తమాషా!

ఒక హిందుత్వ అభిమాని నాతో మాట్లాడుతూ ప్రవీణ్ తొగోడియా, వరుణ్ గాంధీ లాంటివారు అక్బరుద్దీన్ అంత తీవ్రమైన ప్రసంగాలు చేస్తే చర్య తీసుకోవచ్చునన్నాడు. 'తీవ్రత'ను ఎలా అంచనా వేయాలి? ఎవరు అంచనా వేయాలి? నిజంగానే వారిపై చర్య తీసుకోవడమే జరిగితే, వారు అక్బరుద్దీన్ అంత 'తీవ్రం'గా మాట్లాడలేదు కనుక చర్య అన్యాయమని మళ్ళీ వారి అనుకూల వర్గాలే రోడ్ల మీదికి వస్తాయి. షరా మామూలుగా చట్టాల ఉనికి మరోసారి గల్లంతు అయిపోతుంది.

ఆ హిందుత్వ అభిమానే మరో మాట అన్నాడు. ముంబైలో ముస్లిం లు రోడ్ల మీద సామూహికంగా నమాజు చేసుకోడాన్ని బాల్ థాక్రే వ్యతిరేకించారట. దానికి పోటీగా రోడ్ల మీద దీప ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారట.

"రోడ్ల మీద నమాజు వల్ల వాహనదారులకు, పాదచారులకు, ఇళ్ళలో వారికి ఇబ్బంది కలుగుతుంటే ఆ ఇబ్బంది తొలగించమని కోరుతూ చట్టాలను ఆశ్రయించాలి కానీ పోటీ కార్యక్రమం వల్ల ఇబ్బంది ఎలా తొలగుతుంది?" అని అడిగాను.

 "ముస్లిం సంతుష్టీకరణ విధానాలను అనుసరించే కాంగ్రెస్ ప్రభుత్వం వారికి వ్యతిరేకంగా చట్టాలను అమలు చేస్తుందా?" అని ఆయన అడిగాడు.

"అప్పుడు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేయాలి. అంతే కానీ, చట్టం ఉనికిని అవతలివారు కూడా విస్మరించి పోటీ కార్యక్రమం నిర్వహించడం సమస్యకు పరిష్కారం ఎలా అవుతుంది?" అని అడిగాను.

ఒకవేళ ముస్లిం ల కంటే ముందే ఎవరైనా  రోడ్ల మీద దీప ప్రజ్వలన కార్యక్రమం నిర్వహిస్తే దానిపై కూడా థాక్రే, ఆయన భావజాలాన్ని సమర్థించే వారి స్పందన ఇలాగే ఉంటుందా?! ఉండదని చెప్పడానికి ఎవరూ సందేహించనవసరం లేదు. పొద్దుటే గుళ్లలో లౌడ్ స్పీకర్లు, రోడ్లమీద అయ్యప్ప భజనలు, గణేశ ఉత్సవాల పందిళ్ళు, బాణాసంచా పేలుళ్లు వగైరాలు వీరికి అభ్యంతరకరం కావడంలేదు. ముస్లింల నమాజే ఎందుకు అభ్యంతరకరం అవుతోంది? రెండిటినీ కూడా అసౌకర్య కోణం నుంచే చూసి నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కోరే సివిక్ సెన్స్ ఎందుకు లోపిస్తోంది?

తటస్థ రాజ్యాంగం వెలుగులో చట్టాలు చర్యకు ఉపక్రమించే లోపలే అటు వారూ, ఇటువారూ కూడా చట్టాలను చేతుల్లోకి తీసుకోవడం జరిగిపోతోంది. శాంతియుత, సామరస్య జీవనానికి కొన్ని తరాలపాటు మాపుకోలేని నష్టం జరిగిపోతోంది. ఎవరూ రాజ్యాంగం ఉనికినీ, చట్టాల ఉనికినీ గుర్తించడంలేదు. స్వతంత్ర ప్రజాస్వామిక భారతం అవతరించడానికి ఎంతో ముందునాటి చారిత్రక కక్షలనూ కార్పణ్యాలనూ తీర్చుకోడానికి అటూ ఇటూ కూడా ఉన్న అల్పసంఖ్యాకులు మొత్తం సమాజాన్నే యుద్ధరంగంగా మార్చివేయడం జరుగుతోంది. దీనికి మెజారిటీ ప్రజానీకం ఇలా నిశ్శబ్ద ప్రేక్షపాత్ర చిత్తగించడం ఎంతకాలం?

మతవిద్వేషాలను రాజకీయ పెట్టుబడిగా మలచుకునే శక్తుల వెనుక గుడ్డిగా జెండాలు మోసే వెట్టి చాకిరీ నుంచి విముక్తులై జనాలు రాజ్యాంగం వెలుగులో చట్టబద్ధ పాలనను కోరే ఒక మెజారిటీ పార్టీగా ఎప్పటికీ అవతరిస్తారు?!
                                                                ***
సంబంధిత పోస్ట్: అక్బరుద్దీన్ కేసు: చట్టం తన పని తాను చేస్తోందా?





2 comments: